వెల్లంపల్లి గోడ దూకేస్తారా?.. జోగి మాటల మర్మమేమిటి?

వైసీపీలో నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్లే కనిపిస్తున్నది. ముఖ్యంగా వైసీపీ ప్లీనరీకి ముందు జిల్లాలలో జరుగుతున్న సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. ఆ సమావేశాలలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాల గుట్టు రట్టు చేస్తున్నాయి.

ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలోనే ఆయన వైసీపీ నేతలకు కొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా మాజీ మంత్రి వెల్లంపల్లి ఈ రోజు వైసీపీలోనే ఉన్నా ముందు ముందు ఉంటారన్న నమ్మకం లేదని మంత్రి జోగి రమేష్ అన్నారు.  మంత్రి జోగి రమేష్‌ వ్యాఖ్యలతో వేదికపై ఉన్నవారితో పాటు కార్యకర్తలు ఖంగుతిన్నారు. జోగి రమేష్ ఒక్కరే కాదు మంత్రి బొత్స సత్యనారాయణ సైతం తన నియోజకవర్గ పరిధిలో జరిగిన పార్టీ సమావేశంలో ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. పార్టీ నుంచి క్యాడర్ జారిపోతోంది.. జాగ్రత్త పడకుంటే కష్టం అన్న రీతిలో మాట్లాడారు.

నెల్లూరు జిల్లా నేతలైతే తమ విభేదాలతో రచ్చకెక్కుతున్నారు. మంత్రి బాలినేని విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆయన పలు సందర్భాలలో బహిరంగంగా చెప్పారు. గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అయితే గన్నవరం, బందర్ నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు ఎవరన్నది ప్రకటించేసి ఆయా నియోజకవర్గాలలో ఇప్పటికే ఉన్న గ్రూపు తగాదాలకు అజ్యం పోశారు. ఇలా ఇక్కడ ప్రస్తావించిన జిల్లాలలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైసీపీలో గ్రూపు తగాదాలు శృతి మించి రాగానపడ్డాయని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. దీనికి కారణం విజయసాయి, సజ్జలలే కారణమని పార్టీ శ్రేణులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.  తాడేపల్లి ఫ్యాలెస్‌లోకి  విజయసాయి రీ ఎంట్రీ  తర్వాతే  జిల్లాల్లోని నేతల మధ్య ఉన్న గ్రూప్ తగాదాల   రచ్చ పెచ్చరిల్లిందని అంటున్నారు.

 వైయస్ జగన్ ప్రతిపక్ష నేత నుంచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కే వరకు విజయసాయిరెడ్డి  పాత్ర పార్టీలో అత్యంత కీలకం.. నాడు ఆయన ఆధ్వర్యంలోనే 2019 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక లగాయతు.. జగన్ తొలి కేబినెట్ కూర్పు  జరిగింది.  ఆ తర్వాత ఆయన ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్‌గా వైజాగ్ వెళ్లిపోయారు.. ఆ తర్వాల అంతా  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాలోని పదవులు రాని కీలక నేతలంతా ఆయన చుట్టూ  చేరారు. అక్కడ నుంచి ఏ జిల్లాలో జిల్లాల్లో ఎక్కడ ఏ నాయకుల మద్య అసంతృప్తి జ్వాలలు  ఎగిసినా   సజ్జల రామకృష్ణరెడ్డి  డైరెక్ట్‌గా రంగంలోకి దిగి.. సముదాయించడం జరుగుతూ వస్తోంది.  

అయితే విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించి.. జిల్లా అధ్యక్షులు, సమన్వయ కర్తల బాధ్యతలు అప్పగించడంతో జిల్లాల్లో రచ్చకు అంకురార్పణ జరిగిందని అంటున్నారు. సజ్జల, విజయసాయి రెండు అధికార కేంద్రాలుగా మారడంతో జిల్లాల్లో పార్టీ నేతలు, క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.. సజ్జల, విజయసాయి మధ్య విడిపోయిన జిల్లాల నేతల పంచాయితీ ఇప్పుడు వారు కూడా తీర్చలేని స్థితికి చేరుకుందనీ, దీంతో ఇవన్నీ   జగన్ వద్దకు చేరుతున్నాయనీ పార్టీ కేడర్ చెబుతున్నారు.  

అదే సమయంలో జనంలో వైసీపీ పాలన పట్ల వ్యతిరేకత పెరుగుతుంటే.. మరోవైపు తెలుగుదేశం, జనసేనలు బలోపేతం అవుతున్నాయి. ఆ రెండు పార్టీలు బలోపేతం అవుతున్నాయనడానికి జనసేన సభ, తెలుగుదేశం మహానాడుల సక్సెసే తార్కాణమని వైసీపీ క్యాడరే బహిరంగంగా చెబుతోంది. కేవలం ఒక ఎమ్మెల్యే ఉన్న జనసేన సభ సక్సెస్ అయ్యింది.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం మహానాడు సూపర్ సక్సెస్ అయ్యింది. మరి   151 ఎమ్మెల్యేలు ఉండి, అధికారంలో ఉన్న వైసీపీ ప్లీనరీ ఎంత బ్రహ్మాండంగా జరగాలి అని జగన్ అంటుంటే... క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదని వైసీపీ క్యాడర్ అంటున్నారు.