English | Telugu

దిశా చట్టం నిద్రపోతోందా సీఎం గారూ.. లోకేష్ ఫైర్

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేసారు. ఏపీలో బాలికలు, మహిళల పై అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అయన మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని శిక్షించకుండా, రాజీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు.

అసలు "దిశ చట్టం నిద్రపోతుందా వైఎస్ జగన్ గారు? తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో 9 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురయ్యింది. చిన్నారిని చిదిమేసిన మృగాడు సత్యనారాయణ రెడ్డిని కఠినంగా శిక్షించాల్సింది పోయి, స్థానిక వైకాపా నేతలు రాజీ కుదిర్చే ప్రయత్నం చెయ్యడం దారుణం" అని నారా లోకేశ్ అన్నారు. అంతేకాకుండా "చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో మహిళలకు అసలు రక్షణ ఉందా? 21 రోజుల్లో న్యాయం ఎక్కడ ? ప్రచార ఆర్భాటంతో మొట్ట మొదటి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన జిల్లాలోనే ఘోరాలు జరుగుతుంటే ఇక మిగిలిన చోట్ల ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది" అని లోకేశ్ వ్యాఖ్యానించారు.