English | Telugu

వెలగపూడి ఘర్షణలో మహిళ మృతి.. ఎంపీ నందిగం సురేష్ పై ఆరోపణలు

రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో గత రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రోడ్డుకు ఆర్చి నిర్మాణ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మరియమ్మ అనే మహిళను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. వెలగపూడిలోని ఎస్సీ కాలనీలో ఆర్చి విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వివాదం గత రెండు మూడు రోజులుగా కొనసాగుతోంది. ఎస్సీ కాలనీలో ఆర్చి నిర్మించి.. జగజ్జీవన్‌రామ్ కాలనీగా పేరు పెట్టాలని ఎంపీ నందిగం సురేష్ అనుచరులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ నిర్ణయంపై మరొక వర్గం తీవ్ర అభ్యరంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ ఘర్షణలో ఎంపీ నందిగం సురేష్ హస్తం ఉన్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. అయన రెండు దళిత వర్గాల మధ్య ఘర్షణను ప్రొత్సహించారని వారు ఆరోపణలు చేస్తున్నారు. తాజా ఘర్షణ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు.