రాసలీల సీడీ.. 5 కోట్ల ఒప్పందం! కర్ణాటకలో మరో రచ్చ
posted on Mar 6, 2021 7:33AM
కర్ణాటక రాజకీయాలలో దుమారం రేపిన మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల ఎపిసోడ్ లో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. బీజేపీ మంత్రి అడ్డంగా ఇరుక్కోవడంతో .. విపక్షాలు ఇదే అస్త్రంగా విమర్శల దాడి పెంచాయి. రాసలీలల సీడీ వెనుక రూ. 5కోట్ల ఒప్పందం జరిగిందని, దీనికి సంబంధించిన సమాచారం ఉందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మైసూరులో తొలుత సీడీ గురించి మాట్లాడే వ్యక్తిని అరెస్టు చేయాలన్నారు. ఇంకా తన వద్ద సీడీలు ఉన్నాయని ప్రకటించడం వెనుక బ్లాక్మెయిల్ కనిపిస్తోందన్నారు.
ఎవరి వ్యక్తిగత జీవితాన్నైనా ఈ విధంగా చూపడం తప్పని కుమారస్వామి అన్నారు. తనకున్న సమాచారం ప్రకారం మూడు నెలల కిందటే సీడీ చూపి బ్లాక్మెయుల్ చేశారని చెప్పారు. దీని వెనుక బడా నేతల హస్తముందని మరో బాంబు పేల్చారు. సమాజంలో విసుగుపుట్టించే పరిస్థితి నెలకొందని కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు. ఒక మాజీ సీఎం ఎక్కడికెక్కడో వెళ్లివస్తారని.. సదరు సీడీ కూడా తన వద్ద ఉందని చెబుతున్నారని, అదెవరిదో చెబితే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో దేవేగౌడ, ఎస్ఎం కృష్ణ కాలం నుంచి ఎంతోమంది సీఎంలుగా పనిచేశారని, ప్రజా జీవితంలో వారిని అనుమానంతో చూసే పరిస్థితి తీసుకురావద్దని సూచించారు.