English | Telugu
36 ఏళ్ల వయస్సులోనే కిమ్ చనిపోయాడా?
Updated : Apr 28, 2020
ఉత్తర కొరియా 1948లో ఏర్పడింది. అప్పటి నుంచీ దేశాన్ని కిమ్ కుటుంబమే పాలిస్తోంది. తదుపరి దేశాన్ని పాలించే నేత ఎవరన్నదానికి ఆమోదం తెలిపాల్సింది సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ. కానీ, ఇది నిజానికి ఓ రబ్బర్ స్టాంపు పార్లమెంటు లాంటిది. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా, దాని పరోక్ష వ్యక్తులే అందులో కీలకంగా ఉంటారు.
సాధారణంగా దేశాన్ని తదుపరి పాలించేది ఎవరన్నది కొన్ని నెలలు లేదా సంవత్సరాలు ముందుగానే నిర్ణయమవుతుంది.
ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ 1994లో మరణించిన తర్వాత ఆయన కుమారుడు కిమ్ జాంగ్ ఇల్ పాలక పదవిని చేపట్టారు.
ఇల్ సంగ్ తన కుటుంబానికి అధికార కేంద్రంలో సుస్థిర స్థానం సిద్ధం చేసే కాలం చేశారు. కొరియన్ నాగరికతలో పవిత్రంగా భావించే బయెకదూ పర్వతం నుంచి తమ వంశం దిగివచ్చినట్లుగా ప్రజల్లో భ్రమను నింపారు.
ఇల్ సంగ్ తన కుమారుడు కిమ్ జాంగ్ ఇల్ను వారసుడిగా నిర్ణయించారు. అనంతరం జాంగ్ ఇల్ తన కుమారుడు కిమ్ జోంగ్ ఉన్ను వారసుడిగా నిర్ణయించారు.
కిమ్ జోంగ్ ఉన్ వారసులు ఇంకా చిన్న పిల్లలు. వాళ్లెవరూ బయటకు కనిపించరు. అసలు ఉత్తర కొరియా ప్రజలకే వాళ్ల పేర్లు ఏంటో తెలియదు అధికారం కోసం ఇప్పుడే వారిని సిద్ధం చేసే అవకాశాలు చాలా తక్కువ.
కిమ్ జోంగ్ ఉన్ అకస్మాత్తుగా మరణించి, ఆయన స్థానంలోకి ఎవరూ రాకపోతే, దేశంలో అధికార శూన్యత ఏర్పడే అవకాశం ఉంది.
ఉత్తరకొరియాను కర్కశంగా పాలిస్తున్న నియంత కిమ్ జాంగ్ ఉన్ చనిపోయారా? ఇంకా స్పష్టత లేదు. అమెరికా - దక్షిణ కొరియా దేశాలు మాత్రం బతికే ఉన్నాడని చెబుతున్నాయి. అయితే సీఎన్ఎన్ సహా అమెరికా ఇంటెలిజెన్స్ మాత్రం చావు బతుకుల మధ్య ఉన్నాడని అంటోంది.
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ నియంతగా మారాడు. 2011లో ఉత్తరకొరియా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనకు పోటీగా ఉన్న బంధువులు - కుటుంబ సభ్యులందరినీ చంపించేసి వారి ఆచూకీ సైతం దొరకకుండా చేశాడు. అంతే కాదు కిమ్ అణ్వాయుధాలు తయారు చేసి అమెరికాకు పక్కలో బల్లెంలా మారి అమెరికాను బెదిరించాడు. పక్కనున్న దక్షిణ కొరియా - జపాన్ ను భయపెట్టాడు. చైనా అండతో చెలగేరిగిపోయాడు.
