Top Stories

ఢిల్లీ సీఎంను చంపేస్తామంటూ బెదిరింపులు

  ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తామంటూ గుర్తు తెలియని  దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. యూపీలోని ఘజియాబాద్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. ఆమెకు మరింత భద్రతను పెంచారు. కాల్‌ చేసిన దుండగుడు వెంటనే ఫోన్ స్విచ్చాఫ్‌ చేశాడని ఘజియాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ వెల్లడించారు. ఫోన్‌ కాల్‌ వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు, ముఖ్యమంత్రి భద్రతాధికారులకు చేరవేసినట్లు తెలిపారు. సంబంధిత సిమ్‌ కార్డు ఓ మహిళ పేరిట ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  నకిలీ ధ్రువపత్రాలతో ఆ సిమ్‌ కార్డు కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ బెదిరింపు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా భద్రతా వలయాన్ని పటిష్టం చేయడంతో, ఆమె బహిరంగ కార్యక్రమాలు, ప్రజలతో సమావేశాలపై ఈ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ సీఎం తరుచుగా ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. 2019లో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ ఆటోరిక్షా డ్రైవర్ చెంపదెబ్బ కొట్టారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేదనే కోపంతో ఆ వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. అంతకుముందు, 2016లో ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో కేజ్రీవాల్‌పై కొందరు నల్ల సిరా చల్లారు.
ఢిల్లీ సీఎంను చంపేస్తామంటూ  బెదిరింపులు Publish Date: Jun 6, 2025 9:16PM

చెవిరెడ్డి కూటమి ప్రభుత్వం ఉందని గుర్తెరిగి మసలుకో..పులివర్తి హెచ్చరిక

  తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ప్రస్తుత  ఎమ్మెల్యే పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిని చెవిరెడ్డి ఆపలేరు అని సవాల్ విసిరారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందని  గుర్తెరిగి మసలుకోవాలని చెవిరెడ్డిని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గం పరువు తీస్తున్నారని ఇకనైనా తన పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే కాక ముందు మీ ఆస్తి ఏంత శాసన సభ్యుడు అయిన తర్వాత మీ ఆస్తి అన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పగలరా అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు చేర్చిన అక్రమ కేసు త్వరలో మీకు చుట్టుకుంటుంది అని జోష్యం చెప్పారు.  మీ దగ్గర ఉన్న గన్ మెన్ కు కోట్ల రూపాయల సంపాదన ఎలా వచ్చాయి అని ప్రశ్నించారు. తుడాను అడ్డుపెట్టుకుని కేవీస్ అనే పేరుతో.. మీ కుటుంబ సభ్యుల బినామీ కంపెనీలతో డబ్బులను దోచుకో లేదా అని ప్రశ్నించారు. హెల్త్ క్యాంపు, మొక్కల పంపిణీ పేరుతో కోట్ల రూపాయలు దోచుకోలేదా అని నిలదీశారు. వాట్సాప్ కాల్స్ తో ప్రభుత్వ అధికారులను చెవిరెడ్డి బెదిరిస్తున్నారు అని ఆరోపించారు. మా ప్రభుత్వంలో ఏ ఐఏఎస్, ఐపిఎస్ లు అధికారులు మీ వైసీపీ నాయకులకు భయపడరు అని చెప్పారు. కసిరెడ్డికి నీకు సంబంధం లేదని నువ్వు చెప్పగలవా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో మూడు కంటైనర్ లలో మీ డబ్బు ఎనిమిది కోట్లు దొరికింది నిజం కాదా అని నిలదీశారు. తుమ్మలగుంట అభివృద్ధికి మేము ఎంత చేసామో ప్రజలకు తెలుసు అని అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నీ వాటా కూడా త్వరలో సీట్ తెలుస్తుంది అని నాని హెచ్చరించారు.   
చెవిరెడ్డి కూటమి ప్రభుత్వం ఉందని గుర్తెరిగి మసలుకో..పులివర్తి హెచ్చరిక Publish Date: Jun 6, 2025 8:20PM

బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ కీలక మావోయిస్టు మృతి

  ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌లో చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో  మరో కీలక నేత మైలార‌పు ఆడెల్లు అలియాస్ భాస్కర్‌ మృతి చెందారు. అతని తలపై రూ.25 లక్షల రివార్డు ఉందని తెలిపాయి. ఘటనాస్థలి నుంచి ఏకే-47, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, కోబ్రా బలగాలు పాల్గొన్నాయి. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్‌ కొనసాగుతోంది.  బీజాపూర్‌ జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత లక్ష్మీనర్సింహాచలం అలియాస్‌ గౌతమ్‌ అలియాస్‌ సుధాకర్‌ అలియాస్‌ బండి ప్రకాశ్‌ మరణించిన విషయం తెలిసిందే.  బీజాపూర్‌ జిల్లాలోని నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు జిల్లా రిజర్వ్‌ గార్డ్స్‌(డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌) భద్రతా దళాలు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఆడెల్లు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామం. భాస్కర్ కేంద్ర కమిటీతోపాటు రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా పని చేస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర కమిటీ స్థాయికి భాస్కర్ ఎదిగారు.ఈ ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనా స్థలంలో ఏకే 47తోపాటు పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.   
బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ కీలక మావోయిస్టు మృతి Publish Date: Jun 6, 2025 7:05PM

అది బీఆర్‌ఎస్ పార్టీ కాదు.. దెయ్యాల పార్టీ : సీఎం రేవంత్‌

  బీఆర్‌ఎస్ పార్టీలో దెయ్యాలు  ఉన్నాయని ఆ పార్టీ నేతలే విమర్శస్తుంటే మాజీ సీఎం కేసీఆర్  నోరు విప్పలేని స్ధితిలో ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి  ఎద్దేవా చేశారు. అది బీఆర్‌ఎస్ కాదని దెయ్యాల రాజ్య సమితి అని రేవంత్ సైటెర్ల వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. గంధమల్ల రిజర్వాయర్‌కు ముఖ్యమంత్రి శంకు స్థాపన చేశారు.  అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్, యాదగిరిగుట్ట మెడికల్ కాలేజ్, వేద పాఠశాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కొలనుపాక-కాల్వపల్లి హైలెవెల్ వంతెన, మోటకొండూరులో ఎంపీపీ, మండలాఫీసు, పోలీస్ స్టేషన్ భవనాలకు కూడా శంకు స్థాపన చేశారు. వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శంగా మారుస్తామని చెప్పి ఇళ్లు కులగొట్టి. సొంత ఫామ్‌హూస్‌కు వెళ్లేందుకు ఎర్రవళ్లికి రోడ్డు వేసుకున్నారని సీఎం ఆరోపించారు. ఈ కార్యక్రమంలో  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు 
అది బీఆర్‌ఎస్ పార్టీ కాదు.. దెయ్యాల పార్టీ : సీఎం రేవంత్‌ Publish Date: Jun 6, 2025 6:31PM

8 జిల్లాలతో విశాఖ ఎకనమిక్ రీజియన్..లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు : చంద్రబాబు

  వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.  ఇవాళ అమరావతిలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయాలు ప్రకటించారు. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏఎస్ఆర్, మన్యం జిల్లాల్ని రీజియన్‌ను అభివద్ది చేయాలన్నారు. వివిధ ప్రాజేక్టుల కోసం లక్ష ఎకరాలను గుర్తించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మూలపేట-విశాఖపట్నం, విశాఖపట్నం-కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు.  వీటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామన్నారు. సముద్ర తీరం సంపద నిలయమని, దానిని మరింత వినియోగించుకునేలా చూడాలని సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద 20 లక్షల మందికి అవకాశం కల్పించాలని ప్రయత్నిస్తున్నట్లు సీఎం తెలిపారు.2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి లక్ష్యంతో విశాఖ ఎకనమిక్ రీజియన్'ను రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా తీర్చిదిద్దాలని అధికారుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు ఉత్తరాంధ్రను కూడా అదే స్ధాయిలో అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది.    
8 జిల్లాలతో విశాఖ ఎకనమిక్ రీజియన్..లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు : చంద్రబాబు Publish Date: Jun 6, 2025 5:23PM

మాగంటిని పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు..ఆరోగ్యం ఎలా ఉందంటే?

  గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పరామర్శించారు. మాగంటి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి నిన్నటి కంటే బెటర్‌గా ఉందని పేర్కొన్నారు. ఆయన తనకు సన్నిహితుడని, త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిన్న సాయంత్రం ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే  కుటుంబ సభ్యులు  ఏఐజీకి తరలించారు. కార్డియాక్‌ అరెస్టుకు గురైనట్లు డాక్టర్లు తెలిపారు. సీపీఆర్‌ చేయడంతో తిరిగి గుండె కోట్టుకోవడం, నాడి, బీపీ సాధారణ స్థితికి రావడంతో... ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. 48 గంటల తర్వాత ఆయన ఆరోగ్యంపై బులెటిన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.   కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్‌ చేయించుకున్నరు. మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌... మాగంటి హెల్త్‌పై ఆరా తీశారు. గోపీనాథ్‌ కుటుంబ సభ్యులతో, ఏఐజీ ఆస్పత్రి వైద్య బృందంతో ఫోన్‌లో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని డాక్టర్లు కేటీఆర్‌కు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికా పర్యటన కుదించుకొని   కేటీఆర్‌ హైదరాబాద్‌ బయలుదేరుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌ రావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి ఏఐజీ హాస్పిటల్‌కు చేరుకున్నారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును కలిశారు. వైద్యులతో మాట్లాడి గోపీనాథ్‌ ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  
మాగంటిని పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు..ఆరోగ్యం ఎలా ఉందంటే? Publish Date: Jun 6, 2025 4:49PM

కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఎందుకంటే?

  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు. కాగా, ఈ వ్యవహారంలో అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పరువు నష్టం కింద కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు.  కాగా తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాల్సిందిగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేయగా.. తీర్పు కేటీఆర్‌కు అనుకూలంగా ఇచ్చింది న్యాయస్థానం. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుగుణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వివరణ ఇవ్వాలంటూ కేటీఆర్‌కు నేడు దేశంలోని అత్యున్నత ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ ధర్మాసనం.. పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.
కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఎందుకంటే? Publish Date: Jun 6, 2025 4:44PM

పోలీసు కస్టీడీకీ మాజీ మంత్రి.. కాకాణికి ఇప్పట్లో బెయిల్ కష్టమేనా?

క్వార్జ్ట్ అక్రమ తవ్వకాల కేసులో నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఇప్పట్లో బెయిల్ లభించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో కాకాణిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జైలులోనే కాకాణికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మాజీ మంత్రిని కస్టడీలోకి తీసుకుంటున్న నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకాణిని జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. అక్రమ క్వార్జ్ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో మరింత సమాచారం తెలుసుకునేందుకు కాకాణిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా నెల్లూరు కోర్టులో పోలీసులు పిటిషన్‌ వేశారు. దీంతో కాకాణిని మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కోర్టు షరతు విధించింది. క్వార్జ్ట్ అక్రమాలపై కేసు నమోదు అయిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు పోలీసులకు చిక్కకుక్కుండా కాకాణి తప్పించుకుని తిరిగారు. ఈ క్రమంలో ఇటీవల బెంగళూరు శివారులో మాజీ మంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే విచారణ సమయంలో కూడా పోలీసులకు ఏమాత్రం సహకరించలేదు కాకాణి. ఈ కేసులో సాక్షులు చెప్పిన విషయాలను కాకాణి ముందు ఉంచి ప్రశ్నించినప్పటికీ తనకు తెలియదు, సంబంధం లేదు అంటూ సమాధానాలు ఇస్తూ   విచారణకు సహకరించలేదు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు కాకాణి పోలీస్ కస్టడీలో ఉండబోతున్నారు. కాకాణి తరలించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జైలు ప్రాంగణంతో పాటు కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు సెంట్రల్ జైలు వద్దకు భారీగా వైసీపీ నేతలు పోలీసు కస్టీడీకీ మాజీ మంత్రి .. కాకాణికి ఇప్పట్లో బెయిల్ కష్టమేనా? క్వార్జ్ట్ అక్రమాల తవ్వకాల కేసులో నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఇప్పట్లో బెయిల్ లభించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో కాకాణిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జైలులోనే కాకాణికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మాజీ మంత్రిని కస్టడీలోకి తీసుకుంటున్న నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకాణిని జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. అక్రమ క్వార్జ్ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో మరింత సమాచారం తెలుసుకునేందుకు కాకాణిని కస్టడీలోకి ఇవ్వాల్సిందిగా నెల్లూరు కోర్టులో పోలీసులు పిటిషన్‌ వేశారు. దీంతో కాకాణిని మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కోర్టు షరతు విధించింది. క్వార్జ్ట్ అక్రమాలపై కేసు నమోదు అయిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు పోలీసులకు చిక్కకుక్కుండా కాకాణి తప్పించుకుని తిరిగారు. ఈ క్రమంలో ఇటీవల బెంగళూరు శివారులో మాజీ మంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే విచారణ సమయంలో కూడా పోలీసులకు ఏమాత్రం సహకరించలేదు కాకాణి. ఈ కేసులో సాక్షులు చెప్పిన విషయాలను కాకాణి ముందు ఉంచి ప్రశ్నించినప్పటికీ తనకు తెలియదు, సంబంధం లేదు అంటూ సమాధానాలు ఇస్తూ పోలీసుల విచారణకు సహకరించలేదు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు కాకాణి పోలీస్ కస్టడీలో ఉండబోతున్నారు. కాకాణి తరలించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జైలు ప్రాంగణంతో పాటు కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు సెంట్రల్ జైలు వద్దకు భారీగా వైసీపీ నేతలు చేరుకున్నారు. దాదాపు 61వేల మెట్రిక్ టన్నుల క్వార్జ్‌ను ఆరు నెలల వ్యవధిలోనే తవ్వకాలు జరిపి ఇతర దేశాలకు తరలించారు. ఈ క్రమంలో క్వార్జ్‌ను తీసుకుని వెళ్లడంలో ఎవరెవరి పాత్ర ఉంది అనే అంశాలపై కాకాణిని పోలీసులు ప్రశ్నించనున్నారు. చేరుకున్నారు. దాదాపు 61వేల మెట్రిక్ టన్నుల క్వార్జ్‌ను ఆరు నెలల వ్యవధిలోనే తవ్వకాలు జరిపి ఇతర దేశాలకు తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో క్వార్జ్‌ను తరలించడంలో ఎవరెవరి పాత్ర ఉంది అనే అంశాలపై కాకాణిని పోలీసులు ప్రశ్నించనున్నారు.
పోలీసు కస్టీడీకీ మాజీ మంత్రి.. కాకాణికి ఇప్పట్లో బెయిల్ కష్టమేనా? Publish Date: Jun 6, 2025 4:40PM

