కవిత దారెటు.. ఈ ప్రశ్నకు బదులేది?

సరదాగా.. కొంచే కామెడీ..గా అయితే.. బాలయ్య బాబులా... సరే.. సర్లే ఎన్నో అనుకుంటాము అన్నీ జరుగుతాయా ఏంటి?’ అనుకోవచ్చు.  కాదూ..  కూసింత సీరియస్’గా చెప్పుకుందామంటే, రజనీకాంత్ చెప్పిన  అతిగా ఆశ పడే ఆడది.. ఆతిగా ఆవేశ పడే మగాడు సుఖ పడినట్లు చరిత్రలో లేదు  అన్న డైలాగు  గుర్తు చేసుకోవచ్చు.  అవును..  మన ఇప్పుడు మాట్లాడు కుంటున్నది  బీఆర్ఎస్ లో తిరుగు బావుటా ఎగరేసిన   ఎమ్మెల్సీ,  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె  కల్వకుంట్ల కవిత గురించే.  నిజానికి..  కవిత మనసులో ఏముందో అప్పుడే కాదు.. ఇప్పటికీ అంటూ ఈరోజుకు కూడా ఎవరికీ తెలియదు. అందుకే..  ఆమె  ఏదో ఉహించుకుని అడుగు ముందుకు వేశారా.. లేక అత్యాశకు పోయి గడప  దాటారా? అనేది ఒక విధంగా ఈ రోజుకూ  శేష ప్రశ్నగానే ఉందని అంటున్నారు. అలాగే..  అమెది తిరుగు బాటు కాదు..  కేసీఆర్ వ్యూహంలో భాగమనే ప్రచారం కూడా జరుగుతోంది.   

అయితే..  రెండు రోజుల క్రితం కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరయ్యే క్రమంలో ఫాంహౌస్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరుతున్న తండ్రి కేసీఆర్‌ను పలకరించేందుకు ఎదురు వెళ్ళిన   కవితను కంటి సైగతోనే  కేసీఆర్ దూరంగా ఉంచిన వైనం  గమనిస్తే..  కవిత ప్రవర్త కేసీఆర్ ను గట్టిగా హర్ట్ చేసిందనీ,  ఆమె పట్ల కేసీఆర్   నిజంగానే చాలా   కోపంగా ఉన్నారనే విషయం చాలా స్పష్టంగా అందరికీ అర్థమైం దని అంటున్నారు.

నిజానికి  అందరికీ మరీ ముఖ్యంగా కవితకు  తమ స్థానం ఏమిటో అర్థం అవడం కోసమే కేసీఆర్  అందరి ముందూ కవితను దూరం పెట్టారని అంటున్నారు. అలాగే  ఆమె ఎవరిని  దేవుడి చుట్టూ చేరిన దయ్యాలు గా పేర్కొన్నారో వారు అదే స్థానాల్లో అలాగే ఉన్నారు. కేసీఆర్ వారికి ముందు ఇచ్చిన ప్రాధాన్యతనే ఇచ్చారు. ఇస్తున్నారనే విషయం కూడా విచారణ క్రమంలో జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.  

అంటే..  గతంలో తామే గులాబీ జెండా నిజమైన యజమానులమంటూ చిన్నపాటి ధిక్కార స్వరాన్ని వినిపించిన ఈటల రాజేందర్ తదితర నాయకుల పట్ల వ్యహరించిన తీరుగానే  కవిత విషయంలోనూ కేసీఆర్ కఠిన వైఖరి కొనసాగిస్తారని అనుకోవచ్చని అంటున్నారు.ఈ నేపధ్యంలో కవిత రాజకీయ భవిష్యత్తు  ఏమిటనేది  ప్రశ్నగా మారిందని అంటున్నారు.

నిజానికి..  కవితకు ఇప్పటికే పరిస్థితి అర్థమైందనీ  అందుకే ఆమె  తండ్రికి దగ్గరయ్యేదుకు   ప్రయత్నాలు చేస్తున్నట్లు చెపుతున్నారు. అందులో భాగంగానే  కేసీఆర్  కు కాళేశ్వరం కమిషన్  నోటీసు ఇవ్వడాన్ని  ప్రశ్నిస్తూ..  ‘జాగృతి’ బ్యానర్ పై నిరసన ప్రదర్శన  నిర్వహించడం  పిలుపు లేకుండానే పలకరించేందుకు ఫార్మ్ హౌస్ కు వెళ్ళడంతో పాటుగా..  ఇతర చానల్స్ ద్వారా కూడా  ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇంత వరకు అటు నుంచి ఎటువంటి సానుకూల స్పందన రానట్లు తెలుస్తోంది. అదే సమయంలో..  ఇప్పటికిప్పుడు పార్టీ పరంగా కవిత పై క్రమ శిక్షణ చర్యలు తీసుకోక పోవచ్చని అంటున్నారు.

అలాగే..  పార్టీ పెట్టే అవకాశం గానీ వేరే పార్టీలో చేరే పరిస్థితి కానీ  కవితకు లేదని అంటున్నారు.  ముఖ్యంగా  తాను కాంగ్రెస్ పార్టీలోఉన్నంత వరకు కేసీఆర్  ఫ్యామిలీలో ఎవరినీ కాంగ్రెస్  లో చేర్చుకునే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపధ్యంలో కాంగ్రెస్  తలుపులు కవితకు మూసుకున్నట్లే అంటున్నారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనక్కరలేదు.  సో .. కవిత రాజకీయ భవిష్యత్ ఏమిటి ? ఆమె మరో షర్మిల అవుతారా ? లేక ఏదో దారిన ఫార్మ్ హౌస్ కు చేరతారా? కవిత దారెటు .. ఈ ప్రశ్నకు బదులేది?