‘ద స్టార్’ పత్రిక కథనం ప్రకారం కిమ్ అధికారులను శిక్షించడానికి బ్రెజిల్ నుంచి ప్రత్యేకంగా ఫిరాన్హా అనే రాకాసి చేపలను వందల సంఖ్యలో దిగుమతి చేసుకున్నాడు. వాటిని ప్రత్యేక ట్యాంకుల్లో పెంచుతున్నాడు. అమెరికాతో చర్చలు విఫలమైన తర్వాత కిమ్ తన ముఖ్య అనుచరులు, జనరల్ స్థాయి అధికారుల చేతులను నరికించాడు. అనంతరం బతికుండగానే వారిని ఫిరాన్హా చేపలకు ఆహారంగా వేశాడు. ఉత్తర కొరియాకు సంబంధించిన సమాచారాన్ని అమెరికాకు రహస్యంగా చేరవేసిన కారణంగానే ఆ అధికారులను కిమ్ అలా శిక్షించాడు.
‘ద స్పై హు లవ్స్ మీ’ 1977లో విడుదలైన జేమ్స్ బాండ్ సినిమాలో విలన్ కర్ల్ స్ట్రామ్బర్గ్ తన శత్రువులను షార్కు చేపలతో నిండివున్న ఆక్వారియంలో పడేసి చంపుతాడు. ఆ సీన్ కిమ్కు బాగా నచ్చిందట. అందుకే ఫిరాన్హా చేపలకు ఆహారంగా అధికారుల్ని వేశాడు. అంతే కాదు తన శత్రువుల తలలు నరికించడం, సజీవంగా దహనం చేయడం, పులులకు ఆహారంగా పడేసి వికృతానందం పొందుతాడని ‘ద స్టార్’ పత్రిక రాసింది.
2017 అక్టోబర్లో అమెరికా వినాశనమే తమ లక్ష్యమని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ చేశారు. అమెరికాను ఈ భూమండలంపై అసలు ఉనికి అనేదే లేకుండా చేయడమే తమ లక్ష్యమని కిమ్ బహిరంగ హెచ్చరికను జారీ చేశారు. ఈ సందర్భంగా తన సైనికులతో ఒక ప్రతిజ్ఞ చేయించారు. మన లక్ష్యం ఒక్కటే... అమెరికాలోని ప్రధాన నగరాలపై విరుచుకుపడడం అని ఆయన తెలియజేశారు. తమతో కలిసి పని చేసేందుకు దాదాపు 47 వేల మంది యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా సిద్ధంగా ఉన్నారని ఉత్తరకొరియా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కిమ్ పాలనతో ఆదేశం 100 ఏళ్లు వెనుకబడిపోయింది. ఇప్పటికీ ఉత్తరకొరియాలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియదంటే అక్కడి జనాలు ఎంత అనాగరికంగా బతుకుతున్నారో అర్థం అవుతుంది.
పక్కనున్న దక్షిణ కొరియా ప్రపంచానికే టెక్నాలజీ అందిచే దేశంగా ఎదిగితే ఉత్తరకొరియా మాత్రం ఆకలిచావులతో అల్లాడుతోంది. అంత దుర్మార్గంగా పాలిస్తున్న కిమ్ చనిపోయాడా? బ్రతికున్నాడా అనే వార్తలపై ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.
కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు ను ప్రజలు చూసి ఏడు నెలలు అవుతోంది. గత మార్చి 28న ఆమె చివరిసారిగా భర్త కిమ్తో కలిసి ప్యాంగ్యాంగ్లో ఓ బహిరంగ కార్యక్రమంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె కనిపించలేదు. కిమ్ సోదరితో విభేదాల కారణంగానే సోల్ జు అదృశ్యమైందని కొందరు చెప్తుండగా.. స్వయంగా కిమ్ భార్యను చంపి ఉంటాడని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కిమ్ జాంగ్ విపరీతంగా పొగతాగేవాడు. భారీ శరీరం కావడం వల్ల 'కార్డియో వాస్కులర్'కు గురయ్యాడు. ఇటీవల సర్జరీ జరిగింది. ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్నాడు. పరిస్థితి సీరియస్ గానే ఉంది. గుండె సర్జరీ ఫెయిల్ కావడంతో ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడని అమెరికా ఇంటెలిజెన్స్ చెబుతోంది. ఏప్రిల్ 12న దక్షిణకొరియా వార్త సంస్థలు కూడా కిమ్ జాంగ్ గుండె శస్త్ర చికిత్స ఫెయిల్ అయ్యిందని సీరియస్ గా ఉన్నాడని కథనాలు రాశాయి.
