English | Telugu

హైద‌రాబాద్‌లో ప్లాస్మా దానానికి 32 మంది రెడీ! ఓవైసీ 

కరోనా వైరస్‌కి ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. దీంతో సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించడం, లాక్‌డౌన్, ఇమ్యునిటీ శక్తిని పెంచుకోవడమే ఆ కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టడానికి మన దగ్గరున్న మార్గం. అయితే ప్లాస్మా థెరపీతో కరోనాను కట్టడి చేయవచ్చని పలువురు వైద్యులు నిరూపిస్తున్నారు. ఈ తరుణంలో కరోనాను జయించిన వాళ్ల ప్లాస్మా.. కరోనా పేషంట్లకు ఇస్తే.. కోవిడ్ నయమవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే వీరిలో కొంతమంది ప్లాస్మా ఇచ్చేందుకు విముఖత చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ వ్యవహారంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కలుగజేసుకున్నారు. తానే దగ్గరుండి కరోనా నుంచి కోలుకున్న వారితో మాట్లాడి ప్లాస్మా దానానికి ఒప్పించారు. దాదాపు 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీ అయ్యారని.. తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్‌, మంత్రి కేటీఆర్‌కు లేఖలు రాశారు. వారి పేర్లను కూడా జత చేస్తూ లేఖను పంపించారు ఎంపీ అసదుద్దీన్.

అంతే కాదు కరోనా నుంచి కోలుకున్న ఢిల్లీకి చెందిన 200 మంది తబ్లీగీలు ప్లాస్మా దానానికి ముందుకు వచ్చారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ తీవ్ర అస్వస్థులుగా ఉన్న రోగులకు ఆ ప్లాస్మాతో చికిత్స జరుపుతారు. ఇఫ్తార్‌ ముగిశాక తబ్లీగీలు తమ ప్లాస్మాను దానం చేశారని, ఈ సేకరణకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్‌ మహమ్మద్‌ షోయిబ్‌ వెల్లడించారు.