English | Telugu

పొగ‌రాయుళ్ల‌కే 'పొగ' పెడుతున్న వ్యాపారులు

* ఆంధ్ర లో 150 శాతం పెరిగిన సిగరెట్ ఉత్పత్తుల ధరలు
* వాణిజ్య పన్నుల శాఖ ఉదాసీనతపై భగ్గుమంటున్న సిగరెట్ గిరీశాలు!

ఓ పక్క కరోనా దెబ్బకి అన్ని వస్తువుల వినిమయం పెరుగుతుంటే, మరో పక్క విజయవాడ లో మాత్రం సిగరెట్ తాగే గిరీశాలకు స్థానిక వ్యాపారాలు మాత్రం చుక్కలు చూపెడుతున్నారు. పొగాకు ఉత్ప‌త్తులు నిత్యావ‌స‌ర వ‌స్తువులు కాక‌పోవ‌డంతో ప్ర‌భుత్వ అధికారులు దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం తో , పొగాకు ఉత్పత్తుల నిల్వలు భారీగా పెరిగిపోయాయి.

ఇత‌ర ప్రాంతాల నుంచి ర‌వాణా వాహ‌నాల నిషేదం కార‌ణాన్ని చూపుతు వ్యాపారుల బ్లాక్ మార్కెటింగ్‌ మొదలెట్టారు. 150 శాతానికిపైగా ధరలు పెంచేసి, దోచేసుకుంటున్నారు. నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెంచితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న అధికారులు ఈ విష‌యంలో మాత్రం వ్యాపారుల‌కు కొమ్ము కాస్తున్నార‌ని పొగబాబులు ఆక్షేపిస్తున్నారు. క‌రోనా వ్యాపిస్తున్న నేప‌ధ్యంలో నిరోధించేందుకు అమ‌లు చేస్తున్న లాక్‌డౌన్ ప‌రిస్థితుల్లో కొంద‌రు వ్యాపారుల పంట పండింది‌. ఈ లాభాల్లో ఎక్కువ భాగం ప్ర‌భుత్వ అధికారుల‌కే పోతోందని వ్యాపారులు బ‌హిరంగంగానే చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.

పొగాకు ఉత్పత్తుల రవాణా ఆగిపోవడంతో గోడౌన్లలో ఉన్న సరుకు ధర అమాంతం పెరిగిపోయింది. సాధారణంగా ఉండే 2 శాతం మార్జిన్ 20 శాతానికి పెరిగింది. పొగాకు ఉత్పత్తులు నిత్యావసరాలు కాకపోవడంతో వాణిజ్య శాఖ అధికారులు వీరిపై ఎటువంటి దాడులు నిర్వహించరు. వాస్తవంగా ఈ బ్లాక్ మార్కెట్ ను నిరోధించేందుకు ఈ శాఖ అధికారులకు అవకాశం ఉంది. కానీ వ్యాపారులు ఇస్తున్న ముడుపుల కు ఈ అధికారులు లొంగి పోయారని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు కారణం కూడా వ్యాపారుల వ్యవహార శైలి కూడా ఓ ప్రధాన కారణం. ధరలు పెంచి అమ్ముతున్న పొగాకు ఉత్పత్తులపై వినియోగదారులు వ్యాపారులతో వాగ్వాదానికి దిగిన సమయంలో వారే ప్రభుత్వ అధికారులకు ముడుపులు ఇచ్చినట్లు చెప్పుకొస్తున్నారు. సాధారణంగా పొగతాగే అలవాటు ఉన్నవారు దానిని మానుకోలేరు. ఒకవేళ మానేందుకు ప్రయత్నిస్తే మానసిక రోగిగా తయారవుతారు. ఈ బలహీనత అడ్డం పెట్టుకొని వ్యాపారులు చేస్తున్న అక్రమాలను నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని పొగాకు ఉత్పత్తుల వినియోగదారులు కోరుకుంటున్నారు.