ముగ్గురు సభ్యుల ప్రముఖ వైద్యుల బృందాన్ని చైనా ఉత్తరకొరియాకు పంపింది. కమ్యూనిస్టు పార్టీకి చెందిన లైనిస్ డిపార్ట్ మెంట్ నేతృత్వంలో ముగ్గురు వైద్యులు ఉత్తరకొరియాకు వెళ్లారు. ఏదో జరిగిందన్న అనుమానాలకు చైనా వైద్యబృందం వెళ్ళడం బలాన్ని చేకూరుస్తోంది.
ఏప్రిల్ 15న ఉత్తర కొరియా జాతి పిత కిమ్ 2 సంగ్ జయంతి వేడుకలు జరిగాయి. ఉత్తరకొరియా ఆవిర్భావానికి ఆయనే ఆద్యుడు. ప్రస్తుతం నియంత కిమ్ జాంగ్ కు తాత. ఈయన జయంతిని ఉత్తరకొరియా అంతటా పండుగలా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుతారు. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా హాజరయ్యే కిమ్ జాంగ్ ఈ ఏడు జయంతిలో పాల్గొన లేదు.
ఏప్రిల్ 11 నుంచి కిమ్ జాంగ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అప్పట్టి నుంచి కనిపించలేదు. ఎలాంటి అధికారిక సమావేశాల్లో పాల్గొనడం లేదు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్కి చెందిన రైలుగా చెప్పుకునే ఓ ట్రైన్... ఉత్తర కొరియాలోని రిసార్ట్ టౌన్లో వాన్సాన్ ఎలైట్ రైల్వే స్టేషన్ దగ్గర కనిపించింది. శాటిలైట్ ఫొటోల ద్వారా అది ఆ ట్రైనే కావచ్చని చెబుతోంది అమెరికా. సాధారణంగా కిమ్, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ట్రైన్ని ఉపయోగిస్తారు. ఉత్తర కొరియా తూర్పు తీరంలో ఈ వాన్సాన్ ఉంది. ఇక్కడ కిమ్కి అత్యంత ఎక్కువ భద్రత, రక్షణ ఉంటుంది. అందువల్ల ఆయన ఇక్కడే ఉండి ఉంటాడనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఒకవేళ కిమ్ జాంగ్ మరణిస్తే వారసురాలు ఎవరని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. అయితే కిమ్ జాంగ్ ఉన్ వారసత్వాన్ని ఆయన సోదరి 'కిమ్-యే-జాంగ్' అందిపుచ్చుకుంటారని ప్రచారం సాగుతోంది. కిమ్ జాంగ్ ఉన్ లక్షణాలనే చిన్నప్పటి నుంచి ఆయన సోదరి కిమ్ యే జాంగ్ వంటపట్టించుకున్నారట.. వాళ్ల కుటుంబంలో అన్నకు తోడు సర్వాధికారాలు కలిగి ఉంటే దేశంలో పాలనలో తనదైన ముద్ర వేస్తుందట. అధ్యక్షుడు కిమ్ జాంగ్ పాలన వ్యవహరాల్లో ఒక్క తన చెల్లెలు అయిన కిమ్ యే జాంగ్ నే నమ్ముతారు. విదేశీ నాయకులతో దక్షిణ కొరియాతో ఎలా డీల్ చేయాలో చెల్లెలు చెప్పినట్టు కిమ్ చేస్తారని ప్రచారంలో ఉంది. దీంతో కిమ్ మరణిస్తే నెక్ట్స్ వారసురాలు ఆమే కానుంది. కిమ్ జాంగ్ ఉన్ కంటే ఆయన సోదరి మరింత కఠినాత్మురాలని, డేంజర్ అని ఉత్తరకొరియా ప్రజల అభిప్రాయం. అప్పట్లో దక్షిణ కొరియాను ఈమె కుక్క మొరుగుతోందంటూ హెచ్చరించడం దుమారం రేపింది.