పాక్‌లో సన్నీయాదవ్‌ బైక్ రైడ్.. రంగంలోకి ఎన్‌ఐఏ

 

యూట్యూబర్ భయ్యా సన్నీయాదవ్‌ను చెన్నై ఎయిర్పోర్టులో ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సన్నీ యాదవ్ ఇటీవలే పాకిస్తాన్‌‌‌‌లో బైక్ రైడ్ చేశారు. పాక్ టూర్ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌‌‌లోడ్ చేశాడు. అయితే, ఓ నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు టూర్ ముగించుకుని స్వదేశానికి వచ్చిన భయ్యా సన్నీ యాదవ్‌ను ఇవాళ చెన్నై ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ అధికారుల సమాచారంతో తెలంగాణ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సన్నీ స్వగ్రామైన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి వెళ్లి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులను సైతం విచారించినట్టు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఇవాళ ఎన్ఐఏ అధికారులు సన్నీ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. 

మరోవైపు భయ్యా సన్నీయాదవ్ రెండు నెలలు పాకిస్థాన్‌లో ఏం చేశాడు? అక్కడ ఆయనకు షల్టర్ ఇచ్చింది ఎవరు? పాకిస్థాన్‌లో ఎవరెవరిని కలిశాడు? అసలు అన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఆపరేషన్ సిందూర్ జరుతుగుతున్న సమయంలోనే అక్కడి వీడియోలను ఎందుకు అప్ లోడ్ చేశాడు? అనే విషయాలపై ఎన్ఐఏ దర్యాప్తు చేసున్నాట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేనప్పటికీ పాకిస్థాన్‌లో రెండు నెలల దిన చర్యపై కూపీలాగుతున్నట్లు పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. పాక్ పర్యాటనపై విమర్శలు రావడంతో  సన్నీయాదవ్ ఇటీవలనే ఓ వీడియో విడుదల చేశారు. తనపై కొంతమంది తప్పులు వీడియోలు, వార్తలు పోస్ట్ చేస్తున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. మీలాగే తనకు కుటుంబం ఉందని, మమ్ముల్ని బాధపెట్టేవారిపై తాను లీగల్‌గా యాక్షన్ తీసుకుంటానని ఆయన హెచ్చరించాడు