English | Telugu

కాంగ్రెస్ ఉద్యోగాల వాగ్దానం నిలబెట్టుకోలేకపోయింది : ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి

సొంత పార్టీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌న్‌పార్కు వ‌ద్ద నిరుద్యోగ అభ్య‌ర్థుల‌తో క‌లిసి అమ‌ర‌వీరుల స్థూపానికి రాజ‌గోపాల్ రెడ్డి నివాళుల‌ర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందన్నారు. ప్రభుత్వానికి, నిరుద్యోగులకు మధ్య వారధిగా తాను పనిచేస్తానని రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు ఆందోళనలు మానుకోండి మీ సమస్యలు వినడానికి అవసరమైతే అశోక్ నగర్ చౌరస్తా, సెంట్రల్ లైబ్రరీకి, దిల్‌సుఖ్‌నగర్‌కి నేనే వస్తానని రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు.

నిరుద్యోగులను గాలికి వదిలేయొద్దు.. వారికి దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు పాత్ర వెలకట్టలేనిదన్నారు. పదేళ్లలో నిరుద్యోగుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక గ్రూప్ వన్ కూడా వేయలేకపోయారు. కేసీఆర్ పాలన కుటుంబ పాలనగా కొనసాగి అవినీతిమయంగా మారి దోచుకుని అప్పుల పాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏ ఒక్కరికి న్యాయం జరగలేదని ఎమ్మెల్యే తెలిపారు.