English | Telugu

అక్రమంగా నిర్భయ కేసు.. హైకోర్టుకు అయ్యన్నపాత్రుడు

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై నిర్భయ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయ్యన్నపాత్రుడు తాత, మాజీ ఎమ్మెల్సీ రుత్తల లచ్చాపాత్రుడు చిత్రపటం తొలగించారని మున్సిపల్ కమిషనర్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. అయితే, తాజాగా అయ్యన్నపాత్రుడు తనపై కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అధికార పార్టీ విధానాలను ప్రశ్నిస్తున్నానన్న కక్షతో తనపై అక్రమంగా కేసులు పెడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల ఈ కేసును కొట్టివేయడంతో పాటు తదుపరి చర్యలను నిలుపుదల చేయాలని, పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అయ్యన్న హైకోర్టును కోరారు.