Read more!

English | Telugu

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న 'దృశ్యం 2'

 

అజయ్ దేవ్‌గణ్, శ్రియ భార్యాభర్తలుగా నటించగా, టబు కీలక పాత్ర చేసిన 'దృశ్యం 2' బాక్సాఫీస్ దగ్గర అనూహ్యమైన వసూళ్లను సాధిస్తూ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. అభిషేక్ పాఠక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కేవలం ఇండియాలోనే మొదటి మూడు రోజులకు రూ. 64.14 కోట్ల (నెట్)ను రాబట్టింది. శుక్రవారం రూ. 15.38 కోట్ల (నెట్)ను వసూలు చేసిన ఈ సినిమా.. బ్రహ్మాండమైన మౌత్ టాక్‌తో తర్వాత రెండు రోజుల్లో మరింతగా కలెక్ట్ చేసింది. శనివారం రూ. 21.59 కోట్లు, ఆదివారం ఏకంగా 27.17 కోట్లతో సత్తా చాటింది.

చాలా కాలంగా బాలీవుడ్ సరైన హిట్లు లేక కునారిల్లుతూ వస్తోంది. కార్తీక్ ఆర్యన్ మూవీ 'భూల్ భులయ్యా 2' తర్వాత, దానికి మించిన రేంజ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న 'దృశ్యం 2' బాలీవుడ్‌కు ఊపిరిపోసింది.

మోహన్‌లాల్, మీనా నటించగా మలయాళంలో జీతు జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్కడ నేరుగా ఓటీటీలో రిలీజై మంచి ఆదరణ పొందింది. తర్వాత అదే డైరెక్టర్ తెలుగులో దాన్ని వెంకటేశ్, మీనా జంటగా రీమేక్ చేశాడు. అది కూడా నేరుగా ఓటీటీలో విడుదలై హిట్టయింది.

ఇప్పుడు, అజయ్ దేవ్‌గణ్ దాన్ని హిందీలో రీమేక్ చేసి, ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్లలో రిలీజ్ చేసి, బ్రహ్మండమైన ఫలితాన్ని అందుకున్నాడు. కాగా ఈ మూవీతో దేవి శ్రీప్రసాద్ పేరు బాలీవుడ్‌లో మారుమోగుతోంది. అతనిచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలిచింది.