వింగ్‌ కమాండర్‌ అభినందన్‌కు 'వీర్‌చక్ర' పురస్కారం

 

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘వీర్‌చక్ర’ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. జవాన్లకిచ్చే పరమ్‌వీర చక్ర, మహా వీరచక్ర తర్వాత మూడో అత్యున్నత పురస్కారం ఇది. 

ఈ ఏడాది ఫిబ్రవరి 26న బాలాకోట్‌ దాడి జరిగిన మరుసటి రోజు పాకిస్థాన్‌ యుద్ధ విమానాలు మన దేశంపై దాడికి ప్రయత్నించాయి. ఆ సమయంలో పాక్‌ కు చెందిన ఎఫ్‌-16ను అభినందన్‌ తన మిగ్‌ విమానంతో కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మిగ్‌ కూడా కూలిపోవడంతో అభినందన్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో దిగారు. అక్కడి స్థానికులు ఆయనను పట్టుకుని పాక్‌ సైనికులకు అప్పగించారు. మూడు రోజుల తర్వాత అభినందన్‌ను దాయాది దేశం విడిచిపెట్టింది. అయితే పాక్‌ సైనికులు ఎంత ఒత్తిడి చేసినా అభినందన్‌ మన సైన్యానికి సంబంధించిన రహస్యాలను వెల్లడించలేదు. శత్రువుల చెరలో ఉన్నప్పుడు కూడా ఎంతో ధైర్యంగా ఉన్నారు. అందుకుగానూ ఆయనను ప్రభుత్వం వీర్‌చక్రతో సత్కరించనుంది.