English | Telugu

సిట్ పై స్టే ఎత్తివేతకు సుప్రీం కోర్టు నిరాకరణ.. జగన్ సర్కార్ కు మరో ఎదురు దెబ్బ

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ సమీక్షించి తప్పులు జరిగి ఉంటే వాటిపై కేసులు నమోదు చేసేందుకు ఏర్పాటు చేసిన సిట్ పై ఏపీ హైకోర్టు గత సెప్టెంబర్ లో స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన స్టే పై జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఈరోజు జరిగిన విచారణలో జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది. అయితే దీనిపై ప్రతివాదులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్, సిట్, డీజీపీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని వారిని ఆదేశించింది. అలాగే స్టే పై తదుపరి విచారణలో తాము తుది నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. ఇదే సమయంలో అమరావతి భూముల విషయంలో సీబీఐ దర్యాప్తు కోరామని.. ఐతే దీనిపై కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఏపీ ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ఏపీ హైకోర్టు గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో, దాని సిఫారసు మేరకు సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోలపై స్టే విధిచింది. ప్రభుత్వం చెబుతున్న నేరాలకు సంబంధించిన దర్యాప్తులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని, అంతేకాకుండా మంత్రివర్గ ఉపసంఘం, సిట్‌ ఏర్పాటు, కొనసాగింపును సమర్థించే ఆధారాలు కూడా లేవని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎప్పుడైనా ఫిర్యాదు చేశాకే నేరం నమోదవుతుందని.. కానీ ఇక్కడ నేరం నమోదు కావడానికి ముందే దర్యాప్తు చేయడంతో పాటు ఆయా నేరాలను విభాగాలుగా మార్చడం దగ్గర్నుంచి ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు అభ్యర్థించడం వరకు అన్నీ లోపభూయిష్టమేనని హైకోర్టు ఆక్షేపించింది. దీంతో నాలుగు వారాల తర్వాత సుప్రీంకోర్టులో జరిగే విచారణతో ఈ సిట్‌పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.