ముద్రగడ పద్మనాభంకు క్యాన్సర్? కుమార్తె క్రాంతి సంచలన ట్వీట్

కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు గతంలో  మంచి ప్రాధాన్యత ఉండేది.  కాపులకు రిజర్వేషన్ అంటూ ఆయన చేసిన ఉదమ్యాలు, ఉత్తర కంచి సంఘటనలతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడ తిరుగులేని నేతగా నిలిచారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం ఆయ‌న ఉద్య‌మించిన స‌మ‌యంలో ల‌క్ష‌లాదిగా యువత ఆయ‌న వెంట న‌డిచారు. అయితే ఆ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాపు సామాజిక వర్గం ఆయనను తమ నాయకుడిగా అంగీకరించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం  2019 ఎన్నికలకు ముందు    కాపు  రిజర్వేష‌న్లకు సుముఖంగా ఉన్న చంద్ర‌బాబును కాదని.. ఆ ప్ర‌తిపాద‌న‌కు నో చెప్పిన జ‌గ‌న్ కు ముద్ర‌గ‌డ‌ మద్దతు ఇచ్చారు. ఇక  2019 ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జగన్  కాపు రిజర్వేషన్లు అయ్యే పని కాదని కుండబద్దలు కొట్టేసి, అంతకు ముందు చంద్రబాబు సర్కార్ ప్రతిపాదనలను పక్కన పెట్టేశారు. దీంతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడపై వ్యతిరేకత వెల్లువెత్తింది.   2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్టాలు చేపట్టిన తరువాత కాపు లకు 5శాతం కోటాను రద్దు చేశారు. అప్పుడు కూడా జగన్ ను విమర్శిస్తూ ముద్రగడ నోటి వెంట ఒక్కటంటే ఒక్క మాట రాలేదు. అంతే కాదు జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ముద్రగడ నోటి వెంట కాపు రిజర్వేషన్ ఉద్యమం గురించి మరిచిపోయారు.  కాపు రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టేయడంతో సరిపెట్టుకోకుండా ముద్రగడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గుడ్డి వ్యతిరేకత పెంచుకున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి తాను తప్ప మరో నాయకుడు ఉండకూడదన్న దుగ్థ, అసూయ కారణంగానే ముద్రగడ పవన్ ను వ్యతిరేకించారని కాపు సామాజికవర్గం నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ కారణంగానే పవన్ పై ఇష్టారీతిగా విమర్శలు గుప్పించిన ముద్రగడ సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ముద్రగడ నిర్ణయాన్ని ఆమె కుమార్తె క్రాంతి కూడా సమర్ధించలేకపోయారు. బహిరంగంగా ఆమె  పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు.  2024 ఎన్నిలకల తరువాత జనసేన గూటికి చేరారు. అది పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే.. ముద్రగడ ఆరోగ్యం బాలేదు. ఈ విషయాన్ని ఆయనే రెండు రోజుల కిందట ఓ లేఖ ద్వారా వెల్లడించారు. రెండు రోజుల కిందట వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరిట నిరసనలు చేపట్టింది. అయితే ఆ కార్యక్రమంలో ముద్రగడ పాల్గొన లేదు. కానీ ఓ లేఖ విడుదల చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా తాను బయటకు రాలేకపోతున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. దాంతో ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న చర్చ మొదలైంది. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్స్ బయటకు రాలేదు. దీంతో ఆయన అభిమానుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమైంది. ఈ తరుణంలో ఆయన కుమార్తె క్రాంతి తన తండ్రి క్యాన్సర్ తో బాధపడుతున్నారని వెల్లడించారు. అంతే కాదు.. తన సొంత సోదరుడు ముద్రగడ గిరి ఆయనకు   వైద్యం అందకుండా చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.  తన తండ్రి, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం క్యాన్సర్‌తో  బాధపడుతున్నారనీ, అయితే తన సోదరుడు  ముద్రగిరి ఆయనకు కనీసం వైద్యం అందించకుండా వేధిస్తున్నారనీ,  ఆయన ఎవరినీ కలవకుండా, ఆయనను ఎవరూ చూడకుండా అడ్డు పడుతున్నారనీ ముద్రగడ కుమార్తె క్రాంతి సంచలన ట్వీట్ చేశారు. తన తండ్రిని చూసేందుకు కూడా తనను అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ముద్రగడను నిర్బంధించి, చికిత్స కూడా అందకుండా చేస్తున్నారని, కనీసం కుటుంబ సభ్యులు, సన్నిహితులకు కూడా సమాచారం ఇవ్వడం లేదని క్రాంతి ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.  ఇటీవల ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యేతో కలిసి తన తండ్రిని చూడడానికి వెడితే.. తన సోదరుడు గిరి, అతడి మావ తనను అనుమతించలేదని ఆరోపించారు. 
ముద్రగడ పద్మనాభంకు క్యాన్సర్? కుమార్తె క్రాంతి సంచలన ట్వీట్ Publish Date: Jun 6, 2025 3:21PM

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెనను ప్రారంభించిన ప్రధాని

  ప్రపంచంలోనే ఎత్తయిన చినాబ్‌ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ  ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అదేవిధంగా కట్రాలో రూ.46 వేల కోట్లతో విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో ప్రారంభోత్సవాలు చేశారు. కశ్మీర్‌ను దేశంలో ఇతర ప్రాంతాలకు కలుపుతూ రైల్వే లింక్ పూర్తిచేయడం చరిత్రాత్మకమని ప్రధాని తెలిపారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు పూర్తివడం సంతోషకరమని ప్రధాని తెలిపారు. లక్షల మంది కల నెరవేరిందని ప్రధాని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించుకున్నామని పేర్కొన్నారు. ఈరోజు చారిత్రాత్మక రోజు అని అన్నారు. ఇక కశ్మీర్ కూడా భారత్ రైల్వే నెట్‌వర్క్‌లో చేరిందని తెలిపారు. మాతా వైష్ణోదేవి ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యం అయిందని అన్నారు.  చీనాబ్ వంతెన అత్యద్భుతంగా నిర్మించామని తెలిపారు. రూ.46 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించామని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని.. కశ్మీర్  నుంచి కన్యాకుమారికి కనెక్టివిటీ ఎట్టకేలకు లభించిందని అన్నారు. చీనాబ్ బ్రిడ్జి పర్యటలకు ఫెవరెట్ స్పాట్ౠగా మారబోతోందని ప్రధాని పేర్కొన్నారు. ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఈ వంతెన నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చీనాబ్‌ నదిపై 1,315 మీడర్ల పొడవైన వంతెనను నిర్మించారు. చైనాలోని బెయిసాన్‌ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్‌ రైల్వే వంతెన పేరుపై ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ఇక పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం. 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి ఆమోదం తెలుపగా.. పూర్తి కావడానికి 22 ఏండ్లు పట్టింది.  
ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెనను ప్రారంభించిన ప్రధాని Publish Date: Jun 6, 2025 3:20PM

క్రికెట్.. సమ్ టైమ్స్ క్రై కెట్!

