Read more!

English | Telugu

రవితేజతో బాలయ్య మల్టీస్టారర్!

గతేడాది మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన 'క్రాక్'తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా రూపొందిస్తున్నాడు. బాలయ్య కెరీర్ లో 107వ చిత్రంగా వస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో బాలయ్యతో కూడా డైరెక్టర్ గోపీచంద్ సూపర్ హిట్ అందుకోవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే గోపీచంద్ మలినేని తన తదుపరి సినిమాని బాలయ్య, రవితేజ కాంబినేషన్ లో మల్టీస్టారర్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట.

బాలయ్య, రవితేజల ఎనర్జీ గురించి, వాళ్ళ మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటే మాస్ ఆడియన్స్ కి పండగే అని చెప్పొచ్చు. బాలయ్య హోస్ట్ చేసిన 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో సీజన్-1 లో డైరెక్టర్ గోపీచంద్ తో కలిసి రవితేజ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ షోలో బాలయ్య, రవితేజల ఎనర్జీకి, సరదా మాటలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సమయంలోనే ఈ ఇద్దరితో మల్టీస్టారర్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మలినేనికి  రావడం, ఒక స్టోరీ లైన్ అనుకోవడం జరిగిపోయాయట. 'NBK 107' రిలీజ్ తర్వాత ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశముంది అంటున్నారు.

కాగా, 'NBK 107' తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు బాలయ్య. ఇక రవితేజ విషయానికొస్తే ఈ నెల 29న 'రామారావు ఆన్ డ్యూటీ'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అలాగే 'రావణాసుర', 'ధమాకా', 'టైగర్ నాగేశ్వరరావు' ప్రాజెక్ట్స్ రవితేజ చేతిలో ఉన్నాయి. వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'వాల్తేరు వీరయ్య'లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.