English | Telugu
రేషన్ షాపుల సమయాన్ని పొడిగిస్తాం!
Updated : Apr 1, 2020
కోవిడ్-19 వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేద కుటుంబాలు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు రేషన్ లబ్ధిదారులకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమాన్ని, రేషన్ షాపులో బియ్యం నిల్వలు, లబ్దిదారులకు పంపిణీ వంటి వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఖైరతాబాద్ లోని రేషన్ షాప్ నం. 702లో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చైర్మన్గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వని విధంగా తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో రాష్ట్రంలోని 87.54 లక్షల ఆహార భద్రత కార్డులోని 2.80 కోట్ల మంది పేదలకు ఉచితంగా బియ్యాన్ని అందిస్తోందని తెలిపారు.
బియ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 17 వేల రేషన్ షాపుల్లో 3.34 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందుబాటులో ఉంచామన్నారు.
లబ్ధిదారులు రేషన్ షాపుల వద్ద బియ్యం కోసం ఎదురుచూడవలసిన పరిస్థితి ఉండకుండా ముందుగానే టోకెన్లను జారీచేయడం జరుగుతుందని, టోకెన్ పద్ధతిలో నిర్దేశించిన సమయానికి రేషన్ షాపుకు వచ్చి బియ్యాన్ని తీసుకోవాలన్నారు. ఉదయం, సాయంత్రం అనే కాకుండా స్థానిక అవసరాలను బట్టి రేషన్ షాపుల సమయాన్ని కూడా పొడిగిస్తామని తెలిపారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి బియ్యం అందించేవరకు రేషన్ షాపులు పనిచేస్తాయన్నారు.
రేషన్ షాపుల వద్దకు వచ్చే లబ్ధిదారులు ప్రభుత్వం సూచనలను ఖచ్చితంగా పాటించాలని, ముఖ్యంగా రేషన్ దుకాణాల వద్ద సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని, చేతులు శుభ్రం చేసుకునే విధంగా హ్యాండ్ వాష్, సానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలని రేషన్ డీలర్లను ఆదేశించారు.