Read more!

English | Telugu

రామ్‌చరణ్‌తో హ్యాట్రిక్‌ కొట్టబోతున్న రెండో హీరోయిన్‌?

రామ్‌చరణ్‌ ఇప్పటివరకు హీరోగా 14 సినిమాలు చేశాడు. వాటిలో చరణ్‌ సరసన హీరోయిన్లుగా నటించిన వారిలో కాజల్‌ అగర్వాల్‌కి ఓ రికార్డు ఉంది. అదేమిటంటే.. మగధీర, నాయక్‌, గోవిందుడు అందరివాడేలే చిత్రాలో చరణ్‌తో జోడీ కట్టి హ్యాట్రిక్‌ సాధించింది కాజల్‌. అయితే ఈ మూడు సినిమాల్లో మగధీర, నాయక్‌ మాత్రం సూపర్‌హిట్‌ అయితే గోవిందుడు అందరి వాడేలే అందర్నీ నిరాశపరచింది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రంలో ‘అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు’ పాటలో చిరంజీవి, కాజల్‌లతో కలిసి స్టెప్స్‌ వేశాడు చరణ్‌. 

ఇప్పుడు చరణ్‌తో హ్యాట్రిక్‌ కొట్టేందుకు మరో హీరోయిన్‌ సిద్ధమవుతోంది. ప్రస్తుతం శంకర్‌ కాంబినేషన్‌లో చేస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’తో బిజీగా ఉన్నాడు చరణ్‌. ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. అంతకుముందు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్‌ చేసిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో చరణ్‌తో జోడీ కట్టింది కియారా. ఇప్పుడు మరో సినిమాలో కూడా ఆమె హీరోయిన్‌గా ఓకే అయినట్టు సమాచారం. గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ అనుకున్న షెడ్యూల్‌ కంటే మరింత ఆలస్యమవతుఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్‌ ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా జరుగుతోంది. గేమ్‌ చేంజర్‌ షూటింగ్‌ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. 

ఈ సినిమాలో చరణ్‌ జోడీగా ఎవరిని తీసుకోవాలనే విషయంలో చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగండా చాలా మంది హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చాయి. ఒక దశలో సాయిపల్లవి హీరోయిన్‌గా ఓకే అయిందన్న వార్త వచ్చింది. అంతే కాదు మృణాల్‌, పూజా హెగ్డే, దీపికా పదుకునే పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.  తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో మెయిన్‌ హీరోయిన్‌గా కియారా అద్వానిని ఫైనల్‌ చేశారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.