English | Telugu

ఒకే సినిమాలో ప్రియాంక‌-క‌త్రినా-అలియా!

ముగ్గురు టాప్ హీరోయిన్లు ఒకే సినిమాలో క‌నిపిస్తే.. ఆడియెన్స్‌కు అంత‌కు మంచిన క‌న్నుల పండుగ ఏముంటుంది! ఇప్పుడు బాలీవుడ్‌లో అదే జ‌ర‌గ‌బోతోంది. ప్రియాంకా చోప్రా, క‌త్రినా కైఫ్‌, అలియా భ‌ట్ ఒకే సినిమాలో క‌లిసి న‌టించ‌నున్నారు. అది కూడా టైటిల్ రోల్స్ చేయ‌బోతున్నారు. ఫ‌రాన్ అఖ్త‌ర్ డైరెక్ట్ చేయ‌నున్న ఆ సినిమా టైటిల్ 'జీ లే జ‌రా'. ఈ మూవీని ఫ‌రాన్ సొంత నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, రితీశ్ సిధ్వానీకి చెందిన టైగ‌ర్ బేబీ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి.

'దిల్ చాహ్‌తా హై' మూవీ విడుద‌లై 20 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకున్న ఓ వీడియోలో 'జీ లే జ‌రా' మూవీని ఎనౌన్స్ చేశాడు ఫ‌రాన్‌. "ఎవ‌రైనా రోడ్ ట్రిప్‌కు వెళ్తామ‌ని చెప్పారా? డైరెక్ట‌ర్‌గా నా నెక్ట్స్ ఫిల్మ్‌ను, అదీ 'దిల్ చాహ్‌తా హై' విడుద‌లై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న రోజున అనౌన్స్ చేయ‌డం థ్రిల్లింగ్‌గా ఉంది. ప్రియాంకా చోప్రా, క‌త్రినా కైఫ్‌, అలియా భ‌ట్ ల‌తో 'జీ లే జ‌రా' చేయ‌బోతున్నాం. 2022లో షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఈ షోను రోడ్డుపైకి తీసుకురావ‌డానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా." అని రాసుకొచ్చాడు.

'దిల్ చాహ్‌తా హై', 'జింద‌గీ నా మిలేగీ దోబ‌రా' లాంటి రోడ్ ట్రిప్ ఫిలిమ్స్‌ను తీసి హిట్ కొట్టిన ఎక్సెల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఆ జాన‌ర్‌ను 'జీ లే జ‌రా' సినిమాతో కొన‌సాగిస్తోంది. కాక‌పోతే ఈసారి అమ్మాయిలు రోడ్ ట్రిప్ వేయ‌నున్నారు. జోయా అఖ్త‌ర్‌, ఫ‌రాన్ అఖ్త‌ర్‌, రీమా క‌గ్తి క‌లిసి ఈ సినిమా స్క్రిప్టును స‌మ‌కూరుస్తున్నారు. 2023లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.