English | Telugu

అసెంబ్లీలో టీడీపీ దాడి ఎఫెక్ట్.. రాత్రికి రాత్రే పంట‌ల బీమా సొమ్ము క‌ట్టిన ఏపీ స‌ర్కార్ 

అసెంబ్లీ మొదటి రోజు సమావేశంలోనే రైతుల పంటల బీమా విష‌యంలో వైసీపీ స‌ర్కార్ దారుణం గా దొరికిపోయింది. దీంతో తన తప్పు దిద్దుకునేందుకు ప్రభుత్వం రాత్రికి రాత్రి ప్ర‌య‌త్నం చేసింది. దీంతో ప్ర‌భుత్వం చెల్లించాల్సిన బీమా మొత్తం 590 కోట్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తూ ఆర్థిక శాఖ నుంచి రాత్రికి రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మొత్తాన్ని వైఎస్ఆర్ ఫసల్ బీమా యోజన పథకం కింద చెల్లించారు.

నిన్న అసెంబ్లీలో రైతుల స‌మ‌స్య‌లు, బీమాపై టీడీపీ వైసిపి ప్రభుత్వం పై తీవ్రంగా విరుచుకు పడింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుల్ని దారుణంగా ముంచేసిందని టీడీపీ మండిపడింది. ఈ విషయంలో రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా సాక్షాత్తు ప్రతిపక్ష నేత చంద్ర‌బాబు స్పీక‌ర్ పోడియం ముందు నేల‌పై కూర్చొని నిర‌స‌న తెల‌పడంతో.. తోటి టీడీపీ ఎమ్మెల్యేలతో సహా ఆయనను స‌ర్కార్ స‌స్పెండ్ చేసింది. అయితే తాము ఇన్సూరెన్స్ కట్టామ‌ని ప్ర‌భుత్వం మొదట వాదించ‌గా… ఆర్టీఐ ద్వారా తాము దీనిపై స‌మాచారం సేక‌రించామ‌ని టీడీపీ చెప్ప‌టంతో వైసీపీ ప్రభుత్వం వెంటనే మాట మార్చి.. డిసెంబ‌ర్ 15వ‌ర‌కు చెల్లిస్తామంటూ ప్ర‌క‌టించింది. అయితే ఇప్పుడు రాత్రికి రాత్రే 590కోట్ల‌ను పంటల భీమా కోసం విడుదల చేసింది.

వైసిపి ప్ర‌భుత్వం చేసిన ఈ ఆల‌స్యం కార‌ణంగా… ఈ ఏడాదిలో గడచిన ఏడు నెల‌లుగా పంటలు నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ అందే అవ‌కాశం లేదు. అయితే ఇప్పటి నుండి ఎదైనా న‌ష్టం జ‌రిగితే మాత్రం పంటల భీమా వ‌ర్తిస్తుంది. మరి ఇప్పటివరకు జ‌రిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. ప్ర‌భుత్వమే స్వయంగా ఇన్సూరెన్స్ ప్రీమియం క‌డ‌తామ‌ని చెప్ప‌టంతో రైతులు కట్టలేదు. ప్రభుత్వం కూడా.. ఇవాళ.. రేపు అంటూ వాయిదా వేసుకుంటూ వచ్చింది. చివరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఇన్సూరెన్స్ క‌ట్ట‌ని రైతుల‌ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.