ఇప్ప‌టి  వ‌ర‌కూ అత్య‌ధిక గెలుపులంటే అవి ఆస్ట్రేలియావే. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌ర‌ల్డ్ క్రికెట్ ని ఈ దేశం శాసించినంత‌గా మ‌రే దేశం శాసించ‌లేదు. తొలి రోజుల్లో వెస్టిండీస్ ఇలాగే ఉన్నా.. త‌ర్వాతి కాలంలో ఆస్ట్రేలియా ఈ విజ‌య ప‌రంప‌ర అందిపుచ్చుకుంది. అంత‌గా వారు క్రికెట్ లో గెలుపు రుచి చూశారు.  అత్య‌ధిక వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్పులు కొల్ల‌గొట్టిన వీరు ఎప్పుడూ ఏడ‌వ‌లేదు. పై పెచ్చు.. క‌మిన్స్ నాయ‌క‌త్వంలో గెలిచిన‌ గ‌త వ‌ర‌ల్డ్ క‌ప్పును త‌మ కాలి కింద వేసుకుని.. వ‌ర‌ల్డ్ క్రికెట్ మా పాదాక్రాంతం అన్న సంకేతాల‌నిచ్చారుగానీ ఎప్పుడూ ఎడ‌వ‌లేదు. అపురూప‌మైన విజ‌యాలు ఎదురైన‌పుడు ఏడ్చిన వారు చాలా చాలా త‌క్కువ‌. గ‌తంలో శ్రీలంక మీద వేగ‌వంత‌మైన శ‌త‌కంతో సెహ్వాగ్ సంతోషం వ్య‌క్తం చేశాడుగానీ ఏడ‌వ‌లేదు.   ఈడెన్ టెస్టులో హ్యాట్రిక్ వికెట్ తీసిన‌పుడు.. హ‌ర్బ‌జ‌న్ ఏడ‌వ‌లేదు ఎంజాయ్ చేశాడు. ఇదే మ్యాచ్ లో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ అపూర్వ‌మైన 287 ప‌రుగులు చేసిన‌పుడు కూడా ఏడ‌వ‌లేదు. ఆనందంతో సెలబ్రేష‌న్  చేసుకున్నాడు. వెస్ట్ ఇండీస్ మీద 329 ప‌రుగుల టార్గెట్ చేసిన రాహుల్ ద్రావిడ్ చివ‌రి బంతికి బౌండ‌రీ కొడ‌తార‌ని ఊహించారు కానీ సింగిల్ తీసి కేవ‌లం బ్యాట్ పైకెత్తి గెలుపు ఆనందాన్ని వ్య‌క్తం చేశాడంతే. లార్డ్స్ లో గంగూలీ ష‌ర్ట్ విప్పి గాల్లో తిప్ప‌డం ద్వారా ఇండియా విజయాన్ని కాస్త ఎమోష‌న‌ల్ చేశాడు. అంతే త‌ప్ప ఏడ‌వ‌లేదు. అయితే ఇది భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఒక మ‌ర‌పురాని మైలురాయిలాంటి విజ‌యం. ఇక్క‌డి నుంచి భార‌త్ మ‌రింత ప‌టిష్ట‌ప‌డుతూ వ‌చ్చింద‌ని అంటారు.  ధోనీ సార‌ధ్యంలో రెండు ప్ర‌పంచ క‌ప్పులు గెలిచిన‌పుడు కూడా ఏడ‌వ‌లేదు. ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేశాడు. అస‌లు ధోని గెలిచిన‌పుడే కాదు ఓడిన‌పుడు కూడా ఏమంత భావోద్వేగానికి గురి కాడు. ఐపీఎల్లో ఎన్నో సార్లు అవ‌లీల‌గా ట్రోఫీలు ఎత్తాడు. అంతే స్థాయిలో ఈ సారి త‌న జ‌ట్టు ప‌రాజ‌యం పాలైనా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. గేమ్స్ లో గెలుపోట‌ములు కామ‌న్ అన్న‌ది ధోని మార్క్ సార‌ధ్యం. స‌చిన్ కి అదే చివ‌రి టోర్న‌మెంట్ అయిన‌పుడు ఎవ‌రూ ఏడు మొహం పెట్ట‌లేదు. ఆ ఛాయ‌లు త‌న మొహంలోనూ క‌నిపించ‌లేదు. బ్యాటుకీ బాలుకీ పిచ్ కీ స‌చిన్ కి అంత‌టి అనుబంధం. కానీ వాటిని వ‌దులుతున్నపుడు ఎలాంటి ఏడుపులు పెడ‌బొబ్బ‌లు పెట్ట‌లేద‌త‌ను. మొన్న‌టి ఛాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచిన‌పుడు ఫైన‌ల్స్ లో సిరాజ్ ఏడ‌వలేదు. కానీ, భార‌త్ గెలిచిన‌పుడు అత‌డు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడ‌న్న‌ది తెలీదు.  ఇదే ఐపీఎల్ లో వైభ‌వ్ సూర్య‌వంశీ సైతం త‌న ఫ‌స్ట్ మ్యాచ్ లో త‌క్కువ స్కోర్ మాత్ర‌మే చేసిన‌పుడు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. ఎందుక‌లా అయ్యాడంటే అత‌డు చిన్న‌పిల్లాడు కాబ‌ట్టి అది స‌హ‌జం క‌దా అనుకున్నారంతా. ఆ మాట‌కొస్తే గ‌తంలో వినోద్ కాంబ్లీ శ్రీలంక‌తో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ లో ఔట్ అయిన‌పుడు కూడా ఇలాగే భావోద్వేగానికి గుర‌య్యాడు. లేటెస్టుగా ఐపీఎల్ ఫైన‌ల్ చివ‌రి ఓవర్  నుంచే విరాట్ ఏడుపు మొహం పెట్టుకుని క‌నిపించాడు. ఏడుపు వ‌స్తోంద‌ని సైగ చేశాడు. గెలుపు ముందు క్ష‌ణాలు అంటే చివ‌రి ఓవ‌ర్ రెండో బంతి నుంచి ఏడ‌వ‌డం మొద‌లు పెట్టాడు. ఆట‌ల్లో గెలిచిన‌పుడు ఆనందించాలిగానీ ఈ ఏడుపులేంటి? ఇవే ఒక్కోసారి విషాదాంతాల‌కు దారి తీస్తాయ‌న‌డానికిదో నిద‌ర్శ‌నంగా విశ్లేసిస్తున్నారు కొంద‌రు క్రికెట్ ఎన‌లిస్టులు
క్రికెట్.. సమ్ టైమ్స్ క్రై కెట్! Publish Date: Jun 6, 2025 3:09PM

హైదరాబాద్‌లో హైడ్రా నాలుగు నెలలు స్పెషల్‌ డ్రైవ్‌

  హైదరాబాద్ నగరంలో రాబోయే 4 నెలలు స్పెషల్‌ డ్రైవ్‌ చేపడతామని  హైడ్రా కమీషనర్  రంగనాథ్ తెలిపారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన కమర్షియల్ భవనలను తొలిగిస్తామని కమీషన్ తెలిపారు. పేదల నిర్మాణాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రంగనాథ్ తెలిపారు. ముఖ్యంగా నగరంలో వరదనీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. నాలా, నీటి వనరుల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.. ఈ అధ్యయనం ద్వారా సమస్య మూలాలను కనుగొని, శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.రసూల్‌పురా నాలాపై అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని రంగనాథ్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ పరిధిలో బేగంపేట, ప్యాట్నీలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.  
హైదరాబాద్‌లో హైడ్రా నాలుగు నెలలు స్పెషల్‌ డ్రైవ్‌ Publish Date: Jun 6, 2025 2:51PM

ట్రంప్, మస్క్ మధ్య ఎక్కడ చెడింది?

