రష్యాలో విమాన ప్రమాదంలో 49 మంది మృతి

  రష్యాలో అదృశ్యమైన అంగార ఎయిర్‌లైన్స్ ఫ్యాసింజర్ విమానం కూలిపోయిందని ఎయిర్‌లైన్‌ అధికారులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనల్లో  49 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విమానానికి సంబంధించి శిథిలాలను అధికారులు గుర్తించారు. కాగా ఇదే ప్రాంతంలో గతేడాది హెలికాప్టర్ కూడా మిస్ అవడం గమనార్షం.ఎయిర్ పోర్టుకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. ఘటనా స్థలంలో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయని, ప్రమాద తీవ్రతను గమనిస్తే ప్రయాణికులలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని చెప్పారు. అంగారా ఎయిర్‌లైన్‌కు చెందిన ఏఎన్‌-24 విమానం గురువారం ఉదయం బ్లాగోవెష్‌చెన్స్క్‌ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయల్దేరింది.  టిండాలోని ఎయిర్ పోర్టులో పైలట్ ల్యాండింగ్ కు ప్రయత్నించి విఫలమయ్యారని సమాచారం. ఎయిర్ పోర్ట్ చుట్టూ తిరిగి మరోమారు ల్యాండింగ్ కు పైలట్ ప్రయత్నించారని, ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టుకు 15 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. 
రష్యాలో విమాన ప్రమాదంలో 49 మంది మృతి Publish Date: Jul 24, 2025 2:33PM

ఢిల్లీలో రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్.. దేనిపైనంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. గురువారం (జులై 24) రేవంత్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లకార్జున్ ఖర్గే, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా కులగణన, బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుపై పార్లమెంటులో లేవనెత్తాల్సిందిగా రేవంత్ ఈ సందర్భంగా రాహుల్, ఖర్గేలను కోరారు. అసలు బీసీ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకే ఆయన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఇతర మంత్రులతో ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఇలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం (జులై 24) సాయంత్రం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయనున్నారు. తెలంగాణలో కులగణన జరిగిన తీరు, అనుసరించిన విధానం వంటి అంశాలపై ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్  ఇవ్వనున్నారు. కులగణన, బీసీ రిజర్వేషన్ అంశాలలో తెలంగాణ దేశానికే మోడల్ గా నిలుస్తుందని రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలకు ఇవే అంశాలపై రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం ప్రాథాన్యత సంతరించుకుంది.   
ఢిల్లీలో రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్.. దేనిపైనంటే? Publish Date: Jul 24, 2025 2:18PM

తిరుపతిలో జాతీయ మహిళా సాధికార సదస్సు

తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. సెప్టెంబర్ 14 నుంచి రెండు రోజుల పాటు తిరుపతిలోని తాజ్ హోటల్ లో జరిగే ఈ సదస్సు నిర్వహణపై ఆయన గురువారం (జులై 24) సమీక్ష నిర్వహించారు. తొలుత ఈ సదస్సును విశాఖలో నిర్వహించాలని భావించినప్పటికీ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సూచన మేరకు శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుపతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు.   ఈ సదస్సుకు  ఈ సదస్సుకు ప్రతి రాష్ట్రం నుంచి ఆరుగురు, ప్రతి అసెంబ్లీ నుంచీ ఆరుగురు చొప్పున మహిళా ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు.  300 మందికి పైగా ఈ సదస్సుకు హాజరౌతారనీ.. ఈ సదస్సులో చర్చించిన అంశాల నివేదికను పార్లమెంటు, అసెంబ్లీల ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెడతారని అయ్యన్నపాత్రుడు వివరించారు.  
తిరుపతిలో జాతీయ మహిళా సాధికార సదస్సు Publish Date: Jul 24, 2025 1:58PM

సీఎం చంద్రబాబు ట్వీట్‌.. పవర్ స్టార్ హర్షం

డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నటించిన సినిమా సూపర్ సక్సెస్ కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు   ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆప్యాయంగా చేసిన పోస్ట్ నాకు ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగించిందంటూ రీట్వీట్ చేశారు.  మెగా అభిమానులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకేలకు గురువారం (జులై 24)  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుధవారం (జులై 23)   రాత్రే ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ప్రేక్షకులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న హరిహరవీరమల్లు (#HariHaraVeeraMallu) చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు... చారిత్రాత్మక కథాంశంతో రూపొందించిన చిత్రంలో తొలిసారి నటించిన 'హరిహర వీరమల్లు' సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నానంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే...  సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నానని సీఎం ఆ పోస్టులో పేర్కొన్నారు.   ఈ ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఎం పోస్ట్ ను ట్యాగ్ చేస్తూ.. 'సీఎం చంద్రబాబు గారూ, నేను గత పదేళ్లలో పలుమార్లు సమావేశమయ్యాం. అయినప్పటికీ ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదు. ఈ రోజు  హరిహర వీరమల్లు గురించి చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ మాటలు విజయ సంకేతాలు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు.. చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు సీఎం చంద్రబాబుగారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియ చేస్తున్నాను  అని  పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు ట్వీట్‌..  పవర్ స్టార్ హర్షం Publish Date: Jul 24, 2025 1:25PM

కాంగ్రెస్ గూటికి కొండబాల?

డిప్యూటీ సీఎం భట్టితో సంప్రదింపులు! తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారా? అందుకు రంగం సిద్ధం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  రెండు రోజుల క్రితం  కొండబాల కోటేశ్వరరావు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో  ఉన్నంత కాలం ఆయన తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ గా కొనసాగారు.  గతంలో మధిర ఎమ్మెల్యే గా కూడా కొండబాల పనిచేశారు. దీంతో ఆయనకు   అనుచరగణం కూడా ఉంది. భట్టితో భేటీ సందర్భంగా కొండబాల తనకు ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వమని కోరినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో భట్టి నుంచి ఆయనకు స్పష్టమైన హామీ ఏదీ రాలేదని తెలుస్తోంది. కొండబాల అడిగిన దానికి భట్టి  హామీ ఇవ్వలేననీ,  ఎప్పటి నుంచో   పార్టీలో కొనసాగుతున్న వారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారని అంటున్నారు. అయితే.. ఆరు నెలల తర్వాత పరిస్థితిని బట్టి ఆలోచిస్తామని చెప్పినట్లు సమాచారం. దీనికి  కొండబాల కూడా సుముఖత వ్యక్తం చేసి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. ప్రస్తుతం కొండబాల తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన  అనుచరుల నుంచి పార్టీ మార్పునకు విముఖత వ్యక్తమౌతోందని అంటున్నారు. 
కాంగ్రెస్ గూటికి కొండబాల? Publish Date: Jul 24, 2025 1:12PM

గాల్లోనే అదృశ్యమైన విమానం.. పేలిపోయి ఉంటుందన్న అనుమానాలు

రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 50మంది ప్రయాణికులతో చైనా లోని టిండా నగరం వైపు వెళ్తున్న విమానం అదృశ్యమైంది. ఆ విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో  సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.  ఆ విమానం  గాల్లోనే పేలిపోయినట్లు ఆందోళన వ్యక్తం అవుతున్నది.   ర‌ష్యాలోని అంగారా విమాన‌యాన సంస్థ‌కు చెందిన ప్ర‌యాణికుల‌ విమానం 50 మందితో వెడుతూ చైనా స‌రిహ‌ద్దులో   గ‌ల్లంతైంది.  చైనా స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన అమూర్‌లోని టిండా ప్రాంతానికి వెళుతుండ‌గా  . గ‌మ్య‌స్థానానికి  కొద్ది దూరంలో అదృశ్యమైంది.  విమానం అదృశ్యమైన విషయాన్ని అధికారులు ధృవీకరించారు.    
గాల్లోనే అదృశ్యమైన విమానం.. పేలిపోయి ఉంటుందన్న అనుమానాలు Publish Date: Jul 24, 2025 12:59PM

లిక్కర్ స్కామ్ కేసు.. ఇక ఈడీ దూకుడు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ నేతలకు నిప్పుడు ఉప్పు తోడైనట్లుగా ఈడీ కూడా ఎంటర్ కావడంతో ఇక చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తునకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.   ఇక ఇప్పుడు ఈడీ కూడా ఈ కేసులో మనీ ల్యాండరింగ్ కు సంబంధించిన వ్యవహారంపై దర్యాప్తునకు నడుం బిగించింది. సిట్ నుంచి ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించింది. మనీ ల్యాండరింగ్ నిరోథక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ మద్యం కుంభకోణంతో సంబంధాలున్న పలువురు వైసీపీ నేతలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి శార్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్  చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న హైదరాబాద్ లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొంది.  
లిక్కర్ స్కామ్ కేసు.. ఇక ఈడీ దూకుడు Publish Date: Jul 24, 2025 12:43PM

అనిల్ అంబానీ కార్యాలయాలు, నివాసాలలో ఈడీ సోదాలు

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో ఈడీ అధికారులు గురువారం (జులై 24) సోదాలు చేపట్టారు. ఢిల్లీ, ముంబయిలోని ఆయనకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో దాదాపు 50 ప్రదేశాలలో ఏకకాలంలో ఈ దాడులు చేస్తున్నారు.   ఎస్‌బీఐ  ఇటీవల అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణఖాతాలను ఫ్రాడ్‌గా తేల్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరగడం ప్రాథాన్యత సంతరించుకుంది.   అనిల్ అంబానీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీల్యాండరింగ్ పై దర్యాప్తును ప్రారంభించిన ఈడీ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు ఇతర అనుబంధ సంస్థలపై దృష్టి సారించింది   అనిల్ అంబానీ  నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సంస్థలు   కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సోదాలు ఎందుకు, ఏ అవకతవకలకు సంబంధించి జరుగుతున్నాయనే విషయంపై ఎటువంటి అధికారిక సమాచారాన్ని ఈడీ వెలవరించలేదు. 
అనిల్ అంబానీ కార్యాలయాలు, నివాసాలలో ఈడీ సోదాలు Publish Date: Jul 24, 2025 12:30PM

ఏపీ కేబినెట్ భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తున్నారంటే..?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ప్రారంభమైంది.  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో మొత్తం 42 అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా  ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించి సభా నిర్వహణ తేదీలపై నిర్ణయం తీసుకోనున్నారు.   అలాగే బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలకు మంత్రివర్గం ఆమోదముద్రవేయనుంది.  అదే విధంగా ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనపై కూడా కేబినెట్ చర్చిస్తుంది.  ఇక ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఈ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే సీఆర్డీఏ ప్రతిపాదనలపై కూడా చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి.  అదే విధంగా పలు సంస్థలకు భూ కేటాయింపుపై కేబినెట్‌ నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  ప్రభుత్వంలో కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలాజీ   శాఖ ఏర్పాటుపై  చర్చించే అవకాశం ఉంది.  
ఏపీ కేబినెట్ భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తున్నారంటే..? Publish Date: Jul 24, 2025 12:19PM

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు

మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌కు   పోలీస్‌ లు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు  మేరకు అనిల్ కుమార్ యాదవ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కేసులో నోటీసులు జారీ చేశారు.   కోవూరులో జరిగిన వైసీపీ సమావేశంలో తనను అసభ్యంగా దూషించారని ఆరోపిస్తూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 26న ఉదయం పది గంటలకు కోవూరు పోలీసు స్టేషన్ లో విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. కాగా పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన నివాసంలో లేకపోవడంతో ఆయన నివాసానికి నోటీసు అంటించి వెళ్లారు.  ఇలా ఉండగా క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్టైన అనిల్ కుమార్ యాదవ్ సన్నిహితుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా ఆ కేసులో కూడా మాజీ మంత్రికి ఒకటి రెండు రోజులలో నోటీసులు  ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.  
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు Publish Date: Jul 24, 2025 11:29AM

ఉప్పొంగి ప్రవహిస్తున్న కావేరీ నది.. 84 ఏళ్లలో ఇదే తొలిసారి

కావేరీ నది పొంగి ప్రవహిస్తున్నది. దాదాపు 84 ఏళ్ల తరువాత ఈ నదిలో ఈ స్థాయి నీటిమట్టం రావడం ఇదే మొదటి సారి. ఈ నదిపై 1932లో కృష్ణసాగర్ డ్యాం నిర్మించిన తరువాత ఇక్కడ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం ఇది రెండో సారి మాత్రమే. ఎప్పుడో 1941లో కావేరీ నదికి ఉధృతంగా వరదలు వచ్చిన సమయంలో డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. మళ్లీ ఇంత కాలానికి ఈ ఏడాది జులైలో కావేరీ నది నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేఎస్ఆర్ డ్యాం వద్ద కావేరీ నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డ్యామ్ నిర్మాణం తరువాత తొలి సారిగా జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 124.4 అడుగుల స్థాయికి చేరుకుంది.    
ఉప్పొంగి ప్రవహిస్తున్న కావేరీ నది.. 84 ఏళ్లలో ఇదే తొలిసారి Publish Date: Jul 24, 2025 10:44AM

అడుసుతొక్కనేల.. సామెతను గుర్తు చేస్తున్న కొలికిపూడి!

తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావును వివాదాలు వెంటాడతాయా? లేక ఆయనే వివాదాల వెంటపడతారా తెలియదు కానీ, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆయన తరచూ వివాదాలతోనే సహవాసం చేస్తున్నారని అనిపించక  మానదు. తాజాగా కొలికిపూడి శ్రీనివాసరావు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షేక్ హ్యాండిచ్చి మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై కొలికిపూడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేగా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడర్ తో సఖ్యత లేకుండా చేసుకున్న కొలికిపూడి శ్రీనివాసరావు తన చర్యలు, తీరుతో అధిష్ఠానం ఆగ్రహానికీ గురయ్యారు. ఇప్పుడు తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో  కలిసి మాట్లాడిన వీడియో బయటకు రావడం సంచ లనంగా మారింది.  ఇప్పటికే పార్టీలోని సీనియర్లు కొలికపూడి చర్యలతో సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే మద్యం స్కాం లో పీకల లోతు కూరుకుపోయి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షేక్ హ్యాండిచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాను పెద్దిరెడ్డి రామచందరారెడ్డితో మాటలు కలిపిన వీడియో మొత్తం పది సెకండ్లేనని, యాథృచ్ఛికంగా హైదరాబాద్ విమానాశ్రయంలో ఎదురుపడిన పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డిని కేవలం పలకరించాననీ కొలికిపూడి వివరణ ఇస్తున్నప్పటికీ, టీడీపీ శ్రేణుల, నేతల ఆగ్రహం చల్లారడం లేదు. పలు అవినీతి కేసులలో అభియోగాలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డిని, అందులోనూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  కనిపించగానే అత్యుత్సాహంతో ఆయన వెంటపడి మరీ పలకరించాల్సిన అవసరం ఏం వచ్చిందని పార్టీ నాయకులు కొలికిపూడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయంలో తెలుగుదేశం అధిష్ఠానం కూడా కొలికిపూడిపై సీరియస్ గా ఉందంటున్నారు.   ఇప్పటికే తిరువూరు  పార్టీ శ్రేణులలో పరపతి పోగొట్టుకున్న కొలికిపూడిపై ఇప్పటికే చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు పెద్దిరెడ్డితో మాటామంతీ కారణంగా ఉన్న కొద్దిపాటి సానుకూలత కూడా కోల్పోయారని అంటున్నారు.  
అడుసుతొక్కనేల.. సామెతను గుర్తు చేస్తున్న కొలికిపూడి! Publish Date: Jul 24, 2025 10:19AM

బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి.. రేవంత్ డిమాండ్ తో బీజేపీ ఇరుకున పడ్డట్టేనా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  తన తాజా డిమాండ్ తో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ నే కాదు, బీజేపీ హైకమాండ్ ను కూడా ఇరుకున పడేశారు. తన రాజకీయ చాణక్యం ప్రదర్శించి.. కేంద్రంలో తీవ్ర ఒత్తిడి తీసుకుస్తున్నారు. కులగణనపై కేంద్రం మెడలు వంచుతామంటూ గర్జించారు.  హస్తినలో మీడియా సమావేశం పెట్టి మరీ ఉపరాష్ట్రపతి పదవిని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవిని బీసీలతో లింక్ పెట్టి కేంద్రాన్ని ఇరుకున పెట్టారు.   దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయడం ద్వారా బీసీలను గౌరవించినట్లే కాకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుర్తించినట్లు అవుతుందని రేవంత్ అన్నారు.  తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు బీసీల నాయకత్వాన్ని అణచివేస్తున్నారని ఆరోపణ చేయడమే కాకుండా..ఈ సందర్భంగా బండి సంజయ్ ను ప్రస్తావించారు.  బీసీలకు పెద్ద పీట వేసేందుకు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఇండియా  కూటమి పార్టీలతో తానే మాట్లాడి మద్దతు లభించేలా చేస్తానన్నారు.  బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి అంటూ రేవంత్ చేసిన డిమాండ్ బీజేపీకి గొంతులో పచ్చవెలక్కాయపడినట్లు చేసిందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే.. ఉపరాష్ట్రపతి పదవి విషయంలో బీజేపీ చాలా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వ్యూహాత్మకంగా పలు పేర్లను ప్రచారంలోకి తెస్తున్నది. అయితే బీజేపీ ప్రచారంలోకి తీసుకువస్తున్న పేర్లలో బండారు దత్తాత్రేయ పేరు మాత్రం లేదు.   బండారు దత్తాత్రేయకు పదవీవిరమణ వయస్సు దగ్గరపడుతోంది. ఇప్పటికే హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లకు గవర్నర్ గా పని చేశారు.  ఈ నేపథ్యంలోనే ఆయన పేరును ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ పరిశీ లించే అవకాశం ఇసుమంతైనా లేదు. అయినా  బీసీల విషయంలో బీజేపీ అన్యాయం చేస్తున్నదంటూ ఆ పార్టీ హైకమాండ్ ను ఎండగట్టడమే లక్ష్యంగా రేవంత్ ఈ డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి.. రేవంత్ డిమాండ్ తో బీజేపీ ఇరుకున పడ్డట్టేనా? Publish Date: Jul 24, 2025 9:49AM

శ్రీశైలం జలాశయానికి వరద పోటు

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లను 10 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక జూరాల జలాశయం  జలకళతో  కళకళలాడుతోంది. ప్రస్తుతం జూరాల జలాశయం నుంచి,  38 వేల 408 క్యూసెక్కుల నీరు వస్తున్నది. ఇక సుంకేశుల నుంచి అయితే 36 వేల 975 క్యూసెక్కుల నీరు వస్తున్నది.శ్రీశైలం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో 75 వేల 383 క్యూసెక్కులు ఉండగా, ఐట్ ఫ్లో లక్షా 21 వేల 482 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.50 అడుగులు ఉంది. కుడిచ ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.  
శ్రీశైలం జలాశయానికి వరద పోటు Publish Date: Jul 24, 2025 9:35AM

పరాఠాలు అంటే ఇష్టమా? దయచేసి స్టఫింగ్ కు ఇవి మాత్రం వాడకండి..!

   భారతీయులకు పరాఠాలు, రోటీలు అంటే చాలా ఇష్టం. చాలా ఇళ్ళలో  పూరీలు,  స్టఫ్డ్ చేసిన పరాఠాలు  చాలా సాధారణం. బంగాళాదుంపలు, పనీర్, జున్ను, మాంసం.. ఇట్లా చాలా పదార్థాలు పరాఠాల స్టఫింగ్ లో వాడతారు. పరాఠా రుచి ఇనుమడించడం కోసం చాలా రకాలుగా పరాఠాలు చేస్తుంటారు.  కానీ ఇట్లా పరాఠాలు చేయడం అన్ని విదాలుగా ఆరోగ్యకరమైనది కాదని అంటున్నారు ఆహార నిపుణులు. కొన్ని రకాల పదార్థాలు స్టఫ్ చేసి పరాఠాలు తయారు చేసుకుని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం చాలా పెరుగుతుందట. అలాగే ఊబకాయం కూడా సందేహం లేకుండా వస్తుంది అంటున్నారు. ఇంతకీ పరాఠాలలో స్టఫ్ చేయకూడని పదార్థాలు ఏమిటో తెలుసుకుంటే.. ప్రాసెస్డ్ చీజ్ లేదా మయోనైస్.. ఈ రోజుల్లో చీజ్ పరాఠాలు లేదా మాయో స్టఫ్డ్ రోల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ ప్రాసెస్ చేసిన వస్తువులలో సంతృప్త కొవ్వులు,  రసాయన ప్రజర్వేటివ్స్  ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.  ఊబకాయం,  గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. సరిగ్గా ఉడికించని మాంసం లేదా కీమా..  పూర్తిగా ఉడికించకుండా ముక్కలు చేసిన మాంసం లేదా మటన్‌తో నింపితే అది ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది. సరిగ్గా ఉడికించని మాంసం బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది.  గ్యాస్, వాంతులు, విరేచనాలు వంటి కడుపు సమస్యలను కలిగిస్తుంది.  ఎక్కువ నూనెతో సుగంధ ద్రవ్యాలు.. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు లేదా ఏదైనా కూరటానికి ఎక్కువ నూనె,  సుగంధ ద్రవ్యాలు జోడించిన పదార్థాలు స్టప్ చేస్తే  అది  కడుపు  జీర్ణ శక్తిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల మలబద్ధకం, ఆమ్లతత్వం,  గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. మిగిలిన కూరలు లేదా కూరగాయలు.. చాలా మంది మిగిలిపోయిన కూరగాయలను పరాఠాలలో ఉపయోగిస్తారు, కానీ ఏమైనా కాస్త పాడైన  కూరగాయలు శరీరంలో విషాన్ని కలిగిస్తాయి. ఫుడ్ ఇన్ఫెక్షన్ లకు  దారితీస్తాయి. అధిక ఉప్పు లేదా ఊరగాయ.. కొంతమంది  ఊరగాయ లేదా ఎక్కువ ఉప్పు జోడించడం ద్వారా పరాఠా రుచిని పెంచాలని కోరుకుంటారు. కానీ ఊరగాయలో ఉండే అధిక ఉప్పు కంటెంట్ కడుపులో చికాకు, ఆమ్లతత్వం,  అధిక రక్తపోటు వస్తుంది. అధిక ఉప్పు గుండె జబ్బులు,  మూత్రపిండాల సమస్యలను పెంచుతుంది.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
పరాఠాలు అంటే ఇష్టమా? దయచేసి స్టఫింగ్ కు ఇవి మాత్రం వాడకండి..! Publish Date: Jul 24, 2025 9:30AM

తల్లి అయిన తరువాత ఏ మహిళను కూడా దయచేసి  ఈ మాటలు అనకండి..!

తల్లి కావడం అనేది ప్రతి స్త్రీకి అత్యంత సంతోషకరమైన,  బాధాకరమైన అనుభూతి. వారి స్వంత జీవితాన్ని పక్కన పెడితే, మహిళలు కొత్తగా ఒక  చిన్న జీవితానికి ప్రాణం పోస్తారు. అటువంటి పరిస్థితిలో ప్రసవం తర్వాత వారి జీవనశైలి, దుస్తులు ధరించడం,  జీవనశైలి పూర్తిగా మారిపోతాయి. ఇలాంటి పరిస్థితిలో తల్లి అయిన మహిళలకు  కుటుంబ మద్దతు చాలా అవసరం అవుతుంది.   ప్రతి తల్లి తన బిడ్డ గురించి చాలా భావోద్వేగంగా,  సున్నితంగా ఆలోచిస్తుంది. కొంతమంది దీనిని అర్థం చేసుకోలేరు. దీని కారణంగా చాలా సార్లు ప్రజలు తెలియకుండానే తల్లుల భావాలను దెబ్బతీసే  మాటలు అంటుంటారు. బిడ్డకు జన్మనిచ్చిన స్త్రీ ముందు ఎవ్వరూ పొరపాటున కూడా మాట్లాడకూడని విషయాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. పిల్లవాడు ఏడుస్తున్నాడు, సరిగ్గా చూసుకో.. నీ బిడ్డ ఏడుస్తున్నాడు,  బిడ్డను సరిగ్గా చూసుకో అని ఎప్పుడూ తల్లికి చెప్పడం మంచిది కాదు.  రాత్రిపూట పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు  తరచుగా ఇలా అంటారు. ఇలా చెప్పడం సులువే.. తామేదో గొప్ప జాగ్రత్త చెప్పాం అనుకుంటారు. కానీ ఈ విషయం ఆ స్త్రీ యొక్క మాతృత్వ సామర్థ్యాన్ని నేరుగా దెబ్బతీస్తుంది. బిడ్డ ఏడుపుతో ఎక్కువగా బాధపడేది తల్లి. అటువంటి పరిస్థితిలో పిల్లవాడిని ఊరుకోబెట్టడంలో  ఆమెకు మద్దతు ఇవ్వాలి తప్ప  పొరపాటున కూడా ఆమెను విమర్శించకూడదు. నీకు పిల్లవాడిని చూసుకోవడం చేతకాదు.. పిల్లవాడిని స్నానం చేయించడం నుండి పిల్లాడిని రెడీ చేసి,  పాలిచ్చి నిద్రపుచ్చడం వరకు ప్రతి స్త్రీ చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా సార్లు స్త్రీలు చాలా కాలం తర్వాత కూడా బిడ్డను ఎలా చూసుకోవాలో అర్థం చేసుకోలేరు.  వార గందరగోళానికి గురవుతూ ఉంటారు.  ఇలాంటి  సమయంలో కుటుంబం వారికి మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి తల్లి నేర్చుకునే ప్రయాణం భిన్నంగా ఉంటుంది. ప్రతిదీ నేర్చుకోవడానికి సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో వారి సామర్థ్యాన్ని ప్రశ్నించే బదులు, వారికి మద్దతు ఇవ్వడం మంచిది. బిడ్డను ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకుని చెడగొడుతున్నావు.. తల్లి,  బిడ్డల మధ్య స్పర్శ బిడ్డకు బంధం ,  భద్రతకు ఒక మార్గం. ఇది ఏ రకమైన "చెడు అలవాటు" కాదు. కాబట్టి బిడ్డను ఎప్పుడూ  చేతుల్లోనే ఉంచుకోవద్దని తల్లికి ఎప్పుడూ చెప్పకండి. బిడ్డకు తల్లి ఒడిలో అత్యంత సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతుంది. ఈ మాత్రం దానికే అలసిపోతావా? తల్లి అయిన తర్వాత బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి స్త్రీకి పూర్తి సమయం ఉద్యోగంగా మారుతుంది.  అది ఆమె నిర్వర్తించాల్సిన విధి కూడా. చిన్న పిల్లలు రాత్రంతా ఏడుస్తారు, అలాంటి పరిస్థితిలో  తల్లులు  రాత్రి నిద్రపోలేరు. అలాంటి పరిస్థితిలో నువ్వు బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పడం, నువ్వు ఎందుకు అంత అలసిపోతావు అనడం చేయకూడదు.  అది వాళ్ళని చాలా బాధపెడుతుంది. ప్రారంభ రోజుల్లో, ప్రతి తల్లి తనకోసం అరగంట కూడా కేటాయించుకోలేకపోతుంది.                          *రూపశ్రీ.  
తల్లి అయిన తరువాత ఏ మహిళను కూడా దయచేసి  ఈ మాటలు అనకండి..! Publish Date: Jul 24, 2025 9:30AM

నా పేరు పవన్.. ఆడా ఈడా ఎక్కడైనా ఉంటా!

తాను ఏ ఊరు వెడితే ఆ ఊరే తనది అంటానంటూ తనను హేళన చేస్తున్న మాజీ మంత్రి రోజా వంటి వారికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీటుగా బదులిచ్చారు. తన పేరు పవన్ అని.. తాను సర్వాంతర్యామిననని..అన్ని చోట్లా తిరుగుతుంటానని చెప్పారు. పవన్ అంటే గాలి అని గాలి లేని చోటు ఎక్కడా ఉండదనీ అన్నారు. తాను నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తనకు ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదన్నారు. తన సినిమా చూడమని కానీ, తనకు ఓటు వేయమని అడగడం కానీ  రాదన్నారు.   రెండేళ్ల క్రితం విశాఖలో హోటల్ గదిలో నన్ను ప్రత్యర్ధుల అడ్డుకోవడానికి, అంతమొందించడానికి ప్రయత్నించారనీ, హోటల్ గదిలో బంధించి పోలీసులను మోహరించి తాను ఉంటున్న గది తలుపులను బూటు కాళ్లతో తన్నించారనీ గుర్తు చేశారు. ఆ సమయంలో తనకు అండగా మొత్తం విశాఖ నగరం నోవాటెల్ కు తరలి వచ్చిందన్నారు. ఆ అభిమానానికి గుర్తుగానే.. ఆ అభిమానానికి కృతజ్ణతగానే  విశాఖలో   హరిహర వీరమల్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశానన్నారు.  తన జీవితాన్ని విశాఖ నగరం మార్చిందనీ..  ఇంట్లో ఉన్న నన్ను ప్రయోజకుడిగా చేసేందుకు  అన్నయ్య చిరంజీవి వదిన నన్ను విశాఖ ఆ రోజు పంపించారని గుర్తు చేసుకున్నారు.   
నా పేరు పవన్.. ఆడా ఈడా ఎక్కడైనా ఉంటా! Publish Date: Jul 24, 2025 9:22AM

తొలి నుంచీ తేడానే..ఈ కొలికిపూడి

  చాలా మంది ఇతడొక అమరావతి ఉద్దారకుడని, టీడీపీ అనుంగు మిత్రుడనీ ఫీలవుతుంటారుగానీ.. అందులో ఎంత మాత్రం నిజం లేదా? ఆ మాటకొస్తే ఇతడు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డిని చెప్పుతో కొట్టిందే టీడీపీకి కొమ్ముకాస్తున్నావన్న మాటకు. కానీ ఇతడ్ని తప్పుగా అర్ధం చేసుకుని.. టికెట్ ఇచ్చి ఆదరించింది టీడీపీ. ఇప్పుడు చూస్తే ఇతడు తిరువూరులో పార్టీ, కేడర్ ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు. కొలికిపూడి గెలిచింది ఎమ్మెల్యేగా తొలిసారి. కానీ ఇతడి కేంద్రంగా వరుస వివాదాలు. ఒక పార్టీ లైన్ కి ఎలా కట్టుబడి ఉండాలి? ఆ మాటకొస్తే ఒక ఎమ్మెల్యేగా ఎలా బిహేవ్ చేయాలి? కేడర్ ఎందుకంత కీలకం? ఇవేవీ ఇతడికి తెలిసినట్టూ లేవు. తనకవి వర్తించనే వర్తించవన్న కోణంలోనూ బిహేవ్ చేస్తుంటాడు. తనకు నోరుంది, ఆపై సోషల్ మీడియా ఉందన్న చందంగా వైసీపీ ప్రోకామెంట్లు చేస్తుంటాడు. మొన్నటికి మొన్న ఒక రోడ్డు విషయంలో ఒక ఎస్టీ మహిళపై దాడి వ్యవహారం పార్టీకి చెడ్డ పేరు తెచ్చేదే. ఆపై వైన్ షాపుల విషయంలో గతానికి ప్రస్తుతానికి తేడా చెప్పి.. పార్టీని ఇరుకున పెట్టడం. ఆపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో హంగామా. క్రమశిక్షణా కమిటీ ముందుకు రావడంలోనూ బిల్డప్పు. ఇలా ఇతడి గురించి చెబుతూ పోతే మెరిట్స్ కన్నా, డీ మెరిట్స్ ఎక్కువ. అప్పటికీ చంద్రబాబు ఇవ్వాల్సిన వార్నింగులన్నీ ఇచ్చారు. కానీ ఎంత మాత్రం మార్పు వచ్చినట్టే కనిపించదు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సైతం ఎన్నో సూచనలు చేశారు. అయినా సరే అదే వితండ వాదన. ఆపై వర్ల రామయ్యతోనూ చెప్పించి చూశారు. ప్రయోజనం శూన్యం.  బేసిగ్గా తిరువూరు ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ వైసీపీకి పట్టు ఎక్కువ. దీంతో తాను టీడీపీలో ఉండటం కన్నా వైసీపీలోకి వెళ్లడం వల్లే ఎక్కువ లాభం అని అప్పుడే పెద్ద ఆరిందా లాగా లెక్కలేసుకుని.. ఇదిగో ఇవాళ పెద్దిరెడ్డిని వెళ్లి కలిశాడు. అటు టీడీపీలో అయితే ఇతడి తాకిడి తట్టుకోలేక స్థానిక టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పుడు వైసీపీలోకి వెళ్లేలా కనిపిస్తున్నాడు. అంటే అక్కడి వైసీపీ కేడర్ కూడా అష్టకష్టాలు పడ్డానికి ముందుగానే సిద్ధపడాలన్న మాట వినిపిస్తోంది. మరద్దే.. కొలికిపూడి మార్క్ కెలుకుడంటే అని మాట్లాడుకుటున్నారు ఇరు పార్టీ నేతలు.
తొలి నుంచీ తేడానే..ఈ కొలికిపూడి Publish Date: Jul 23, 2025 9:55PM

సీఐడీ సంజయ్‌కు ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు ఆశ్చర్యం!

  అగ్నిమాపక శాఖ డీజీగా పని చేసినప్పుడు చేసిన అవినీతి వ్యవహారంలో నమోదైన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ సీఐజీ చీఫ్ సంజయ్‌కు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును చూసి సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చాలా పేజీలున్న తీర్పును చూసి.. ముందస్తు బెయిల్ పై పిటిషన్ వేస్తే.. అసుల కేసు మొత్తం విచారణ జరిపినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో అవినీతికి పాల్పడినట్లుగా సాక్ష్యాలు అయిన ఇన్వాయిస్‌లు, ఒప్పంద పత్రాలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 30వ తేదీకి వాయిదా వేసింది. సంజయ్, ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్నప్పుడు, అగ్ని-ఎన్ఓసీ (AGNI-NOC) వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ అభివృద్ధి, హార్డ్‌వేర్ సరఫరా కోసం విజయవాడకు చెందిన సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ కోసం టెండర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, పోటీ ధరలు పొందకుండా, నిబంధనలను ఉల్లంఘించి కాంట్రాక్ట్ ఇచ్చారని కేసు నమోదు అయింది. 2023 ఫిబ్రవరి 22న, ఒప్పందం జరిగిన ఒక వారంలోనే సౌత్రిక టెక్నాలజీస్‌కు రూ. 59.93 లక్షలు చెల్లించారు. కానీ పనేమీ చేయలేదు. అగ్ని యాప్ అమలు కోసం ఫైర్ సర్వీసెస్ అధికారుల కోసం 8 మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 8 డివైస్‌లు, 2 ఆపిల్ ఐప్యాడ్ ప్రో డివైస్‌లను కొనుగోలు చేశారు. వీటిని కూడా అధిక ధరలకు సౌత్రిక టెక్నాలజీస్ నుండి కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్ల కోసం ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు ఆహ్వానించకపోవడం, పోటీ కొటేషన్లు పొందకపోవడం వంటి నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నివేదికలో పేర్కొన్నారు. అలాగే సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నప్పుడు అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సులు, వర్క్‌షాప్‌ల పేరుతో కృత్వ్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 1.19 కోట్లు చెల్లించారు. కానీ అసలు ఈ సంస్థ ఏ సదస్సులూ నిర్వహించలేదు. ఈ ఆరోపణలపై సంజయ్‌ను 2024 డిసెంబర్ 3న సస్పెండ్ చేసింది. అయితే సంజయ్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరైంది, కానీ ఈ కేసుపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాల్ చేసింది.
సీఐడీ సంజయ్‌కు ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు ఆశ్చర్యం! Publish Date: Jul 23, 2025 9:50PM

రప్పా.. రప్పా.. అంటే చూస్తూ కూర్చుంటామా?

  మాట్లాడితే.. రప్పా రప్పా అంటూ బెదిరిస్తున్నారు. వారి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరు కుంటామా? అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. తాము అనేక పోరాటాలు చేసి, ఉద్యమాలు నిర్మించి ఈ స్థాయికి వచ్చామని తెలిపారు. ప్రజలు తమను బలంగా అక్కున చేర్చుకున్నారని చెప్పారు. అలాంటి తమకు ఈ బెదిరింపులు ఒక లెక్కకాదని చెప్పారు. బెదిరింపు రాజకీయాలు చేసే వారికే గత పాలకులను ప్రజలు ఎక్కడ పెట్టారో ఇప్పుడు చూస్తున్నారన్నారు. తాజాగా మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడుతూ వైసీపీ హయాంలో లిక్కర్ కేసుపై స్పందించారు. 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో మద్యం నిషేధం చేస్తామని, విడతల వారీగా తగ్గిస్తామని చెప్పిన వారు విచ్చలవిడిగా ధరలు పెంచి ప్రజల సొమ్మును దోచుకున్నారని అన్నారు. “డబ్బు పోతే పోయింది. జనాలు కూడా చచ్చిపోయారే. నాసిరకం లిక్కర్‌ను అంటగట్టి లివర్‌, కిడ్నీ సమస్యలు వచ్చేలా చేసి చంపేశారే” అని పవన్ వ్యాఖ్యానించారు. మద్యం నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌ తరువాత ఏం చేశారని నిలదీశారు. “మద్యం కుంభకోణంలో అంతమందిని అరెస్టు చేశారు. ఇంత మందిని అరెస్టు చేశారు అని చెబుతున్నారు. తప్పులు చేశారు కాబట్టే వారిని అరెస్టు చేశారు” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్మును, వారి ఆరోగ్యాన్ని కూడా దోచుకుని పీల్చి పిప్పిచేసిన వారిని ఏమి చేయాలని ప్రశ్నించారు. పైగా నంగనాచి కబుర్లు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తప్పులు చేసి పైగా ఎదురు దాడి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ పేపర్ పులులకి, తాటాకు చప్పుళ్లకి కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదన్నారు. కేసు విచారణ ముమ్మరంగా సాగుతోందని పవన్ తెలిపారు. తప్పు చేసిన వారిని ఎవ్వరినీ వదిలేది లేదని హెచ్చరించారు.
రప్పా.. రప్పా.. అంటే చూస్తూ కూర్చుంటామా? Publish Date: Jul 23, 2025 9:42PM

ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే వస్తా : సీఎం రేవంత్

  ఫోన్ టాపింగ్ కేసులో నన్ను విచారణకు పిలిస్తే వస్తాని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టాపింగ్ జాబితాలో నా ఫోన్ నెంబర్ ఉందో లేదో తెలియదన్నారు. గత ప్రభుత్వం పెద్దలుసొంత కుటుంబ సభ్యులపై ఫోన్ టాపింగ్ చేశారు అంతకంటే ఆత్మహత్య చేసుకోవడం మేలని సీఎం స్పష్టం చేశారు.  బీసీ రిజర్వేషన్ల విషయంలో ఏ సమస్య వచ్చినా....స్థానిక సంస్థల ఎన్నికలు  ఆగే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి తెలిపారు.  ఫోన్ టాపింగ్ కాలేదని అనుకుంటున్నా. నా ఫోన్ టాపింగ్ అయి ఉంటే నన్ను పిలిచేవారు కదాని ఆయన పేర్కొన్నారు. ఫోన్ టాపింగ్ ఇల్లీగల్ కాదు.. కానీ లీగల్ గా పర్మిషన్ తీసుకుని చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కూడా విన్నారని అంటున్నారు సొంత కుటుంబ సభ్యులకు ఫోన్ లే టాపింగ్ చేసి వినాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకోవడం ఉత్తమని ముఖ్యమంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఫోన్ టాప్ అవుతుందని మొదట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడని  సీఎం రేవంత్ స్పష్టం చేశారు.  పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50 శాతం నిబంధన దాటిపోయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అడ్డురాని నిబంధనలు బీసీ రిజర్వేషన్లకు అడ్డు వస్తున్నాయా? అని ధ్వజమెత్తారు. కేంద్ర పదవుల్లోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీని తొలగించారని, ఇప్పటికే దత్తాత్రేయను గవర్నర్ పదవి నుంచి తొలగించారని ఆయన అన్నారు. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని సీఎం డిమాండ్ చేశారు.
ఫోన్ టాపింగ్ కేసులో  విచారణకు పిలిస్తే వస్తా : సీఎం రేవంత్ Publish Date: Jul 23, 2025 9:35PM

మోడీ షా జోడీ మ్యాజిక్ బాక్స్‌లో..ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరో?

  భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు (జూలై 21),నాటకీయ పరిణామాల నడుమ తమ పదవికి  రాజీనామా చేశారు. ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదించారు. జగదీప్ ధన్‌ఖడ్’ ఎందుకు రాజీనామా చేశారు? ఏమిటి, అనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతోంది.  ధన్‌ఖడ్ ఎందుకు రాజీనామా చేసినా, అందుకు కారాణాలు ఏవైనా, భారత ఉపరాష్ట్రపతి సీటు ఖాళీ అయింది. ఎన్నిక అనివార్యమైంది. మరోవంక భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. భారత ఎన్నికల సంఘం ఇప్పటికే 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహాలను ప్రారంభించిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ సన్నాహాక చర్యలు పూర్తయ్యాక, ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.  అదలా ఉంటే, చక చకా పరిణామాలు నేపధ్యంగా, అనూహ్యంగా తరుముకొస్తున్న  ఉపరాష్టపతి ఎన్నిక పట్ల, సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. నిజానకి అభ్యర్ధుల ఎంపిక మొదలు గెలుపు ఓటముల లెక్కల వరకు. ‘ఉప’ ఎన్నిక పట్ల రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ అప్పుడే మొదలైంది. అధికార ఎన్డీఎ, విపక్ష ఇండియా కూటమి తరపున బరిలో దిగే అభ్యర్ధులు ఎవరన్న విషయంలో,ముఖ్యంగా అధికార కూటమి అభ్యర్ధి ఎవరన్న విషయంగా అనేక వ్యూహగానాలు వినిపిస్తునాయి. అనేక పేర్లు వినిపిస్తున్నాయి. రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్,హరివంశ నారాయణ సింగ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్,,కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మొదలు కేంద్ర మాజే మంత్రి రవిశంకర్ ప్రసాద్ వరకు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’ మొదలు మెగా స్టార్’చిరంజీవి, బీజేపే రాజ్యసభ సభ్యడు కే. లక్ష్మణ్’ వరకు అనేక తెలుగు పేర్లు సహా చాలా పేర్లు వినిపిస్తునాయి.  అయితే,అంతిమంగా మోదీ షా జోడీ’ మ్యాజిక్ బాక్స్ నుంచి ఎవరి పేరు పై కొస్తుందో చెప్పలేము. అలాగే ఇండియా కూటమి నుంచి ఎవరు బరిలో దిగినా పోటీ నామమాత్రంగానే ఉంటుందని,అంటున్నారు. చివరకు,ఏ కూటమిలో లేని, వైసీపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేడీ, బీఎస్పీ వంటి తటస్థ పార్టీలు ఇండియా కూటమికి వైపు మొగ్గు చూపినా ఎన్డీఎ అభ్యర్ధి విజయం తధ్యమని అంటున్నారు. అయితే, బీజేపీ..ఒంటరిగా గెలిచే అవకాశం మాత్రం ఏ కొంచెం కూడా లేదు.  తెలుగుదేశం, జేడీయు సహా ఇతర ఎన్డీఎ పార్టీల మద్దతుతో మాత్రమే అధికార కూటమి అభ్యర్ధి విజయం  సాధ్యంవుతుందని ఓట్ల గణాంకాలు చెపుతున్నాయి ప్రస్తుత లెక్కల ప్రకారం,ఉపరాష్ట్రపతి ఎలెక్టోరల్ కాలేజీలో (నామినేటెడ్ సహా పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు) మొత్తం 788 ఓట్లున్నాయి. అందులో అందులో 5 రాజ్యసభ, ఒక లోక్ సభ, సిటు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 782 ఓట్లలో ఎన్డీఎకి 427 ఓట్లు,(293 లోక్ సభ. 134 రాజ్యసభ) ఓట్లున్నాయి. ఇండియా కూటమికి లోక్ సభలో 236, రాజ్యసభలో 87, మొత్తం కలిపి 323 ఓట్లున్నాయి.  అలాగే, ఉభయ సభల్లో కలిపి ఏ కూటమిలోనూ లేని తటస్థ సభ్యుల సఖ్య  సుమారు 30 వరకు ఉంటుంది. సో.. ఈ లెక్క తప్పకుండా ఎవరి ఓట్లు వారికి పోలైతే, ఎన్డీఎ కూటమి గెలుపు నల్లేరుపై బండి అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.  ఉపరాష్ట్రపతి ఎన్నిక రహస్య బ్యాలెట్ పద్దతిలో జరుగుతుంది.విప్ వర్తించదు. కాబట్టి,ఎంపీలు, ఆత్మ సాక్షిగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చును.అలాగే, పార్టీలకు  కూటమి కట్టుబాట్లు వర్తించవు.గత 2022 ఎన్నికల్లో, ఎన్డీఎ అభ్యర్ధి జగదీప్ ధన్‌ఖడ్’కు పోటీగా   ప్రతిపక్ష పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మార్గరెట్ అల్వాను బరిలో దించాయి. అయితే,ఆమె అభ్యర్ధిత్వంపై అభ్యంతరం చెప్పిన తృణమూల్  కాంగ్రెస్’ ఓటింగులో పాల్గొన లేదు. ఫలితంగా ధన్‌ఖడ్’ మొత్తం పోలైన 725 ఓట్లలో 528 ఓట్ల భారీమెజారిటీతో గెలిచారు. మార్గరెట్ ఆల్వా కేవలం 182 ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాగే ఈసారి కూడా, అభ్యర్ధి ఎంపిక తర్వాత లెక్కలు మారినా మారవచ్చును. అయితే, ఎన్డీఎలో కంటే ఇండియా కూటమిలోనే, కోతలకు ఎక్కువ అవకాశం ఉంది, కాబట్టి, ఎన్డీఎ గెలుపు నల్లేరుపై నడక అంటున్నారు.
మోడీ షా జోడీ మ్యాజిక్ బాక్స్‌లో..ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరో? Publish Date: Jul 23, 2025 9:16PM

విశాఖ నాలుగు ప్రతిష్టాత్మక సంస్థలు : సీఎం చంద్రబాబు

  విశాఖలో 4 కంపెనీల రూ.20వేల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా 50వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తు పెట్టుబడులు, అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని అధికారులకు ఆదేశించారు. ప్రతిష్ఠాత్మక సంస్థల రాకతో విశాఖ ఇమేజ్ పెరుగుతుందని మంత్రి నారా లోకేశ్‌ అభిప్రాయపడ్డారు.  ఇక ఏపీలో రూ.16,466 కోట్లతో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ సంస్థ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నంలో మొదటిదశలో ఆ సంస్థ రూ.1,466 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 200 మందికి ఉపాధి లభించనుంది. రెండో దశలో రూ.15వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 400 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.ఇక, విశాఖ మధురవాడలో సాత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ రూ.1,500కోట్ల పెట్టుబడులు పెడుతుండగా.. 25,000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండాడ (విశాఖ)లో రూ.1,250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.దీంతో మొత్తంగా విశాఖలో 15,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి  
విశాఖ నాలుగు ప్రతిష్టాత్మక సంస్థలు : సీఎం చంద్రబాబు Publish Date: Jul 23, 2025 8:56PM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పీఎ అరెస్ట్

  కుత్భుల్లాపుర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పీఎ హరిబాబును  అరెస్ట్ చేశామని జీడిమెట్ల పోలీసులు తెలిపారు. డబుల్  రూమ్​ ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి రూ. లక్షలు వసూల్ చేశాడని బాధితుల ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు.  హరిబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.  కుత్బుల్లాపూర్​ గిరినగర్ కు చెందిన తైలం రమేశ్​డబుల్​బెడ్​ రూమ్ ఇంటి​ కోసం ఎమ్మెల్యే ఆఫీస్​కు వెళ్లాడు. పీఏ హరిబాబు అతనికి  ఇల్లు ఇప్పిస్తానని నమ్మంచి, రూ.లక్ష తీసుకున్నాడు. తర్వాత మరోసారి ఎమ్మెల్యే ఆఫీస్​కు వెళ్లగా హరిబాబు మరో 83 మంది వద్ద రూ.లక్ష చొప్పున వసూలు చేసి, ఆ డబ్బులతో భూమిరెడ్డి నగర్ లో ఇంటిని నిర్మించుకున్నట్లు తెలిసింది. డబ్బుల గురించి అడగడానికి రమేశ్ ​ప్రయత్నించినా అతను స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి, ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.  బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో కుత్బుల్లాపూర్ ​నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకానంద, ఆయన అనుచరులు చేసిన అవినీతి, అక్రమాలపై  ప్రభుత్వం ఎంక్వైరీ జరిపించాలని బీజేపీ జిల్లా స్పోక్స్ పర్సన్ నల్లా జయశంకర్​డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ప్రభుత్వ భూముల కబ్జా, చెరువుల ఆక్రమణలు, దొంగ రిజిస్ట్రేషన్లు, డబుల్ బెడ్​రూమ్​ ఇండ్ల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేశారని వారు ఆరోపించారు.   
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పీఎ అరెస్ట్ Publish Date: Jul 23, 2025 7:17PM

బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వితండవాదం : సీఎం రేవంత్

    తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వందేళ్లుగా వాయిదాపడ్డ కులగణనను నెలరోజుల్లో పూర్తి చేశామన్నారు.  స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కోసం తీర్మానాలు చేసి కేంద్రానికి పంపినా జాప్యం జరుగుతోందని సీఎం పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వితండవాదం చేస్తోందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని సీఎం తెలిపారు.  మీరు ఇచ్చిన హామీని మీరు అమలు చేసుకోవాలని బీజేపీ వాళ్లు అంటున్నారని ఇది వితండవాదం కాక మరేంటని సీఎం రేవంత్ ప్రశ్నించారు. హర్యానా మాజీ గవర్నర్  బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలని కేంద్రానికి రేవంత్‌రెడ్డి  సూచించారు. ఆయనకు ఆ పదవి కట్టబడితే బీసీలందికీ న్యాయం చేసినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు వారికి సరైన గౌరవం దక్కుతుందని తెలిపారు. తాను ఇండియా కూటమి తరపున మాట్లాడటం లేదని.. తెలంగాణ ప్రజల తరఫున తన అభిప్రాయాన్ని చెప్పానని అన్నారు.  బండారు దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే.. తాను ఇండియా కూటమితో మాట్లాడుతా సీఎం రేవంత్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే‌తోపాటు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమై.. కుల గణన, రిజర్వేషన్లపై చర్చిస్తామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం రాహుల్‌ గాంధీ ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు  
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వితండవాదం : సీఎం రేవంత్ Publish Date: Jul 23, 2025 6:48PM

పెద్దిరెడ్డితో చేతులు కలిపిన ఎమ్మెల్యే కొలికపూడి

  వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే  కొలికపూడి శ్రీనివాసరావు కలవడం చర్చనీయాంశంగా మారింది. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో పెద్దిరెడ్డిని కలిసి వీరిద్దరు మంతనాలు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కొలికపూడి శాసన సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి వివాదాలను కేంద్ర బిందువుగా మారరని దీంతో ఆయన తీరుపై తెలుగు దేశం పార్టీ గుర్రుగా ఉంది.  టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేతను కలవడంపై సర్వత్రా చర్చ నడుస్తుంది. పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్‌లో కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు కొట్టుకోగా.. సెటిల్‌మెంట్ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ వర్గపు వ్యక్తిని వదిలేసి, తన అనుచరుడిపై కేసు పెట్టారని పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పోలీసులే ఒక బ్యాచ్‌ను పెట్టుకొని గంజాయి అమ్మిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్‌లో షాకింగ్ కామెంట్స్ చేశారు. 
పెద్దిరెడ్డితో చేతులు కలిపిన ఎమ్మెల్యే  కొలికపూడి Publish Date: Jul 23, 2025 5:11PM

రాజాసింగ్‌ ఒక్క మిస్డ్‌కాల్‌ చాలు..పార్టీలో చేరినట్లే : అరవింద్

  తెలంగాణ బీజేపీలో వివాదాలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రాజాభాయ్ ఎక్కడున్నా రెస్పెక్ట్ ఉంటుందని ఆయన గౌరవిస్తాము అని తెలిపారు. ఆయనను బీజేపీ బహిష్కరించలేదు. ఆయనకు ఏదో నచ్చక రాజీనామా చేశాడని అరవింద్ తెలిపారు. రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇచ్చి మెంబర్షిప్ తీసుకొచ్చు. కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజా భాయ్ రాజీనామా చేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో చెప్పుకొచ్చారు.  తటస్థంగా ఉండేవాళ్ళతో కమిటీ వేసి విచారిస్తే బావుండేదని ఆయన పేర్కొన్నారు. రామచందర్ రావు.. కిషన్ రెడ్డి తదితరులు తప్పుడు నివేదికలు ఇస్తున్నట్లుగా పరోక్షంగా అరవింద్ విమర్శలు చేశారు. కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి, కొండా సురేఖలు ఏం చేస్తున్నారని పార్టీ అన్నాక వివాదాలు కామన్ అని అన్నారు. బీజేపీ, పాత, కొత్త అధ్యక్షులు కలిసి ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల విషయంలో కూర్చొని మాట్లాడాలి అని సూచించారు.  తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని ఎంపీ కోరారు 
రాజాసింగ్‌ ఒక్క మిస్డ్‌కాల్‌ చాలు..పార్టీలో చేరినట్లే : అరవింద్ Publish Date: Jul 23, 2025 4:43PM

ధ‌ర్మ‌స్థ‌ల మిస్ట‌రీ మ‌ర్డ‌ర్స్

క‌ర్ణాట‌క‌లోని ధ‌ర్మ‌స్థ‌ల అంటే తెలియ‌ని వారుండ‌రు. కార‌ణం ఈ ప్రాంతంల‌తోని మంజునాథుడికి అంత‌టి విశేష‌మైన పేరు ప్ర‌ఖ్యాత‌లున్నాయి. ఒక‌ ర‌కంగా  చెప్పాలంటే ఇది క‌ర్ణాట‌క తిరుమ‌ల‌గా ప్రఖ్యాతి చెందింది. ఇక్క‌డ ఎప్ప‌టి నుంచో హెగ్డేల కుటుంబం వంశ‌పారంప‌ర్య ధ‌ర్మ‌క‌ర్త‌లుగా ఉంటూ వ‌స్తున్నారు. వీరి అధ్వ‌ర్యంలో ఇక్క‌డ   ధ‌ర్మం  నాలుగు పాదాలా నడుస్తుందన్న విశ్వాసం జనంలో మెండుగా ఉంది. అలాంటి ధ‌ర్మ‌స్థ‌లలో 1995 నుంచి 2014 మ‌ధ్య అనుమానాస్ప‌దంగా కొంద‌రు మ‌హిళ‌లు, యువ‌తుల‌ మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌నీ,  అవి కూడా హింస‌, లైంగిక వేధింపుల‌కు సంబంధించిన‌వేననీ ఇక్క‌డ ప‌ని చేసిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు గ‌త జూలై 3న ఫిర్యాదు చేశాడు.  అంతే కాదు తాను గ‌తంలో పాతి  పెట్టిన ఒక మృత‌దేహం ఆన‌వాళ్లు సైతం తీసి ఆధారాలు చూపించాడు. దీంతో ఈ కేసు ఇటు ధ‌ర్మ‌స్థ‌ల పారంప‌ర్య ధ‌ర్మ‌క‌ర్త‌లైన హెగ్డే కుటుంబం నుంచి..  అటు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం వ‌ర‌కూ హ‌డ‌లెత్తేలా చేస్తోంది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జ‌డ్జి గోపాల గౌడ క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య‌ను క‌ల‌సి  ఈ కేసు ద‌ర్యాప్తు ముమ్మ‌రం  చేయాల‌ని కోరారు.  క‌ర్ణాట‌క మ‌హిళా క‌మిష‌న్ సైతం సీఎంకి ఈ కేసులో దోషులెవ‌రున్నా వదలకుండా శిక్షించాలని డిమాండ్  చేసింది. అంతే కాదు గ‌తంలో అంటే 2003లో క‌నిపించ‌కుండా  పోయిన అన‌న్య భ‌ట్ కేసు, 2012లో అనుమానాస్ప‌దంగా మృతి చెందిన సౌజ‌న్య కేసు.. ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. అంతే కాదు తన ఇంట్లోని ఒక మైన‌ర్ బాలిక‌పై ఇలాంటి లైంగిక వేధింపులు ఎదురు కావ‌డంతో తాను 2014 లో ఇక్క‌డి నుంచి పారిపోయాన‌నీ అంటాడీ మాజీ స‌ఫాయి కార్మికుడు.  ఆ మాట‌కొస్తే.. తన చేతుల మీదుగా ఎన్నో మృత‌దేహాల‌కు ఖ‌న‌నం, ద‌హ‌నం నిర్వ‌హించాన‌ని అంటాడీయ‌న‌. దీంతో మంగ‌ళూరు పోలీసులు జూలై 4న కేసు న‌మోదు చేశారు. అంతే ఫిర్యాదు చేసిన కార్మికులు  స్థానిక బెళ్తంగ‌డి  న్యాయ‌స్థానం ముందు హాజ‌రై వాంగ్మూలం కూడా ఇచ్చాడు.  2010లో స్కూల్ డ్రెస్సులోని బాలిక మృత‌దేహాన్ని కూడా ఇలాగే ఖ‌న‌నం చేసిన‌ట్టు చెప్పాడు. మృత‌దేహాలు వెంట‌నే కుళ్లిపోయేలా  నేత్రావ‌తి న‌ది ముందే పూడ్చిపెట్టిన‌ట్టు కూడా చెప్పాడు.  ఇత‌డిచ్చిన వివ‌రాల ఆధారంగా ఒక యూట్యూబ‌ర్ ఒక సంచ‌ల‌న క‌థ‌నం వెలువ‌రించాడు. ఈ వీడియోని 50 ల‌క్ష‌ల మందికి పైగా చూడడంతో ఈ ధ‌ర్మ‌స్థ‌ళ మ‌ర‌ణాల మిస్ట‌రీ మ‌రింత‌గా వెలుగులోకి వ‌చ్చింది. అంతే కాదు ఈ కథనాన్ని వెలువరించిన యూట్యూబర్ పై కేసు కూడా నమోదైంది.  అయితే ఈ మ‌ర‌ణాల వెన‌కున్న నిందితుల‌ను తామేమీ కాపాడ్డం లేద‌ని.. సాక్షి చెప్పిన వివ‌రాలు త‌మ‌ను షాక్ కి గురి చేశాయ‌ని.. ఒక వేళ ఇదే నిజ‌మైతే ఈ మిస్ట‌రీ మ‌ర‌ణాల వెన‌క ఎవ‌రున్నా స‌రే వ‌ద‌ల‌క శిక్షిస్తామ‌ని..  క‌ర్ణాట‌క ఆరోగ్య మంత్రి గుండూరావు పేర్కొన్నారు.  అయితే ధ‌ర్మ‌స్థ‌లలో చీమ చిటుక్కుమ‌న్నా రాజ్య స‌భ ఎంపీ కూడా అయిన వీరేంద్ర హెగ్డేకి తెలిసే జ‌రుగుతుంది. మ‌రి ఆయ‌న ఒక ఎంపీగా ఉండి కూడా ఈ మిస్టరీ మరణాల విషయంలో  ముమ్మ‌ర ద‌ర్యాప్తు జ‌ర‌గాల‌ని పార్ల‌మెంటులో ఎందుకు నిన‌దించ‌డం లేదన్న‌దిప్పుడు స‌స్పెన్స్ గా మారింది. మ‌రి ఈ కేసు ఏ మ‌లుపు తీసుకుంటుందో తేలాల్సి ఉంది. ఎంతో మ‌హిమాన్వితుడైన ఆ మంజునాథుడు ఇప్పుడే ఈ కేసును ఎందుకు వెలికి తీశాడో కూడా తేలాల్సి ఉంది. కాగా ఈ మర్డర్ల మిస్టరీని ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది.
ధ‌ర్మ‌స్థ‌ల మిస్ట‌రీ మ‌ర్డ‌ర్స్ Publish Date: Jul 23, 2025 4:24PM