జగన్ ని కలిసిన షర్మిలా : రేపు ఆపరేషన్
posted on Dec 18, 2012 12:48PM
చంచల్ గూడ జైల్లో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ని ఈ రోజు ఉదయం ఆయన సోదరి వైయస్ షర్మిలా కలిశారు. జగన్ తో మాట్లాడేందుకు షర్మిలా కు జైలు అధికారులు అరగంట సమయాన్ని ఇచ్చారు. షర్మిలా వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్ కూడా జైలుకు వచ్చారు. మోకాలి గాయంతో బాధ పడుతున్న షర్మిలా జగన్ ను కలిసేందుకు వీల్ చైర్ లో జైలుకు వచ్చారు.
కాలి గాయంతో షర్మిలా హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమె మోకాలుకు వైద్యులు శస్త్ర చికిత్స చేయనున్నారు. షర్మిలా చేస్తున్న పాద యాత్రకు మూడు వారాలు బ్రేక్ పడనుంది. పాద యాత్ర చేస్తున్న సమయంలో తన వాహనం ఫై నుండి పడటంతో ఆమె మోకాలికి గాయం అయింది.
గత శని, ఆది వారాల్లో ఆమె పాద యాత్ర జరగలేదు. సోమ వారం తిరిగి యాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే,మోకాలి నొప్పి కారణంగా అది సాధ్య పడలేదు. దీనితో, వైద్యులు జరిపిన ఎమ్మార్ స్కాన్ లో గాయం పెద్దదిగా ఉన్నట్లు తేలింది. బుధవారం ఆమెకు వైద్యులు కీ హోల్ ఆపరేషన్ చేయనున్నారు. ఆపరేషన్ తర్వాత మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు ఆమెకు తెలియచేశారు.