విరాళాలిచ్చి మరీ ట్రంప్ ని గెలిపించిన మస్క్ రివర్స్ కు కారణమేంటి? ఇన్నాళ్లూ కలసి మెలసి అలాయ్ బలాయ్ అన్న ఈ బాబాయ్- అబ్బాయ్ ఇప్పుడు సడెన్ గా ఎందుకు విడిపోయినట్టు? ట్రంప్ కీ మస్క్ కి ఎక్కడ చెడినట్టు? విరాళాలిచ్చి మరీ ట్రంప్ ని గెలిపించిన ఎలాన్ మస్క్  ఇప్పుడు  బిగ్ బిల్ విషయంలో ఇంత వ్యతిరేకత ఎందుకు వ్యక్తం చేస్తున్నాడు?  ఇదీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి మెదళ్లనూ తొలుస్తున్న ప్రశ్న. దీనిపైనే ప్రపంచదేశాలలో సామాన్యుల నుంచి అధికారుల వరకూ, దేశాధినేతల నుంచి మేథావుల వరకూ జోరుగా సాగుతున్న చర్చ. ట్రంప్ మీద మస్క్ వరుస విమర్శనాస్త్రాలను గురి పెడుతున్నారు. మొన్న బిగ్ బిల్ ని పంది మాంసంతో పోల్చిన మస్క్.. ఇప్పుడు మరో బాంబు పేల్చారు.. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్‌రీ ఎప్ స్టైన్ తో ట్రంప్ నకు సంబంధాలున్నాయని.. కొత్త అప్ డేట్ ని ట్రంప్ వ్యతిరేకుల చేతికి ఇచ్చారు.  ఏంటీ ఎప్ స్టైన్ స్కామ్ అన్నది అలా ఉంచితే.. మస్క్ ఏంటి ట్రంప్ కి ఇలా రివర్స్ తిరిగాడన్నది చర్చనీయాంశంగా మారిందిప్పుడు. నిజానికి ఎలాన్ మస్క్ 2024 ఎన్నికల్లో ట్రంప్ కోసం ఏకంగా 288 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చి మరీ ప్రోత్సహించారు. ఇది భారత కరెన్సీ ప్రకారం చెబితే ఏకంగా పాతిక వందల కోట్ల రూపాయలు. ఇందుకు మస్క్ కి మిగిలింది.. టెస్లా కార్ల షోరూములు ధ్వంసం కావడం, తన కంపెనీ షేర్ ధరలు అమాంతం 50 శాతం పడిపోవడం. ఆయన సంపద 100 బిలియన్ డాలర్లకు తగ్గడం. ఇవన్నీ ఒకెత్తైతే.. ఆయనకు వచ్చిన చెప్పపేరు మరో ఎత్తు.    తన స్నేహితుడు ఐజాక్ మాన్ ను నాసా చీఫ్‌ గా ప్రకటిస్తానని మాటిచ్చిన ట్రంప్ మాట మార్చడంతో.. ఇటు గోడ దెబ్బ అటు చెంపదెబ్బగా మారింది మస్క్ పరిస్థితి. ఒక వేళ బిగ్ బిల్ గానీ అమల్లోకి వస్తే టెస్లా ఈవీల కొనుగోలు దారులకు ఇచ్చే మినహాయింపులు కట్ చేల్సి వస్తుంది. దీని ద్వారా.. మరో 1. 2 బిలియన్ డాలర్ల నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక పక్క తాను డోజ్ సలహాదారుగా ఉండి తీసుకున్న నిర్ణయాలు కూడా బెడిసికొట్టాయి. ట్రంప్ పాలనా పరమైన లోపాలన్నిటికీ మస్కే  కారణం అన్న చెడ్డ పేరు అమెరికన్లలోకి భారీగా వెళ్లిపోయింది. దీంతో స్పేస్ ఎక్స్, టెస్లా వంటి తన కంపెనీల ప్రభ మసకబారడం మొదలైంది.   దీన్నిబట్టీ చూస్తే అంతరిక్షంలోకి మనిషిని పంపి యాజ్ ఇటీజ్ నేలకు దించినంత ఈజీ కాదు రాజకీయాలంటే! అని మస్క్ కి తెలిసి వచ్చింది .  కార్లు తయారు చేసి జనం మెప్పు పొందినంత ఈజీ కాదు రాజకీయాల్లో రాణించడం అంటే!అన్న తత్వం మస్క్ కి బెధపడింది.   బేసిగ్గా ఇలాంటి వ్యాపారులు రాజకీయాల్లోకి వచ్చేదే తమ వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని. ఇందుకు రివర్స్ అయితే ఈ రాజకీయాలెందుకు? వాటికి ఇంత భారీ ఎత్తున విరాళాలు ఇవ్వడమెందుకు? ట్రంప్ కోసం తన గుడ్ విల్ ని, వ్యాపార సామ్రాజ్యన్నీ ఫణంగా పెట్టినందుకు మస్క్ కు మిగిలిందేమిటంటే పూడ్చుకోలేనంత నష్టం.   దీంతో తండ్రి ఎరోన్ మస్క్.. తన కొడుకు ఎలాన్ మస్క్ సలహా ఇచ్చారు. అర్జెంటు గా ఆ ట్రంప్ సహవాసం వీడి.. భారత్ కి రా.. ఇక్కడి ఆలయాలను సందర్శించు. మనశ్శాంతిని పొందు! అని ససలహా ఇచ్చారట. ఇదిలా ఉంటే మస్క్ కూడా భారత్ కి రావల్సి ఉంది. కానీ ఎందుకో వాయిదా పడింది. కారణం.. టెస్లా కార్ల తయారీకి ఇక్కడ అవకాశం లేక పోవడం. కేవలం అమ్మకాలతో సరిపెట్టుకోవల్సి రావడం ఒక కారణం కాగా.. మరొకటి ఇక్కడ అధికార గణంతో ఎక్స్ కంటెంట్ మోడరనేషన్ విషయంలో చిన్న పాటి సమస్యలు తలెత్తాయి. దీంతో మస్క్ భారత్ ట్రిప్ ఆగింది. ప్రస్తుతం మస్క్ న్యూరాలింక్ అనే కొత్త ప్రాజక్ట్ లో ఉన్నారు.. దీన్నిబట్టీ చూస్తే వెన్నుముక విరిగిపోయిన వారికి కొత్త జీవితం ప్రసాదించడం, కంటి చూపు పోయిన వారిని చూడగలిగేలా చేయడం అనే మిషన్లో బిజి బిజిగా ఉన్నారు మస్క్.  ఇలాంటి తన బిజినెస్ ఐడియాలు పొలిటిక్స్ లో వాడ్డం కుదరదని భావించి.. మొదట డోజ్ నుంచి బయటకొచ్చారు మస్క్. తర్వాత ట్రంప్ తీసుకుంటున్న బిగ్ బిల్ వంటి నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఎప్ స్టైన్ కి ట్రంప్ కి ఉన్న లింకులు బయట పెట్టి.. నేను ట్రంప్ కి డెడ్ యాంటీ అనే సిగ్నళ్లు పాస్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాల వెనక తాను లేను. తద్వారా నన్ను ఆడిపోసుకోకండి. నేను కూడా మీలాగా ట్రంప్ బాధితుడ్నే.. అని ఆయన జనాలకు క్లియర్ కట్  మెసేజ్ ఇస్తున్నట్టు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మస్క్ ఇంత భారీ ఎత్తున విరాళాలిచ్చి మరీ.. రాజకీయాల్లోకి రావడం వెనక ఒక ఉద్దేశముందని అంటారు. తాను కూడా ఒకనాటికి ట్రంప్ లా అధ్యక్షా! అనిపించుకోవాలని ఆశ. కానీ, విచిత్రమైన విషయమేంటంటే ఆదిలోనే హంసపాదు అన్నట్టు.. మస్క్ కి వరుస దెబ్బలు తగలడంతో.. ఇదిగో ఇలా రివర్స్ గేర్ వేస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు అమెరికన్ ఎనలిస్టులు.
ట్రంప్, మస్క్ మధ్య ఎక్కడ చెడింది? Publish Date: Jun 6, 2025 2:49PM

ఆర్సీబీ బిజినెస్ హెడ్ అరెస్టు.. బెంగళూరు సీపీ సస్పెన్షన్

ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనపై సిద్దరామయ్య సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి  బెంగళూరు పోలీస్ కమిషనర్‌పై కర్ణాటక ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. సీపీ దయానంద్‌తో పాటు ఏసీపీ, డీసీపీలను కూడా సస్పెండ్ చేసింది. అలాగే కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, స్టేషన్ హౌస్ మాస్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఇన్‌ఛార్జ్లపై సైతం సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే  ఆర్సీబీ ప్రతినిధులను తక్షణమే అరెస్ట్ చేయాలని సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తునకు  రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక ప్యానెల్‌ను నియమించారు. ఈ ప్యానెల్ విచారణ జరిపి నెల రోజులలోగా నివేదిక అందించాలని ఆదేశించారు. అాలాగే తొక్కిసలాట  ఘటనపై సీఐడీ దర్యాప్తునకు సీఎం ఆదేశించారు.ఈ ఘటనకు సంబంధించి  ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోలే సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలకు సంబంధించి ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్  నిఖిల్ సొసలే అనధికారిక ప్రమోషన్స్ చేశారని, అనుమతి లేకుండా పరేడ్ నిర్వహించారన్న ఆరోపణలు ఉన్నాయి.   
ఆర్సీబీ బిజినెస్ హెడ్ అరెస్టు.. బెంగళూరు సీపీ సస్పెన్షన్ Publish Date: Jun 6, 2025 2:29PM

