English | Telugu
భోళా2 గురించి అజయ్ ఏమన్నారో విన్నారా?
Updated : Apr 6, 2023
అజయ్ దేవ్గన్ ఈ మధ్య ఎక్కడ ఏం మాట్లాడినా అందరి దృష్టి ఆయన భోళా మీదే ఉంది. భోళా సినిమా గురించి అజయ్ ఏం చెబుతారన్నదే అందరినీ ఆకట్టుకుంటున్న విషయం. యాక్షన్ అడ్వంచర్ సినిమాగా తెరకెక్కింది భోళా. ప్రేక్షకులే కాదు, విమర్శకులు కూడా భోళాకు మంచి మార్కులు వేశారు. బాక్సాఫీస్ దగ్గర కూడ చాలా మంచి కలెక్షన్లు వస్తున్నాయి. అజయ్ దేవ్గన్ డైరక్షన్కి అప్లాజ్ వస్తోంది. అన్ని విధాలుగా అందరి మన్ననలు పొందుతున్న భోళాకు సీక్వెల్ ఉంటుందా అనేది ఇప్పుడు నార్త్ వాళ్ల మెదళ్లలో మెదులుతున్న విషయం. ఈ విషయాన్నే అజయ్ దేవ్గణ్ ముందుంచారు అభిమానులు. ట్విట్టర్ వేదికగా అభిమానుల ప్రశ్నలకు జవాబులు చెప్పారు అజయ్. ఈ సందర్భంగా భోళా సీక్వెల్ గురించి ప్రస్తావన వచ్చింది. దీనికి అజయ్ చెప్పిన జవాబు అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ``విలన్స్ అందరూ సెలవులు తీసుకున్నారు. వారు తిరిగి రాగానే సీక్వెల్ గురించి ఆలోచిద్దాం`` అని అన్నారు అజయ్. అలాగే సింగమ్ 3 గురించి కూడా అద్భుతంగా స్పందించారు. ``ముందు మైదాన్ గురించి ఆలోచిద్దాం. మైదాన్ సినిమా చూద్దాం. ఆ తర్వాత సింగం గురించి ఆలోచిద్దాం`` అని అన్నారు.
తమిళ సినిమా ఖైదీకి రీమేక్గా తెరకెక్కింది భోళా. అజయ్ దేవ్గన్, టబు, దీపక్ దోబ్రియాల్, సంజయ్ మిశ్రా, గజ్రాజ్ రావు, వినీత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా తమిళ ఖైదీకి రీమేక్. అక్కడ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి హీరోగా తెరకెక్కింది. తన కూతురిని పుట్టినప్పటి నుంచీ చూడడు హీరో. జైలు నుంచి విడుదలై వెళ్లి కూతురిని చూడాలనుకుంటాడు. తీరా అతనికి అప్పుడే ఓ పని పడుతుంది. అతను ఆ పని పూర్తి చేసి వెళ్లాడా? లేదా? అనేది సినిమాలో ఆసక్తికరం. హిందీలో టబు చేసిన కేరక్టర్ని, తమిళ్లో ఓ మేల్ ఆర్టిస్ట్ చేశారు. హిందీలో ఫీమేల్ చేస్తే బావుంటుందనుకున్న అజయ్ ఆ మేరకు మార్పులు చేర్పులు చేశారు. అజయ్ దేవ్గన్ నటించిన మైదాన్ జూన్ 23న విడుదల కానుంది. ఇందులో అజయ్ సరసన ప్రియమణి నటించారు. అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ కేరక్టర్లో నటిస్తున్నారు అజయ్.