English | Telugu

మాస్క్ అవసరం లేదు చేతులు శుభ్రంగా ఉంచుకుంటే చాల‌ట‌!

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి పి.వి.రమేష్‌ తెలిపారు. సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరూ మాస్క్‌లు వేసుకోవాల్సిన అవసరం లేదని, చేతులు శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందన్నారు.

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకునేలా లైప్ స్టైల్ మార్చుకోవాల‌ని ఆయ‌న సూచించారు. కరోనా వైరస్‌ నిర్ధారణకోసం రక్త నమూనాలు పుణెకు పంపకుండా మన రాష్ట్రంలోనే పరీక్షించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కరోనా విషయంలో ఎవరూ భయపడొద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 3 అడుగుల దూరంలో ఉంటే ఒకరి నుంచి ఇంకొకరికి ఈ వైరస్‌ సోకే అవకాశం ఉండదన్నారు.

''జలుబు, దగ్గు వస్తే భయపడాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఉండి విశ్రాంతితీసుకుంటూ ఆరుగంటలకు ఒక సారి పారాసిటమాల్‌ వేసుకుంటే సరిపోతుంది. తీవ్రమైన జ్వరం, దగ్గు ఉంటే 104కు ఫోన్‌ చేస్తే ప్రభుత్వం తరఫున ప్రత్యేక అంబులెన్స్‌ వస్తుంది. సమీపంలోని ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తాం. 60 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుందని తెలుస్తోంది. బీపీ, షుగర్‌, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి'' అని రమేష్‌ కుమార్‌ వివరించారు.