English | Telugu

సర్పంచ్‌లతో ప్రధాని మోదీ ముచ్చ‌ట!

పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా గ్రామస్వరాజ్ పోర్టల్ మొబైల్ ఆప్‌ను ప్రధాని అవిష్కరించారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజల్లో అవగాహన బాధ్యత గ్రామ పంచాయితీలదేని ఆయనీ సందర్భంగా చెప్పారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఆహార సదుపాయాలు అందించాలని కోరారు.

కరోనా వైరస్ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, మనం వెళ్లే దారిలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు. ఈ సంక్షోభ సమయంలోనే ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు. పేదలకు ఆహార సదుపాయాలు అందించాలని పిలుపునిచ్చారు. కరోనా నివారణకు స్వీయ నియంత్రణే ముఖ్యమని అన్నారు. ప్రజలు బయటికి రాకుండా కరోనాను కట్టడి చేయాలని చెప్పారు.

మెరుగైన పనితీరు కలిగిన గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రధాని చెప్పారు. గ్రామాలలో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. రహదారులు, విద్యుత్ సౌకర్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.

లక్షకు పైగా పంచాయతీలు బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానం అయ్యాయని గుర్తు చేశారు. పల్లెల్లో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరుచుకోవాలని తెలిపారు. అటు ప్రధానితో పలువురు సర్పంచ్‌లు తమ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకున్నారు.