English | Telugu

మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో... అమెరికాను తలదన్నేలా GSLV-F10

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో మైలురాయిని అధిగమించేందుకు సిద్ధమవుతోంది. పీఎస్ఎల్వీ రాకెట్‌ ప్రయోగాల్లో ఎదురులేని శక్తిగా ఎదిగిన ఇస్రో... అదే స్ఫూర్తితో ఇప్పుడు జీఎస్ఎల్వీ సిరీస్‌పై ఫోకస్‌ పెట్టింది. అత్యంత బరువైన ఉపగ్రహాలను రోదసిలోకి మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన జీఎస్ఎల్వీ అంతరిక్ష వాహక నౌకల రూపకల్పనలో... స్వీయ పరిజ్ఞానాన్ని సాధించిన ఇస్రో ఇప్పుడు ఆ ప్రయోగాలపై గురిపెట్టింది. శ్రీహరికోట నుంచి మార్చి 5న జీఎస్ఎల్వీ-ఎఫ్10 వాహక నౌకను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే GSLV వాహక నౌక అనుసంధానం ప్రక్రియ పూర్తికావచ్చింది. ఇక ఉపగ్రహాన్ని అనుసంధానం చేయాల్సి ఉంది. ఈ ప్రయోగం ద్వారా 2వేల 300 కిలోల బరువున్న గీశాట్-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఇంధనం నింపే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ఇస్రో ఛైర్మన్ డాక్టర్ శివన్... షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ల పర్యవేక్షణలో శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు.

జీఎస్ఎల్వీ-ఎఫ్10 ప్రయోగం కారణంగా మరో ప్రయోగం వాయిదాపడే అవకాశం కనిపిస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 18న PSLV-C49 రాకెట్‌ను ప్రయోగించాలనుకున్నారు. ప్రస్తుతం జీఎస్ఎల్వీ-ఎఫ్10పై దృష్టిపెట్టినందున, ఏప్రిల్ మొదటివారంలో PSLV-C49 ప్రయోగం చేపట్టాలని ఇస్రో భావిస్తోంది.