Read more!

English | Telugu

హీరోయిన్ మరణవార్త విని.. ఏ విధంగానూ స్పందించని భర్త!

స్వేచ్ఛ.. వెర్రితలలు వేస్తోంది, వెకిలితనం అర్రులు చాస్తోంది. దానికి సోషల్‌ మీడియా ఊతం ఇస్తోంది. ఎవరెన్ని రకాల వేషాలు వేసినా క్షణాల్లో వైరల్‌ చేసెయ్యడం, ఆ పోస్ట్‌లోని విషయం నిజమేనని ఎమోషనల్‌ అయిపోవడం మనం చూస్తున్నాం. ఎవరో ఒకరు చేసిన మోసం వల్ల భవిష్యత్తు ఎలాంటి విషాదాన్నయినా లైట్‌గా తీసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే కన్‌ఫ్యూజన్‌ జనంలో నిండిపోయింది. 

తాజాగా పూనమ్‌ పాండే వ్యవహారం అందరికీ తెలిసిందే. ఆమె ఇచ్చిన షాక్‌ నుంచి ఇంకా చాలా మంది కోలుకోలేదు. ఎవ్వరూ ఊహించిన షాక్‌ ఇచ్చిన పూనమ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. వార్తల్లోకి ఎక్కడానికి ఇంత నీచానికి ఒడికడతావా? అని ప్రశ్నిస్తున్నారు. క్యాన్సర్‌పై అవగాహన కోసం అలా చేశానని ఆమె చెప్పడాన్ని మరింత ఆక్షేపిస్తున్నారు. పూనమ్‌ మరణ వార్తపై ఆమె భర్త సామ్‌ స్పందించాడు. ఆమె మరణించిందని తెలియగానే తనకు ఎలాంటి ఫీలింగ్‌ కలగలేదని, అలా జరిగి ఉండదని నాకు అనిపించిందని అన్నాడు. ఎవరితోనైనా మీరు కనెక్ట్‌ అయి ఉంటే వారికి సంబంధించి ఏం జరిగినా మీరు ఫీల్‌ అవుతారు. ఆమె విషయంలో ఏదైనా తప్పు జరిగిందీ అంటే తనకు తెలుస్తుందని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నందుకు మాత్రం హ్యాపీగానే ఉందని చెబుతున్నాడు సామ్‌. 

పూనమ్‌ గురించి ఇన్ని మంచి విషయాలు చెబుతున్న సామ్‌ ప్రస్తుతం ఆమెతో కలిసి ఉండడం లేదు. 2020లో సామ్‌, పూనమ్‌ వివాహం జరిగింది. అయితే ఎక్కువ రోజులు ఇద్దరూ కలిసి ఉండలేకపోయారు. హనీమూన్‌ తర్వాత తనను ఫిజికల్‌గా ఎంతో వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది పూనమ్‌. కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు సామ్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ ఉదంతం తర్వాత సామ్‌, పూనమ్‌ ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. పూనమ్‌ మరణించిందన్న వార్త తర్వాత ఆమె గురించి పలు వ్యాఖ్యలు చేసిన సామ్‌.. తాము 2020లో చట్టబద్ధంగానే పెళ్లి చేసుకున్నామని, విడివిడిగా ఉంటున్నాం తప్ప విడాకులు తీసుకోలేదని వెల్లడించాడు సామ్‌.