కరోనా కలకలం.. దేశంలో పెరుగుతున్న కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.  గత 24 గంటల్లో 489 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5,364కు చేరుకుంది. ఇలా ఉండగా కరోనా కారణంగా గత 24 గంటల్లో నలుగురు మరణించారు. కేరళలో ఇద్దరు, పంజాబ్ ,కర్ణాటకలో ఒక్కొక్కరు చొప్పున కరోనా కాటుకు బలయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 55కు చేరుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే నిన్న ఒక్క రోజే కొత్తగా 11 మందికి కరోనా సోకింది. ఏపీ, తెలంగాణ లోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో ఒకే రోజు మరో 11 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.  నెల్లూరులో గురువారం (జూన్ 5) ఒక్కరోజే నలుగురికి,  విశాఖ కేజీహెచ్‌లో మరో కేసు నమోదయింది. నెల్లూరు జీజీహెచ్‌లో బుధవారం ఆరుగురికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. వారిలో గురువారం నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 62కు చేరింది. ఇక  తెలంగాణలో 2 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో   యాక్టివ్ కేసుల సంఖ్య 5కు పెరిగింది. 
కరోనా కలకలం.. దేశంలో పెరుగుతున్న కేసులు Publish Date: Jun 6, 2025 12:56PM

కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ

  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను మళ్లీ తగ్గించింది. ఆర్డీఐ వడ్డీ రేట్లను తగ్గించడం వరుసగా ఇది మూడో సారి ఈ రోజు ముగిసిన ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించింది. గతంలో పాతిక బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ ఈ సారి 50 బేసిస్ పాయిట్లను తగ్గించింది. ఈ తాజా తగ్గింపుతో రెపో రేటు 6 నుంచి 5.50 శాతానికి దిగివచ్చింది. ఈ తగ్గింపు వల్ల గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయి. ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియాకు తెలిపారు. ఈ సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను 3.7 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.  మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం ఈ రోజు ముగిసింది.  
కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ Publish Date: Jun 6, 2025 12:35PM

మెగా డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు ఆల్ ది బెస్ట్

ఏపీలో లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఉత్కంఘగా  ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2025 పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేర‌కు "AP DSC 2025 ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు శుభాకాంక్షలు!" అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.  ఇక‌, ఈ రోజు (జూన్ 6, 2025) ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ నెల 30 తేదీ వరకు కొనసాగుతాయి. ఈ మెగా డీఎస్సీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 137, ఇతర రాష్ట్రాల్లో 17  మొత్తం 154 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజూ రెండు షిఫ్టులలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం షిఫ్టు 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్టు 2:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని నారా లోకేష్ తన యువగళం పాదయాత్ర సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ తరువాత తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డీఎస్సీ  ఫైలు మీదే తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే. 
మెగా డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు ఆల్ ది బెస్ట్ Publish Date: Jun 6, 2025 12:27PM

అంగరంగ వైభవంగా అఖిల్ జనాబ్ వివాహం

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అక్కినేనిఅఖిల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.  శుక్రవారం (జూన్ 6) తెల్లవారు జామున మూడు గంటలకు అఖిల్ జనాబ్ మెడలో తాళి కట్టారు. ఈ వివాహ వేడుకకు  మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్  సహా  టాలీవుడ్ తారలంతా కదిలి వచ్చారు.   గురువారం (జూన్ 5) రాత్రి నుంచే వివాహ వేడుకలు ఆరంభమయ్యాయి.  వెకేషన్ లో ఉన్న అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, శోభిత దంపతులు కూడా వెకేషన్ ను ముగించుకుని వివాహానికి హాజరయ్యారు. ఇక ఆదివారం (జూన్ 8)న అఖిల్ జనాబ్ ల పెళ్లి రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్, బాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ హాజరౌతారని తెలుస్తోంది. అలాగే పలువురు రాజకీయనాయకులు, పారిశ్రామిక వేత్తలూ కూడా ఈ రిసెప్షన్ కు హాజరయ్యే అవకాశం ఉంది.  ఆదివారం (జూన్ 8) వివాహ రిసెప్షన్ ను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు అక్కినేని ఫ్యామిలీ తెలిపింది.  
అంగరంగ వైభవంగా అఖిల్ జనాబ్ వివాహం Publish Date: Jun 6, 2025 11:18AM

కాళేశ్వరం కమిషన్ ఎదుటకు ఈటల

కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం (జూన్ 6) హాజరు కానున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు  ఆర్థిక, విధాన నిర్ణయాలు, బ్యాంకు గ్యారంటీల విడుదల, అంచనాల పెంపుపైనా కమిషన్ ఈటలను ప్రశ్నించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి సీఎం కేసీఆర్​ కేబినెట్​లో ఈటల రాజేందర్​ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రాజెక్టుకు నిధుల విడుదల, ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి మండలి తీసుకున్న ఆర్థిక, విధానపరమైన నిర్ణయాలపై ఆయనను కమిషన్​ ప్రశ్నించనుంది.   ఇక మాజీ మంత్రి హరీష్ రావు  సోమవారం (జూన్ 9) కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కమిషన్ ఎదుట ఈ నెల 11న హాజరు కానున్నారు. వాస్తవానికి కేసీఆర్ ఈ  నెల5నే విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన విజ్ణప్తి మేరకు కమిషన్ విచారణకు 11కు వాయిదా వేసింది.   అసలు కేసీఆర్, ఈటల, హరీష్ రావులను విచారించకుండానే కమిషన్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని ముందుగా భావించినప్పటికీ  ఆ తరువాత వీరిని కూడా విచారించాలని నిర్ణయం తీసుకుంది.  విచారణలో భాగంగా ఇప్పటికే 109 మంది రిటైర్డ్​ ఈఎన్​సీలు, ఇంజనీర్లు, అధికారులు, పలువురు ప్రైవేట్​ వ్యక్తుల నుంచి స్టేట్​మెంట్లను తీసుకున్న కమిషన్, వారి స్టేట్ మెంట్ల ఆధారంగా  తుది నివేదికను ఇప్పటికే సిద్ధం చేసింది.  ఇప్పుడు కేసీఆర్​, హరీశ్​ రావు, ఈటల రాజేందర్​ వాంగ్మూలాలనూ నమోదు చేయాలని కమిషన్ వారికి నోటీసులు పంపింది. 
కాళేశ్వరం కమిషన్  ఎదుటకు ఈటల Publish Date: Jun 6, 2025 11:05AM

వైసీపీ నిరసనలు తుస్సు.. పార్టీ భవిష్యత్ పై క్యాడర్ లో ఆందోళన!?

