English | Telugu

అమెరికాలో మరో ఘోరం.. మళ్ళీ అట్టుడుకుతోంది

అమెరికా లో నల్ల జాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ పై శ్వేత జాతి పోలీసుల దాష్టీకం కారణంగా మృతి చెందగా అల్లర్లు చెలరేగి ప్రధాన నగరాలు అట్టుడికిన విషయం తెలిసిందే. తాజాగా అటువంటి ఘటన అట్లాంటాలో చోటుచేసుకుంది. అట్లాంటాలోని వెండీ రెస్టారెంట్‌ వద్ద కారులో వస్తున్న రేషార్డ్‌ బ్రూక్స్‌ అనే 27 ఏళ్ల వ్యక్తిని ఆపిన పోలీసులు, అతడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో, అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా దానికి బ్రూక్స్‌ ప్రతిఘటించాడు. ఈ క్రమంలో బ్రూక్స్ పోలీసుల వద్ద ఉన్న టీజర్ గన్ (మైల్డ్ కరెంట్ షాక్ ఇచ్చే పరికరం) ను లాక్కొని ఒక పోలీసును బెదిరించి పారిపోతున్న సమయంలో మరో పోలీస్ అతని పై వెనుక నుండి కాల్పులు జరపడం తో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు బ్రూక్స్ ను హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ ఇస్తుండగానే మృతి చెందాడు. ఐతే ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో అట్లాంటా మొత్తం అట్టుడికి పోయింది. ఈ ఘటన జరిగిన చోట ఉన్న వెండీస్‌ రెస్టారెంట్‌ను నిరసనకారులు పూర్తిగా తగులబెట్టారు. ప్రధాన రహదారులన్నింటినీ నిర్బంధించి నిరసనలకు దిగారు. ఐతే ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ, నగర పోలీసు చీఫ్‌ ఎరికా షీల్డ్స్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం.. కాల్పులు జరిపి ఆ ఘటన మొత్తానికి కారణమైన పోలీసు అధికారిని తొలగిస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించింది.

ఇది ఇలా ఉండగా వాషింగ్టన్‌ రాష్ట్రంలోని సియాటెల్‌లో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. నగరంలో కొంత ప్రాంతాన్ని వారు అక్రమించుకుని దానికి "క్యాపిటల్‌ హిల్‌ అటానమస్‌ జోన్" అని పేరు పెట్టి దానిని స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించారు. నగరంలోకి రాకపోకలు జరగకుండా రహదారుల్ని నిర్బంధించారు. సియాటెల్ కు చెందిన పోలీసు శాఖను పూర్తిగా రద్దు చేయాలని, సాయుధ దళాల్ని నిషేధించాలని నిరసనకారులు డిమాండ్‌ చేసారు. ఐతే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మెక్రోసాఫ్ట్‌, బోయింగ్‌, వాల్‌మార్ట్‌, అమెజాన్‌ వంటి ప్రముఖ సంస్థల కార్యాలయాలన్నీ సియాటెల్‌లోనే ఉండటంతో ఈ ఘటన అమెరికాకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సియాటెల్ నగరాన్ని అదుపులోకి తీసుకోవాలని ‌ పదే పదే చెబుతున్నా.. ఆందోళనకారులకు సానుభూతి తెలుపుతున్న మేయర్‌, గవర్నర్‌లు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. దీంతో ట్రంప్‌ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటె.. బానిసత్వాన్ని ప్రోత్సహించిన జాన్‌ మెక్‌డొనో విగ్రహాన్ని న్యూ ఓర్లాన్స్‌లోని నిరసనకారులు ధ్వంసం సమీపంలోని మిస్సిసిపీ నదిలో కలిపేశారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.