English | Telugu

అప్పుల కొలిమి.. వేల కోట్ల అప్పు కావాలని కేంద్రాన్ని కోరిన జగన్ సర్కార్!

ఆదాయం సంగతేమో.. ఏపీకి అప్పులు మాత్రం బాగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రెండున్నర లక్షల కోట్ల అప్పులు నెత్తిమీద ఉన్నాయి. వైఎస్ జగన్ అధికార పగ్గాలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే అప్పుల భారం మరో 47 వేల కోట్లు పెరిగింది. ఇంకా 2000 కోట్లు అప్పు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇవి కాకుండా మరో 7000 కోట్లు అప్పు చేసుకునే అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ అవకాశం కూడా దక్కితే 10 నెలల్లో అప్పులు 56 వేల కోట్లకు చేరుకునే అవకాశముంది.

ఆరేళ్లు గడుస్తున్నా రాష్ట్ర విభజన కష్టాలు తప్పడం లేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జీడీపీలో అప్పుల వాటా 31.6 శాతంగా ఉంది. తెలంగాణ జీడీపీలో 17 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయి. విడిపోయాక నెత్తిమీద అప్పులు పెట్టుకుని.. కష్టాలతో ఉన్న ఏపీని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్రం సాయం చేయాల్సిన రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు పాలనలో రాష్ట్ర నిధులను ఎక్కువగా వాడాల్సివచ్చింది. ఏపీలో పరిశ్రమలు, సేవా రంగాలు లేనందున సహజంగానే ఆదాయం లేదు. దీంతో ప్రతి దానికీ అప్పులు చేయాల్సి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన సుమారు లక్ష 90 వేల కోట్ల రూపాయల అప్పుల భారం జగన్ సర్కార్ కు సంక్రమించింది. వాటిలో చెల్లించాల్సిన బిల్లులే 40,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇవికాక డిస్టలరీస్, సోలార్, విండ్ పవర్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు పెద్ద ఎత్తున ఉన్నాయి.

ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలే వేల కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితిలో ఉంది జగన్ సర్కార్. నవరత్నాలకు సర్కారు ప్రాధాన్యత ఇస్తుండడంతో బాకీల చెల్లింపులు ఆగిపోతున్నాయి. రుణాలు వాటి వడ్డీల భారం అంతకంతకూ పెరిగిపోవడంతో ఆర్థిక శాఖ పలుమార్లు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లింది. రాష్ట్ర పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే.. జగన్ కు సంపద సృష్టించటం చేతగాక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని చంద్రబాబు విమర్శిస్తున్నారు. పాలన చేతకాక పోతే పదవి నుంచి తప్పుకోవాలని ఇటు చంద్రబాబు అటు పవన్ విమర్శలు గుప్పిస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఏపీ రుణభారం జీఎస్డిపీలో 28.79 శాతంగా ఉంది. రాష్ట్రం విడిపోయాక అప్పుల భారం 96 వేల కోట్లు ఉండగా చంద్రబాబు సీఎం అయ్యాక లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఇక, జగన్ సీఎం అయ్యాక కేవలం ఈ ఎనిమిది నెలల్లోనే అప్పుల భారం మరో 47 వేల కోట్లు పెరిగింది.