Facebook Twitter
దశకొద్దీ పురుషుడు… దానం కొద్దీ బిడ్డలు!

సన్యాసులు భిక్షకు వెళ్లడం సంప్రదాయం . అలా నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు . 

మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ -భవతి భిక్షామ్ దేహి - అని అడుగుతున్నారు . ఒక ఇంట్లో నుండి - చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది . ఒకామె సగం  పాడయిపోయిన అరటిపండు వేసింది . 

ఒకామె ఒంటికాలిమీద లేచి తిట్టింది . శాపనార్థాలు పెట్టింది . ఊగిపోయింది . ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోశారు . 

పాడయిపోయిన అరటిపండు భాగాన్ని తొలిగించి - బాగున్నంతవరకు దారిలో కనపడిన ఆవుకు పెట్టి మఠం చేరుకున్నారు . వారివారి పనుల్లో మునిగిపోయారు . 

మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మానికి ఆనుకుని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు . నెమ్మదిగా అతడిదగ్గరికి వెళ్లి కారణం కోసం ఆరా తీశాడు . 
పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు , శాపనార్థాలు , ప్రదర్శించిన కోపం చాలా బాధపెడుతోంది . వికారంగా ఉంది . తట్టుకోలేకపోతున్నాను - అన్నాడు . 

వివేకానందుడు సమాధానం అతడిచేతే చెప్పించి ఓదార్చాడు .  

ప్రశ్న - సమాధానం 
----------------

ప్ర : మనకు భిక్షలో ఈ రోజు ఏమేమి వచ్చాయి ?

స : సగం పాడయిపోయిన అరటి పండు , కొద్దిగా బియ్యం .

ప్ర : మనం మఠానికి ఏమి తెచ్చుకున్నాం ?

స : కొంచెం అరటిపండు అవుకు పెట్టేసి , బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం .

ప్ర : మరి తెచ్చుకున్నవాటిలో తిట్లే లేనప్పుడు , అవి నీవి కావు . నీతో రాలేదు . మనం తీసుకున్నది అరటిపండు , బియ్యమే కానీ , తిట్లను  తీసుకోలేదు - ఇక్కడికి మోసుకురాలేదు . రానిదానికి - లేనిదానికి అకారణంగా బాధపడుతున్నావు . 

స : నిజమే స్వామీ !

-----------------

మనమూ అంతే . తలుచుకుని తలుచుకుని ఆనందించాల్సిన , పొంగిపోవాల్సిన ఎన్నింటినో వదిలేసి ఎవెరెవరివో - ఎప్పటెప్పటివో - అన్నవారికే గుర్తుకూడా ఉండని తిట్లను , కోపాలను , అవమానాలను తలుచుకుని తలుచుకుని బాధపడుతూ ఉంటాం . 

ఏ వివేక వాణి వచ్చి చెప్పాలి - మనది అకారణ బాధ అని .