సాక్ష్యంతో సహా టీడీపీ, బీజేపీ సీక్రెట్ దోస్తీ బట్టబయలు!!

 

ప్రస్తుతం టీడీపీ, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. టీడీపీ, బీజేపీ నేతలు ఒకరిమీద ఒకరు విమర్శలతో విరుచుకుపడుతూ.. మాటల యుద్ధం చేస్తున్నారు. అంతెందుకు సాక్ష్యాత్తూ పీఎం మోదీ, సీఎం చంద్రబాబే హద్దు దాటి వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపేనట. నాణేనికి మరోవైపు పూర్తి భిన్నంగా ఉందని చెప్తున్నారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. నిన్నటి వరకు వైసీపీ, బీజేపీ రహస్య పొత్తు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాయని టీడీపీ నేతలు విమర్శించారు. అయితే ఇప్పుడు టీడీపీనే బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకొని.. పైకి మాత్రం బీజేపీ తో పోరాడుతున్నట్లు నటిస్తుందంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు సాక్ష్యంగా ఒక ఫోటోని కూడా చూపిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.

'పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రైవేట్‌గా ప్రేమాయణం కొసాగిస్తున్నారు. బీజేపీతో కటీఫ్‌ అంటూనే బాబు & కో చాటుగా వారితో సాగిస్తున్న కాపురం గుట్టు రట్టు. ఢిల్లీకి టీడీపీ నేతలు ఎక్కిన స్పెషల్‌ ఫ్లైట్‌లో బీజేపీ ఎంపీ హరిబాబు ప్రత్యక్షం! అనైతిక సంబంధానికి ఇంకేం నిదర్శనం కావాలి?' అంటూ ఫోటోని జత చేసి ట్వీట్ చేసారు. 'కేంద్రంపై టిడిపి చేసేవి దొంగ దీక్షలనడానికి ఇంత కంటే నిదర్శనమేం కావాలి. పగలంతా పోరాటం, రాత్రి పూట కలిసి కాపురం. సీఎం ఢిల్లీ దీక్షకు ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో బిజెపి ఎంపీ హరిబాబు కూడా ప్రయాణించాడు. ప్రజలకు అర్థమైంది మీ అనుబంధం!' అంటూ మరో ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.