వైసీపీ ప్రభుత్వ  అరాచక పాలన, ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలను కూటమి సర్కార్ వ్యూహా త్మకంగా ప్రజలలో ప్రచారం చేస్తున్నది. జగన్ దుష్టపాలనను జనం మరచిపోయే అవకాశం లేకుండా వాటి ప్రభావంతో రాష్ట్రం ఏ విధంగా దెబ్బతింది. ప్రజా ప్రయోజనాలకు ఎలా భంగం వాటిల్లింది వంటి విషయాలను ప్రజలకు వివరిస్తూ.. ముందుకు సాగుతోంది. ముఖ్యంగా జగన్ నవరత్నాలు అంటూ అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలలో మరీ ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలలో ఇప్పటికీ ఒకింత సానుకూలత ఉందన్న అంచనాల నేపథ్యంలో  ఆ సానుకూలతను రూపుమాపి, అంటే జగన్ సంక్షేమ పథకాలను జనం మరిచిపోయేలా మరింత సంక్షేమం, దానితో పాటే అభివృద్ధి, ఆ అభివృద్ధి ఫలాలు జనానికి అందేలా జాగ్రత్తలు తీసుకుంటూ కూటమి సర్కార్ అడుగులు వేస్తున్నది. అదే సమయంలో సంక్షేమ పథకాల పేరిట జగన్ జనానికి చేసిన దగాను సమర్థవంతంగా, ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తున్నది.    ముఖ్యంగా రేషన్ పంపిణీ విషయంలో జగన్ ఇంటింటికీ రేషన్ అంటూ వాహనాల ద్వారా రేషన్ సరఫరా అనే కార్యక్రమాన్ని జగన్ అప్పట్లో చేపట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ అంటూ వాహనాలను రద్దు చేసింది.  ఈ విషయంలో తొలుత ఒకింత వ్యతిరేకత వ్యక్తమైనట్లు కనిపించినా.. ఒకటి రెండు రోజులలోనూ ఆ వ్యతిరేకత మటుమాయమైంది. అంత పకడ్బందీగా దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు జగన్ హయాంలో ఇంటింటికీ రేషన్ అన్నది ఒక మాయావస్త్రంగా మారిందనీ, వాహనం ఇంటి ముందుకు వచ్చి రేషన్ పంపిణీ చేసిన దాఖలాలు లేవనీ, ఎక్కడో    కూడలిలో రేషన్ పంపిణీ వాహనం అందితే అక్కడకు పరుగులు పెట్టాల్సి వచ్చేదని లబ్ధిదారులు బాహాటంగా చెబుతున్నారు. దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ వల్ల తాము తాపీగా వెళ్లి తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడిందని అంటున్నారు.  ఇక పరామర్శల పేర జగన్ రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ లకు మద్దతుగా నిలుస్తున్నారన్న విషయాన్ని ప్రజలకు వివరించడంలో కూడా కూటమి సర్కార్ విజయం సాధించిందనే చెప్పాలి. ముఖ్యంగా తెనాలి ఐతానగర్ సంఘటనలో జగన్ పరామర్శ బూమరాంగ్ అయ్యింది. దళిత సంఘాలలో జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపించింది. పోలీసులు బహిరంగంగా ఐతానగర్ లో రౌడీషీటర్లకు ఇచ్చిన ట్రీట్ మెంట్ ను జనం హర్షించారు. అటువంటి రౌడీ షీటర్లకు జగన్ అండగా నిలవడమేంటన్న ఆగ్రహం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అలాగే జనవరి 4 వెన్నుపోటు దినం అంటూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చి.. జగన్ బెంగళూరు ప్యాలెస్ లో కూర్చోడాన్ని వైసీపీ క్యాడరే జీర్ణించుకోలేకపోతోంది. అధినాయకుడు నిరసనలలో పాల్గొననప్పుడు తాము మాత్రం ఎందుకు అన్నట్లుగా చాలా ప్రాంతాలలో వెన్నపోటు దినం నిరసనలకు వైసీపీ క్యాడర్ దూరంగా ఉంది. దీంతో వైసీపీ నేతలు ఆ నిరసన కార్యక్రమాన్ని మమ అనిపించేశారు. ఆ కారణంగా అవి జనానికి పట్టని నిరసనలుగా మిగిలిపోయాయి. అదే సమయంలో కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేనలు నిర్వహించిన సంబరాలు ఆర్భాటంగా, ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. జనం కూడా ఆ వేడుకలలో స్వచ్ఛందంగా పాలుపంచుకున్న పరిస్థితి కనిపించింది.  దీంతో రాష్ట్రంలో వైసీపీ భవిష్యత్ పై ఆ పార్టీ వర్గాలలోనే ఆందోళన వ్యక్తం అవుతోంది. 
వైసీపీ నిరసనలు తుస్సు.. పార్టీ భవిష్యత్ పై క్యాడర్ లో ఆందోళన!? Publish Date: Jun 6, 2025 10:00AM

నానబెట్టిన ఖర్జూరం తింటే కలిగే లాభాలేంటో తెలుసా?

ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ లో ఒక  భాగం. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి.  ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస సమయంలో  ఖర్జూరం తినడం తోనే ఆ రోజు ఉపవాసాన్ని విరమిస్తారు. పోషకాలు పుష్కలంగా ఉండే ఖర్జూరాలు ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తాయి.  ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన 2 ఖర్జూరాలు తింటూ ఉంటే కలిగే మ్యాజిక్ ఫలితాలేంటో తెలుసుకుంటే తప్పకుండా ప్రతిరోజూ ఖర్జూరాలు తినడం మొదలుపెడతారు.. ఫైబర్.. నానబెట్టిన ఖర్జూరంలో అధికమొత్తంలో ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణవ్యవస్థను బలంగా మారుస్తుంది.  జీవక్రియను మెరుగుపరుస్తుంది.  మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.  పేగు  ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎనర్జీ.. నానబెట్టిన ఖర్జూరాలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరానికి గొప్ప శక్తి అందుతుంది.  ఇది రోజును ఉత్సాహంగా ప్రారంభించేందుకు తోడ్పడుతుంది. రోజంతా చురుగ్గా ఉండాల్సి న వ్యక్తులు నానబెట్టిన ఖర్జూరం తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. స్కిన్.. చర్మం ఆరోగ్యం మీద దృష్టి ఉన్నవారు నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా అవసరం.  ఎందుకంటే నానబెట్టిన ఖర్జూరం చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.  ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె.. ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.   ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.  అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తింటే చాలా మంచిది. ఎముకలు.. ఖర్జూరంలో ఐరన్, కాల్షియం,  విటమిన్లు మంచి మొత్తంలో ఉంటాయి.  ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి.  ఎముకలు బలహీనంగా ఉన్నవారు ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా మంచిది. మధుమేహం.. ఖర్జూరం తీపి ఎక్కువగా ఉన్నా నానబెట్టిన తరువాత వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఈ కారణంగా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునే వారు నానబెట్టిన ఖర్జూరం తింటే చక్కెర స్థాయిలు ఆరోగ్యంగానే ఉంటాయి. రక్తహీనత.. భారతదేశంలో ఎక్కువ మంది మహిళలు రక్తహీనత తో బాధపడుతున్నారు.  ఖర్జూరంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల నానబెట్టిన ఖర్జూరాలు రోజూ ఉదయమే తింటూ ఉంటే హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. ఒత్తిడి.. ఖర్జూరాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.  ఒత్తిడితో పోరాడేవారు రోజూ ఉదయం నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఒత్తిడి తగ్గుతుంది. తల్లిపాలు.. పరిశోధనల ప్రకారం పిల్లలకు పాలిచ్చే తల్లులు ఉదయాన్నే నానబెట్తిన ఖర్జూరం తింటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.                                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
నానబెట్టిన ఖర్జూరం తింటే కలిగే లాభాలేంటో తెలుసా? Publish Date: Jun 6, 2025 9:30AM

మనిషికి తృప్తి కావాలంటే ఇలా జీవించాలి..

