English | Telugu
క్షమాపణలు కోరిన ఏపీ డిప్యూటీ సీఎం!
Updated : Apr 12, 2020
"జమాత్ నుంచి వచ్చిన ముస్లిం లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కలిగించే ప్రయత్నం చేశాను. కరోనా చికిత్స పొందుతున్న రోగులు వైద్యులకు సహకరించడం. ఇతరులకు వైరస్ అంటుకోకుండా జాగ్రత్త పడాలన్నదే నా ఉద్దేశం. ప్రతీ మతస్థుడు తమ ఆరాధ్య దైవాలను పూజించుకోవచ్చు. ప్రస్తుత కఠిన సమయం లో ఇళ్లలోనే ఇష్ట దేవతల ఆరాధన చేయాలనీ భాద్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి గా సూచిస్తు వస్తున్నాను. భావ వ్యక్తీకరణ లోపం కారణం గానే నేను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అంతేగాని ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బ తీయడం నా అభిమతం కాదు." అని నారాయణ స్వామి చెప్పారు.
"నాకు ముస్లిం సోదరులు పట్ల అపార గౌరవం ఉంది. ఈ విషయాన్ని నా ఆత్మసాక్షి గా చెబుతున్నాను. గత 5 సంవత్సరాలుగా నా వ్యక్తిగత భద్రత ను చూసే గన్ మెన్ కూడా ముస్లిం సోదరుడే. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ మతాన్ని, సామజిక వర్గాన్ని కించపరచలేదు. సమాజం లో SC, ST, BC మైనార్టీ వర్గాలు వెనుకబడి ఉన్నాయి. నేను కూడా అణగారిన SC వర్గానికి చెందిన వాడినే. ముస్లిం ల సంక్షేమం, అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న వ్యక్తిని. నా నియోజకవర్గం లో ప్రతీ ముస్లిం కి ఇంటి స్థలాలు మొదలుకొని అన్ని సంక్షేమ పధకాలు అందేలా పనిచేస్తున్నాను. వారిపై ఎలాంటి ద్వేషభావం లేని వ్యక్తిని. నా వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం పై ముఖ్యమంత్రి గారికి పూర్తి వివరణ ఇచ్చాను. దురదృష్టవశాత్తు నా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నా మాటలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తే క్షమించాలని కోరుకుంటున్నాను. నా మాటలను బేషరతుగా వాపసు తీసుకుంటున్నాను. అల్లా దయతో దేశం నుంచి కరోనా మహమ్మారి త్వరలోనే వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను." అని నారాయణ స్వామి వ్యాఖ్యానించారు.
నారాయణ స్వామి.. మర్కజ్కు వెళ్లొచ్చిన వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు భారీగా పెరగడానికి ఢిల్లీలో సామూహిక మత ప్రార్థనలను నిర్వహించడమే ప్రధాన కారణమని అన్నారు. మత ప్రార్థనల సమయంలో శుభ్రత పాటించి ఉండరని.. ప్లేట్లను కడగరని, స్పూన్లను నాకేస్తుంటారని అన్నారు. దేశ ప్రజలంతా ఓ పక్క ఉంటే, వీరు మాత్రం అర్ధంపర్ధం లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఓ వైపు విజ్ఞప్తి చేస్తుంటే, వీళ్లు మాత్రం ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నారాయణ స్వామి క్షమాపణలు చెప్పారు.