English | Telugu
తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి అదే హీరోయిన్తో చెంపదెబ్బ తిన్న హీరో!
Updated : Mar 16, 2021
అర్జున్ కపూర్ తొలిసారి 2012లో పరిణీతి చోప్రా చేతిలో చెంపదెబ్బ తిన్నాడు. ఆ ఇద్దరూ తెరంగేట్రం చేసిన సినిమా 'ఇషక్జాదే'. అందులో సందర్భానుసారం ఓ సీన్లో అతడి చెంపపై ఒక్కటిస్తుంది పరిణీతి. ఇన్నాళ్ల తర్వాత 2021లో మరోసారి పరిణీతి చేతిలో అదే రకంగా చెంపదెబ్బ తిన్నాడు అర్జున్. ఈసారి దిబాకర్ బెనర్జీ డైరెక్ట్ చేస్తోన్న 'సందీప్ ఔర్ పింకీ ఫరార్' సినిమా కోసం. నిజానికి ఈ సినిమా 2020లోనే విడుదల కావాల్సింది. కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పుడు మార్చి 19న థియేటర్లలో విడుదలవుతోంది.
చిత్రమేమంటే ఈ సినిమాలో హీరోకు అమ్మాయి పేరు, హీరోయిన్కు అబ్బాయి పేరు ఉండటం. అవును. టైటిల్లోని సందీప్ కౌర్ క్యారెక్టర్ను పరిణీతి చేస్తే, పింకీ దహియా అనే పాత్రను అర్జున్ పోషించాడు. స్త్రీలపై జరిగే హింస ప్రధానంగా నడిచే సినిమా కావడంతో, హీరో హీరోయిన్ల మధ్య ఆ హింస వాస్తవికంగా కనిపించాలని దిబాకర్ బెనర్జీ కోరుకున్నాడు. అంటే.. అర్జున్, పరిణీతి నిజంగానే ఒకరినొకరు కొట్టుకున్నారు!
దీని గురించి అర్జున్ కపూర్ మాట్లాడుతూ, "పింకీ (సినిమాలో అతని క్యారెక్టర్) తన చేతిని సందీప్ (పరిణీతి చేసిన క్యారెక్టర్)పై ఎత్తడు. పింకీ విషయంలో సందీప్ ఫ్రస్ట్రేషన్కు, నిరాశకు గురవుతుంది. ఏడుస్తూ నన్ను కొట్టాలనుకుంటుంది. అదే టైమ్లో ఆ సీన్లో నన్ను నేను కాపాడుకోవాలనుకుంటాను. అలా గతంలో 'ఇషక్జాదే'లో ఎలాగైతే చెంపదెబ్బ తిన్నానో ఇప్పుడు మరోసారి పరిణీతి చేతిలో చెంపదెబ్బ తిన్నాను. అంటే ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఆ సీన్ను అది అవసరం. సిట్చువేషన్ డిమాండ్ చేయబట్టే ఆ సీన్ చేశాం." అని చెప్పుకొచ్చాడు.