English | Telugu

మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ ను ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్ 

దేశంలోనే మొట్టమొదటి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ను హైదరాబాద్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, సంతోష్‌ గంగ్వార్‌, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ డీఆర్‌డీవో అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా పరీక్షలతో పాటు వైరస్‌ కల్చర్‌, వ్యాక్సిన్‌ తయారీకోసం ఈ ల్యాబ్‌ను ఉపయోగించనున్నారు. ఐ క్లీన్‌, ఐ సేఫ్‌ సంస్థల సహకారంతో బయో సేఫ్టీ లెవెల్‌-3 ల్యాబ్‌ను డీఆర్‌డీవో తయారు చేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు భారీ కంటైనర్లలో 15 రోజుల్లోనే దీన్ని రూపొందించారు. ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో ఇలాంటి ల్యాబ్‌ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ...కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు గచ్చిబౌలిలో 20 రోజుల్లోనే 1500 పడకలతో టిమ్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్రం మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. కొవిడ్‌-19 చికిత్స కోసం రాష్ట్రంలో 8 ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.