English | Telugu

జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం.. రేవంత్ రెడ్డికి గట్టి షాక్!

జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఊరట లభించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) జారీచేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. జీవో 111కు విరుద్ధంగా కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించారని, ఆ నిర్మాణం పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఎన్జీటీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.

అయితే ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నిజానిజాలు పరిశీలించకుండానే ఎన్జీటీ ఉత్తర్వలు ఇవ్వడాన్ని సవాల్ చేశారు. ఆ ఫామ్ హౌస్ తనది కాదని స్పష్టం చేస్తూ ఆయన హైకోర్టుకు నివేదిక అందించారు. ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని అసహనం వ్యక్తం చేశారు. కక్షపూరితంగా ఫిర్యాదు చేశారని, రేవంత్‌పై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని పిటిషన్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. విచారణ జరిపిన హైకోర్టు కేటీఆర్ కు ఊరట కలిగిస్తూ ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. కేటీఆర్ తో పాటుగా తెలంగాణ ప్రభుత్వానికి, హెచ్ఎండీఏ, పీసీబీ లకు నోటీసులు జారీ చేసిన ఎన్జీటీ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించడం ఓ రకంగా రేవంత్ రెడ్డికి షాక్ అనే చెప్పాలి.