English | Telugu
జయలలితను కన్నడ స్త్రీగా ఒప్పుకోవాలంటూ డిమాండ్ చేశారు!
Updated : Jan 24, 2022
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి గ్లామరస్ హీరోయిన్ దివంగత జయలలిత ప్రాంతీయత గురించి వాదాలు, వివాదాలు ఉన్నాయి. ఆమెను కన్నడ వనితగా చాలామంది భావిస్తుంటారు. ఆరోజు ప్రముఖ నిర్మాత, దర్శకుడు బి.ఆర్. పంతులు మైసూరులోని ప్రీమియర్ స్టూడియోలో తీస్తున్న 'గంగా గౌరి' తమిళ చిత్రం షూటింగ్లో ఉన్నారు జయలలిత. షూటింగ్ జరుగుతుండగా ఉన్నట్లుండి స్టూడియో బయట ఏదో కలవరం మొదలైంది. ఎవరో రెచ్చగొట్టి తరిమినట్లుగా కొంతమంది స్టూడియో లోపలికి దూసుకువచ్చి ఆమె ఉన్న ఫ్లోర్ దగ్గర ఆమెతో మాట్లాడాలని గొడవ చేయడం ప్రారంభించారు.
"నేను తమిళనాడుకు చెందినదాన్ని కాదు, కర్నాటకకు చెందిన దాన్ని" అని వాళ్లతో చెప్పాలట. అదీ వాళ్ల కోరిక! 'ఇదేమిటీ విపరీతం.. అసలిది ప్రాధాన్యం ఇవ్వదగ్గ విషయమేనా? ప్రాధాన్యత సంగతి ఎలా ఉన్నా, వాళ్ల మాటల్లో ఎంతమాత్రం న్యాయం లేదు' అని ఆమెకు అనిపించింది.
"ఎందుకలా చెప్పాలి?" అని ఆమె ప్రశ్నించారు.
"మీరు మైసూరులోనే కదా పుట్టారు?" అని వాళ్లలో కొందరు తీవ్రమైన ధోరణిలో అడిగారు.
"అవును" అన్నారు జయలలిత.
"ఐతే మీరు మైసూరుకు చెందినవారే కదా.. 'నేను కన్నడ యువతినే' అని మీరు అంగీకరించాలి" అని వారన్నారు.
"అలా ఐతే.. కొన్ని సంవత్సరాల క్రితం మన భారతీయులు ఎంతోమంది ఆఫ్రికా దేశాలకు వెళ్లి అక్కడే తమ నివాసాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడ వాళ్లకు సంతానం కలిగితే వాళ్లను ఆఫ్రికా వాళ్లని మనం అనడం లేదే, భారతీయులనే అంటున్నాం. అలాగే మా బంధువులు కొందరు అమెరికాలో ఉన్నారు. వాళ్లకు పుట్టిన పిల్లలను అమెరికన్స్ అని ఎలా అంటాం? అలాగే నేను మైసూరులో పుట్టాను కానీ మా తాత ముత్తాతలు అంతా తమిళనాడులోని శ్రీరంగానికి చెందినవారు. అంచేత నేను తమిళనాడుకు చెందినదాన్నే" అని చెప్పారు జయలలిత.
Also read: జయలలిత క్రికెట్ పిచ్చి కథ! ఆమె అభిమాన క్రికెటర్ ఎవరో తెలుసా?
ఆమె సమాధానం తృప్తి కలిగించిందో లేదో తెలియదు కానీ వాళ్లు అక్కడనుంచి వెళ్లిపోయారు. తమిళనాడులోనూ పలువురు జయలలిత కర్నాటకకు చెందినవాళ్లని భావించే వాళ్లున్నారు. కానీ అది నిజం కాదు. ఏదో ఒక గుర్తింపుకు తప్ప, ఈ ప్రాంతీయ భేదాలవీ అనవసరమని జయలలిత అభిప్రాయం.
Also read: రావణుడిని హీరోగా ఎన్టీఆర్ ఎందుకు చూపించారు?
నిజానికి ఆమె తాత ముత్తాతలది శ్రీరంగమే అయినా, ఆమె కుటుంబంలోని వారు కొన్ని కొన్ని శాఖలుగా విడిపోయి, ఒక కుటుంబం వారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులోనూ, ఇంకొక కుటుంబం వారు నెల్లూరులోనూ, మరొక శాఖవారూ మైసూరులోనూ స్థిరపడ్డారు. జయలలిత అమ్మ సంధ్య తాతగారి ఊరు నెల్లూరు. అక్కడ వాళ్లకు చాలా భూములూ అవీ ఉన్నాయి. అక్కడి ఊరి పెద్దల్లో ఆయనా ఒకరిగా గౌరవానికి నోచుకున్నారని జయలలిత తన బయోగ్రఫీలో రాసుకున్నారు.