Read more!

English | Telugu

హీరోయిన్ ఇంట్లో చోరీ కేసు.. న‌ర్సును అరెస్టు చేసిన పోలీసులు

 

బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్, ఆమె భ‌ర్త ఆనంద్ అహుజాకు చెందిన‌ ఢిల్లీలోని ఇంట్లో ఫిబ్ర‌వ‌రిలో రూ. 2.4 కోట్ల విలువైన న‌గ‌దు, బంగారు ఆభ‌ర‌ణాల చోరీ జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వారి ఇంట్లో ప‌నిచేస్తోన్న ఒక న‌ర్సును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సోన‌మ్ అత్త‌గారైన ప్రియా అహుజాను చూసుకోవ‌డం కోసం అప‌ర్ణ రూత్ విల్స‌న్ అనే న‌ర్సును కుటుంబం నియ‌మించింది. 

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం అప‌ర్ణ భ‌ర్త న‌రేశ్ కుమార్ సాగ‌ర్ ఓ ప్రైవేట్ కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. ఆ ఇద్ద‌రూ ఢిల్లీలోని స‌రితా విహార్ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అప‌ర్ణ న‌ర్సుగా, హోమ్ మెడిక‌ల్ కేర్ అసిస్టెంట్‌గా ప‌నిచేస్తోంది. మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిపిన దాడిలో ఆ ఇరువురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫిబ్ర‌వ‌రి 11న చోరీ జ‌ర‌గ‌గా, తుగ్ల‌క్ రోడ్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిబ్ర‌వ‌రి 23న ఎఫ్ఐఆర్‌ను రిజిస్ట‌ర్ చేశారు. ఐపీసీ సెక్ష‌న్ 381 కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు నిర్వ‌హించారు. సోన‌మ్ ఇంట్లో అప‌ర్ణ స‌హా మొత్తం 20 మంది సిబ్బంది ప‌నిచేస్తున్నారు.

ప్ర‌స్తుతం భ‌ర్త ఆనంద్‌తో క‌లిసి లండ‌న్‌లో నివాసం ఉంటోంది సోన‌మ్‌. త‌ను గ‌ర్భ‌వ‌తినైన‌ట్లు మార్చి 21న‌ సోష‌ల్ మీడియా ద్వారా ఆమె ప్ర‌క‌టించింది.