సి.ఎం.గారు కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?రాములమ్మ ఆగ్రహం

క‌రోనా వైర‌స్ హైద‌రాబాద్ నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని విజయశాంతి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కరోనా వైరస్ సోకకుండా నియంత్రించేందుకు హైదరాబాద్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం రెడ్‌జోన్‌గా ప్రకటించిందన్నారు. ఈ మహానగరంలో ఆంక్షలను చూస్తున్నప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లే వెసులుబాటు కూడా లేదని... మరి అలాంటప్పుడు మళ్లీ కేసుల సంఖ్య పెరగడానికి కారణం ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదని వ్యాఖ్యానించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ సమయం పూర్తి అయ్యిందని ప్రభుత్వం ప్రకటించిందని... మరి తబ్లిక్ జమాత్‌కు వెళ్ళిన వారందరినీ ప్రభుత్వం గుర్తించిందా? వారందరికీ క్వారంటైన్ పూర్తయిందని టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వగలదా? అని విజయశాంతి ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సూచనల మేరకు దాదాపు రెండు నెలల నుంచి ఇళ్లకే పరిమితమవుతున్న గ్రేటర్ హైదరాబాద్ వాసులకు కరోనా మహమ్మారి నుంచి ఎప్పుడు ఉపశమనం కలుగుతుందో అంతుబట్టడం లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అన్నారు. మే నెల 8 తర్వాత తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోతాయని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రకటనలు చూసి హైదరాబాద్ వాసులు చాలా ఆశలు పెంచుకున్నారని.. కానీ ప్రభుత్వం ప్రకటించిన తేదీ తర్వాత కరోనా కేసులు తగ్గకపోగా... మళ్లీ ఈ మహమ్మారి ఇంకా విజృంభిస్తోందన్నారు.

ప్రస్తుతం వలస కూలీల వల్ల కరోనా వ్యాపిస్తోందని టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చిందని విమర్శించారు. అదే నిజమైతే హైదరాబాద్‌ను రెడ్‌జోన్‌గా ప్రకటించడంలో అర్థమేముందని నిలదీశారు. అంటే వలస కూలీలు హైదరాబాదులో విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఉందా? ఈ విషయంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఒకవేళ వలస కూలీల వల్ల నగరంలో కరోనా వ్యాప్తి చెందకపోతే.. ఎవరి కారణంగా గత నాలుగు రోజుల పాటు కరోనా కేసులు పెరుగుతున్నాయో స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

మొదటి నుంచీ అయోమయ ప్రకటనలతో, అస్పష్ట నిర్ణయాలతో... కరోనా కట్టడి విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వివాదాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సి.ఎం. కేసీఆర్‌ వైఖరిలో మార్పు రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటోందని విజయశాంతి తెలిపారు.