Read more!

English | Telugu

'విక్ర‌మార్కుడు' హిందీ వెర్ష‌న్‌కు సీక్వెల్ రాబోతోంది!

 

ప్ర‌భుదేవా డైరెక్ష‌న్‌లో అక్ష‌య్ కుమార్ టైటిల్ రోల్ పోషించిన మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్‌ 'రౌడీ రాథోడ్' (2012) బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. అక్ష‌య్ జోడీగా సోనాక్షి సిన్హా న‌టించిన ఈ మూవీ య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో ర‌వితేజ‌-అనుష్క న‌టించిన సూప‌ర్‌హిట్ మూవీ 'విక్ర‌మార్కుడు' (2006)కు రీమేక్‌. తొమ్మిదేళ్ల త‌ర్వాత 'రౌడీ రాథోడ్‌'కు సీక్వెల్ రానున్న‌ట్లు ఒరిజిన‌ల్ స్టోరీ రైట‌ర్ వి. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ధ్రువీక‌రించారు. 

2022 చివ‌ర‌లో ఈ సీక్వెల్ షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ సీక్వెల్ కేవ‌లం హిందీ వెర్ష‌న్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. "ప్ర‌స్తుతం నేను 'రౌడీ రాథోడ్ 2' స్క్రిప్టు రాస్తున్నా. ఈ సీక్వెల్‌కు స్క్రిప్టు రాయ‌మ‌ని భ‌న్సాలీ సాబ్ (నిర్మాత సంజ‌య్‌లీలా భ‌న్సాలీ) అడిగారు. త్వ‌ర‌లోనే స్క్రిప్టును కంప్లీట్ చేయ‌బోతున్నా" అని చెప్పారు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌. 

అయితే 'రౌడీ రాథోడ్' క‌థ ఎక్క‌డ ముగిసిందో, సీక్వెల్ క‌థ అక్క‌డ్నుంచి మొద‌లు కాద‌ని ఆయ‌న తెలిపారు. హీరో హీరోయిన్ల పాత్ర‌లు శివ‌, పారో ఇందులో కొన‌సాగుతాయ‌ని, క‌థనం కొత్త‌గా ఉంటుంద‌నీ చెప్పారు. ఈ సీక్వెల్‌లోనూ అక్ష‌య్‌, సోనాక్షి న‌టిస్తార‌ని తెలిపిన ఆయ‌న డైరెక్ట‌ర్‌గా ప్ర‌భుదేవా కొన‌సాగేదీ, లేనిదీ వెల్ల‌డించ‌లేదు.