తెలంగాణలో 23 స్థానాల్లో పోటీ చేయాలనుకున్నాం: పవన్ కళ్యాణ్

 

తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. దాదాపు అన్ని పార్టీలు ప్రచారాలతో బిజీగా ఉంటూ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే తెలంగాణలో ఎన్నికలకు జనసేన దూరంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఇదే విషయంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై రెండుమూడు రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్‌ తెలిపారు. ముందస్తు ఎన్నికలు రావడం, సన్నద్ధత లేకపోవడంతో పోటీపై సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు. ముందస్తు కాకుండా వచ్చే ఏడాదే ఎన్నికలు వస్తే 23 స్థానాల్లో పోటీ చేయాలని ముందుగా అనుకున్నామని.. అలాగే మూడు పార్లమెంట్‌ స్థానాల్లో కూడా పోటీ చేయాలని భావించామని పేర్కొన్నారు. ముందస్తుకు వెళ్లడంతో తమ పార్టీ పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొందని వివరించారు. అయితే కొంత మంది స్వతంత్రంగా నిలబడతామని.. తమకు మద్దతు తెలపాలని కోరుతున్నారని పవన్‌ చెప్పారు. వీటన్నింటిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని పవన్‌ స్పష్టం చేశారు.