Read more!

English | Telugu

ఆర్య‌న్‌కు నేను డ్ర‌గ్స్ అంద‌జేయ‌లేదు.. ఎన్సీబీకి చెప్పిన అన‌న్య‌!

 

షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్‌, లైగ‌ర్ హీరోయిన్ అన‌న్యా పాండే మ‌ధ్య జ‌రిగిన వాట్సాప్ చాటింగ్‌పై ఫోక‌స్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) గురువారం ఓసారి, శుక్ర‌వారం మ‌రోసారి అన‌న్య‌ను విచారించింది. ఆ ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన వాట్సాప్ సంభాష‌ణ‌ల్లో డ్ర‌గ్స్ అంద‌జేయ‌డం, డ్ర‌గ్స్ వాడ‌టం గురించిన విష‌యాలు ఉన్నాయ‌ని ఎన్సీబీ తెలిపింది.

మ‌రోసారి సోమ‌వారం త‌మ ముందు విచార‌ణ‌కు రావాల్సిందిగా అన‌న్య‌కు ఎన్సీబీ అధికారులు ఆదేశించారు. ఆర్య‌న్‌కు తను డ్ర‌గ్స్ అంద‌జేసింద‌నే ఆరోప‌ణ‌ల‌ను అన్నింటినీ అన‌న్య ఖండించిన‌ట్లు స‌మాచారం. ఆర్య‌న్‌, అన‌న్య చిన్న‌నాటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్‌. 

వాట్సాప్ చాట్స్‌లో మ‌రికొన్ని సెల‌బ్రిటీలు, వారి పిల్ల‌ల పేర్లు ఉన్నాయ‌ని ఎన్సీబీ వ‌ర్గాల ద్వారా తెలిసింది. వారిని వ‌చ్చే వారం విచార‌ణ‌కు పిలవ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఒక జైలులో రోజులు గ‌డుపుతున్న ఆర్య‌న్ బెయిల్ పిటిష‌న్‌ను అక్టోబ‌ర్ 26న బాంబే హైకోర్టు విచారించ‌నుంది.

ఎన్సీబీ డిప్యుటీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (డీడీజీ) అశోక్ ముత్త జైన్ వెల్ల‌డించిన దాని ప్ర‌కారం, అన‌న్య మ‌రోసారి సోమ‌వారం ఉద‌యం ఎన్సీబీ ముందు హాజ‌రు కానున్న‌ది. ఆ త‌ర్వాత ఎన్సీబీ త‌ద‌నుగుణ చ‌ర్య‌లు తీసుకుంటుంది.