వైసీపీ ఎమ్మెల్యేలకు నరకం చూపిస్తున్నారట

తెలంగాణలో పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలు గందరగోళంలో పడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఓటేసిన తర్వాత తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వైసీపీఎమ్మెల్యేలు మదనలాల్, తాటికొండ వెంకటేశ్వర్లు తెగ బాధపడిపోతున్నారు. తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని, ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఒకరకంగా, తర్వాత మరోరకంగా టీఆర్ఎస్ లీడర్స్ ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారట. ఇప్పుడు కనీసం పలకరించేవారే కరువయ్యారని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, కనీసం తమ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. పార్టీలో చేరేముందు స్వర్గాన్ని చూపిస్తామని చెప్పి, ఇప్పుడు నరకం చూపిస్తున్నారని మండిపడుతున్నారు. తమకు కనీసం నియోజకవర్గ నిధులు కూడా ఇవ్వకుండా, ప్రజల్లో అవమానిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు, వైసీపీలో ఉండగా, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేదోడువాదోడుగా ఉండేవారని, కానీ పార్టీ మారడంతో ఆ పరిస్థితి ఇప్పుడు లేదని, తాము వైసీపీలో ఉన్నా బాగుండేదని వాపోతున్నారట. మరికొద్దిరోజులు వేచిచూస్తామని, అయినా టీఆర్ఎస్ నేతల్లో మార్పు రాకపోతే, మళ్లీ పార్టీ మారే అంశాన్ని ఆలోచిస్తామంటున్నారు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు