ట్రంప్, హిల్లరీ మధ్య తొలి డిబేట్.. వాడివేడి చర్చ

 

డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లు అమెరికా అధ్యక్షబరిలో ఉన్న సంగతి తెలిసిందే. మామూలుగానే.. వీరిద్దరి మధ్య మాటల యుద్దం జరుగుతుంది. అలాంటిది ఏకంగా ఒకే వేదికపై.. ఇద్దరికీ డిబెట్ పెడితే ఇంకెలా ఉంటుంది. న్యూయార్క్ లోని  హోఫ్‌స్ట్రా యూనివర్సిటీ హాల్‌లో ఇద్దరి మధ్య మొట్టమొదటిసారిగా ముఖాముఖిగా తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ ప్రారంభమైంది. ఈ డిబేట్ లో ఒకరిమీద ఒకరు విమర్శనాస్త్రాలు విసురుకుంటున్నారు. ఈ సందర్భంగా హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ..  ఉద్యోగాల కల్పనకు దేశంలో ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. దృఢమైన, స్థిరమైన అభివృద్ధే తన లక్ష్యమని.. నిర్మాణరంగం, టెక్నాలజీ, ఇన్నోవేషన్ తదితర రంగాల్లో ఉద్యోగ వృద్ధి సాధించామన్నారు. తాను అధికారంలోకి వస్తే కార్పొరెట్ లొసుగులు తొలగిస్తానని హామీ ఇచ్చారు. సంపన్నులకు పన్ను తగ్గింపులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఐసిస్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు వివరించారు. సామాన్యులు, మధ్య తరగతి వారికి కూడా లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చారు.

 

ఇక డొనాల్డ్ ట్రంప్ ఎప్పటిలాగే తనదైన శైలిలో ఇతర దేశాలపైనా.. హిల్లరీపైన విరుచుకుపడ్డాడు. మెక్సికో, ఇండియా వంటి దేశాలు అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడుతున్నాయన్నారు. కంపెనీలకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాల్సిన అవసరముందని, అప్పుడే కొత్త సంస్థలు వస్తాయని అభిప్రాయపడ్డారు. హిల్లరీకి ఎలాంటి ప్రణాళిక లేదని తూర్పారబట్టారు. గత 30 ఏళ్లలో హిల్లరీ ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్‌పైనా పోరాటం చేయలేకపోయారని విమర్శించారు. ఉద్యోగాలు ఉద్యోగాలను వెనక్కి తీసుకురాగలిగే సామర్థ్యం తనకు ఉందని, హిల్లరీకి లేదని తేల్చి చెప్పారు.