English | Telugu

గిఫ్ట్ ఏమోకానీ! శానిటరీ కార్మికులకు జీతాల్లేవట!!

"మున్సిపల్ పారిశ్యుద్ద కార్మికుల గురించి సీఎం కేసీఆర్ చెప్పే మాటలు చేతల్లో లేవు. వారికి పరిశుభ్రత కోసం సబ్బులు లేవు. గ్లౌజ్లు శానిటైజేషన్ వంటివి లేదు. వారికి అదనపు గిఫ్ట్ సంగతి పక్కకు పెడితే.. రెండు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు" అని తెలంగాణా పిసిసి అధ్య‌క్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శానిటైజేషన్ వర్కర్లు పోలీసులు హెల్త్ సిబ్బందితో పాటు అత్యవసర సేవల్లో ఉన్న వారికి 30శాతం అదనంగా జీతాలు ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో అర కిలోమీటర్ కు ఒక అన్నదాన కేంద్రమని సీఎం కేసీఆర్ ప్రకటించారని, అయితే అవి ఎక్కడా కన్పించడం లేదని ఆయ‌న ఆరోపించారు. కరోనా వైరస్ అరికట్టడం కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చులు నామమాత్రమేనని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రకటనలకు వాస్తవానికి మధ్య ఎంతో తేడా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు ఆగిపోయాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కరోనా కంటే ముందు నుంచే 7500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెలో ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోమని వారు కోరుతున్నా. కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లాక్ డౌన్ తో ఆదాయం తగ్గింది అంటున్న సీఎం కేసీఆర్ గతంలో బాండ్ల ద్వారా సేకరించిన 3500 కోట్ల రూపాయలు ఏమీ చేశారో సమాధానం చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో అధికార ప్రతిపక్ష మధ్య కరోనా కేంద్రంగా విమర్శలు-ప్రతి విమర్శలు హాట్హాట్గా కొన సాగుతున్నాయి.