English | Telugu

ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఏపీ ఎన్జీవోల ఝలక్.. కరోనా తగ్గిన తర్వాత ఎన్నికలు జరపండి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ ఎన్జీవోలు ఈ విషయంపై స్పందించారు. ప్రస్తుతం ఉన్న కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై పునరాలోచన చేయాలని ఏపీ ఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కోరారు. కరోనా సమయంలో ఉద్యోగులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టలేరని ఆయన తెలిపారు. అంతేకాకుండా కరోనా తగ్గిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులంతా అమరావతి నుండి విశాఖపట్టణం వచ్చేస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులంతా కూడా విశాఖను పరిపాలన రాజధానిగా స్వాగతిస్తున్నారని ఆయన చెప్పారు. కరోనా కారణంగా నిలిపివేసిన వేతనాలను ఈ నెల నుండి చెల్లిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు ఇచ్చేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు.

మరో పక్క రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గత నెల 28వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల విషయమై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. అయితే ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని రాష్ట్ర హైకోర్టు మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసిన సమయంలో ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.