English | Telugu

భారత్‌ లో రైతుల నిరసనలపై కెనడా ప్రధాని కామెంట్

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పార్టీలు రైతులకు తమ మద్దతును ప్రకటించాయి. అయితే, ఈ నిరసనల హోరు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు చేరడంతో ఆయన కూడా రైతులకు అనుకూలంగా మాట్లాడారు. శాంతియుతంగా నిరసనలు తెలిపేవారికి కెనడా ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలిపారు.

భారత్‌ లో రైతుల నిరసనలకు సంబంధించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి చింతిస్తున్నాము. నిరసన కార్యక్రమాలను చేపడుతున్న వారి కుటుంబాలు, స్నేహితుల గురించి ఆందోళనగా ఉందని అన్నారు. శాంతియుతంగా హక్కుల కోసం పోరాడే వారి పక్షాన కెనడా ఎప్పుడూ ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నానని చెప్పారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. ఇదే విషయాన్ని భారత అధికారుల దృష్టికి తాము తీసుకెళ్లామని తెలిపారు. మనందరం ఒక్కతాటిపైకి వచ్చి సమస్యను పరిష్కరించేందుకు అనువైన సమయం ఇదే అని వ్యాఖ్యానించారు.

గురునానక్ 551 జయంతి సందర్భంగా ఒక ఆన్ లైన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన వీడియోను కెనడాలోని సిక్కు సంఘాలు విడుదల చేశాయి. కాగా, భారత రైతులు చేపడుతున్న నిరసనలపై స్పందించిన తొలి విదేశీ నేత ట్రూడోనే కావడం గమనార్హం.