English | Telugu

ఒకే కుటుంబంలో 17 మందికి క‌రోనా!

హైదరాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన 17 మందికి కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధరణ అయిందని అధికారులు ధ్రువీకరించారు. వీరిలో ఒక 10 నెలల శిశువు నుంచి 12 ఏళ్ళ లోపు పిల్లలు ఆరుగురు ఉన్నారు. హైదరాబాద్‌లోని తలాబ్‌కట్టకు చెందిన ఒక మహిళ ఏప్రిల్ 10న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందారు. ఆమెకు కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 13న ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధరణ అయింది.

దాంతో, వైద్య అధికారులు అప్రమత్తమై ఆ మహిళ కుటుంబ సభ్యులకు, వారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారికి కలిపి మొత్తం 41 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 17 మందికి కోవిడ్ వ్యాధి ఉన్నట్లు నిర్ధరణ అయింది. వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 24 మందిని కూడా ప్రభుత్వ నిజామియా హాస్పిటల్‌లో క్వారెంటైన్‌కు తరలించారు.

అయితే, ఆ మహిళకు వైరస్ ఎలా సోకిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో ఒకే కుటుంబంలో ఇంత మందికి వైరస్ సోకడం ఇదే మొదటిసారి.