ప్రతి మనిషి తన జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. అయితే కోరుకున్నంత సులభంగా అలాంటి జీవితం లభించదు. నిజానికి ప్రశాంతమైన జీవితం వేరు, సుఖాల మయమైన జీవితం వేరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ముందు. ప్రశాంతమయమైన జీవితం కావాలి అంటే…  ప్రతి నిముషంలోని ఆనందాన్నీ, సంతృప్తినీ వెలికి తీయగల గని కార్మికుడి లాగా పని చేయాలి. మనం ఎంత సాధించినా, ఎంత డబ్బునూ, ఆస్తుల్నీ సంపాదించినా చివరికి మన వెనకున్న ఎవరికో ఒకరికి సర్వం సమర్పించి అంతా వదలి వెళ్ళాలన్న సాధారణ సత్యాన్ని ఆకళింపు చేసుకోవాలి. అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు నిజంగా మనం సంతృప్తికరంగా జీవించగలమా అంటే అవును  జీవించగలం.  కొంతమంది ఏమి చేస్తారంటే… ఎదుటి వాళ్ళు కార్లు, బంగాళాలు కొంటూ విలాసవంతంగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళు ఎంత గొప్పగా బ్రతుకుతున్నారు అని అంటారు. కానీ ఎలాంటి గొడవలు, చింతలు లేకుండా హాయిగా ఉన్నవారే నిజమైన గొప్ప జీవితం కలిగి ఉన్నవారు అనే విషయాన్ని గ్రహించాలి.  మరికొందరు గొప్పగా బ్రతకడం అంటే అది అదృష్టం వలన లభించేది అని అనుకుంటారు. కానీ అది అదృష్టం వల్ల దొరికేది కాదు. అది మనకు మనంగా ఎంచుకొనే తెలివైన ఎంపిక.  ఇలాంటి ఎంపిక ఎలా సాధ్యం అని ప్రశ్నించుకుంటే.. మనం ఆలోచించడం మొదలు పెట్టాలి ముందు.  ఈ రోజున మనకు తెల్సిన పరిస్థితుల మధ్య, మనం అనుభవిస్తున్న పరిస్థితుల మధ్య, మనం సిద్ధంగా ఉన్న అవకాశం లభించినప్పుడు ఆనందంగా గడపగలమో..... లేక మనకు తెలియని రేపటి పరిస్థితుల మధ్య, మనం చూడలేని పరిస్థితులలో ఆనందంగా గడపగలమో నిర్ణయించుకోవాలి.   భవిష్యత్తు అనేది కేవలం మనం మన ఊహల్లో నిర్మించుకొనే ఒక సామ్రాజ్యం. ఈ వాస్తవమైన ఈ రోజుని ఆనందంగా జీవించలేనపుడు.. రేపటి రోజున ఎలా ఆనందంగా జీవించగలం? కాలం మన మృత్యువునీ ఎన్నటికీ వాయిదా వెయ్యదు, అది దానికి సమయం వచ్చినప్పుడు అట్లా మనల్ని తీసుకుని వెళ్లిపోతుంది. అలాంటప్పుడు మన ఆనందపు సమయాన్ని మాత్రం మనం ఎందుకు వాయిదా వెయ్యడం. మనకు దొరికిన గొప్పవరం ఏదైనా ఉందంటే అది ఈరోజే.., ఇది మళ్ళీరాని అవకాశం, ఈ రోజున మనం అనుభవించిన సంతోషాలూ, గడిపిన క్షణాలు మళ్ళీ అదే విధంగా మరో రోజు ఉండకపోవచ్చు.   ఒక వేళ మన ఆయుష్షు లక్ష రోజులైతే... అది ఖచ్చితంగా ప్రతి రోజూ ఓ విలక్షణమైన పుస్తకం లాంటింది.  ఏ పుస్తకమూ మరో పుస్తకంలా ఉండదు. అలాగే  మన అద్భుతమైన రోజు భవిష్యత్తులో మరో రోజు పునరావృతం కాదు. ప్రతి రోజు ఓ సరిక్రొత్త అనుభవం. అందుకే ఏ సరిక్రొత్త అనుభవాన్ని వదులుకోకూడదు. బోటన వ్రేలి గుర్తులు ప్రపంచంలో ఏ ఇద్దరికీ ఒకేలా ఉండవో అలాగే మన జీవితకాలంలోని ఏ రెండు రోజులూ ఒకేలా వుండవు. సరిక్రొత్త విశేష విజయాలను, అవకాశాలను ఈ రోజే సృష్టించుకోవాలి.  మరో రోజును వేరొక అవకాశాన్ని సృష్టించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మనం గతంలో జరిగిన సంఘటనలనీ, భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే ఆలోచనలతో, నిన్నటినీ, రేపటినీ కలిపి ఈ రోజు జీవించడానికి ప్రయత్నిస్తుంటాం. నిన్నటి పాత జీవితాన్ని మళ్ళీ నేడు బ్రతకడం ఎందుకు, వస్తుందో రాదో తెలియని రేపటిని ఈ రోజే జీవించాలన్న తపన ఎందుకు కేవలం నేటిని ప్రశాంతంగా జీవిస్తేచాలాదా!                                     ◆నిశ్శబ్ద.
మనిషికి తృప్తి కావాలంటే ఇలా జీవించాలి.. Publish Date: Jun 6, 2025 9:30AM

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏ1 ప్రభాకరరావు విచారణకు డుమ్మా.. ఇప్పుడేం జరుగుతుంది?

ట్యాపింగ్ కేసులో ఏ1 ముద్దాయి.. విచారణకు డుమ్మా కొట్టారు. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ఇచ్చిన హామీ మేరకు ఆయన గురువారం (జూన్ 5) విచారణకు హాజరు కావాలి. అలా హాజరౌతానని స్పష్టమైన హామీ ఇచ్చే సుప్రీం కోర్టు ద్వారా పాస్ పోర్టు సంపాదించుకున్నారు. అయితే ఆయన విచారణకు డుమ్మా కొట్టారు.  సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఒక సారి ఉపయోగించుకునే వన్ టైమ్ పాస్ పోర్టు ఆయనకు అందింది కూడా. దీంతో ఆయన స్వయంగా సుప్రీం కోర్టుకు చెప్పిన విధంగా మూడు రోజుల్లో అంటే  జూన్ 5న విచారణకు హాజరౌతారనే అంతా భావించారు. కానీ ఆయన విచారణకు రాలేదు.  దీంతో న్యాయనిపుణులు ప్రభాకరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని అంటున్నారు.  అయితే ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయారనీ రెండు రోజుల్లో వచ్చి విచారణకు హాజరౌతారనీ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.   అయితే ఆయన ఉద్దేశపూర్వకంగానే విచారణకు అందుబాటులోకి రాకుండా తప్పించుకుంటున్నారన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది. తొలుత ఆరు నెలల్లో వస్తానన్నారు. అంతా నిజమేనని నమ్మారు. ఆ తరువాత అమెరికా నుంచి ఇక తిరిగి వచ్చేది లేదని చాటుతున్న విధంగా గ్రీన్ కార్డు తీసుకున్నారు.  దీంతో ఆయనను ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించేందుకు తెలంగాణ సర్కార్ రెడీ కావడంతో గత్యంతరం లేక సుప్రీంను ఆశ్రయించి పాస్ పోర్టు ఇప్పిస్తే విచారణకు హాజరౌతానని అన్నారు.  ఆయన విజ్ణప్తిపై సుప్రీం సానుకూలంగా స్పందించింది. ఆయనకు పాస్ పోర్టు అందింది. అయితే చెప్పినట్లుగా.. విచారణకు రాకుండా ప్రభాకరరావు గైర్హాజరయ్యారు. దీంతో ఆయన తీరు పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన గైర్హాజరీ కోర్టు ధిక్కరణేనని అంటున్నారు. ఆయన సన్నిహితులు మాత్రం ప్రభాకరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడే సాహసం చేయరనీ, రెండు లేదా మూడు రోజులలో విచారణకు హాజరౌతారనీ అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. 
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏ1 ప్రభాకరరావు విచారణకు డుమ్మా.. ఇప్పుడేం జరుగుతుంది? Publish Date: Jun 6, 2025 9:29AM

భటింగే తో కటింగే.. నినాదం కాదు, నిజం!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వానికి వరసగా మూడవసారి ప్రజా పట్టాభిషేకం జరిగి సంవత్సరం పూర్తయింది. అవును.. గత సంవత్సరం జూన్ 4,5 తేదీలలో  2004 లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఎ విజయ కేతనం ఎగరేసింది. మోదీ సర్కార్ ముచ్చటగా మూడవసారి అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్ కొట్టింది. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరసగా మూడవ సారి ప్రధాని పదవిని చేపట్టిన తొలి ప్రధానిగా మోదీ చరిత్రలో స్థానం  సంపాదించుకున్నారు. అంతవరకు బాగుంది..  అయితే  ఈ ఎన్నికల్లో ప్రజలు అంతకు మించిన సందేశమే ఇచ్చారు.  2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ  ప్రజలు వరసగా మూడవ సారి  ప్రధాని మోదీ పాలన పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అయితే అది సంపూర్ణమా అంటే కాదు. ఎన్డీయేకి అధికారాన్నిఅయితే అప్పగించారు కానీ.. ఎన్డీఎకు ఆశించిన మెజారిటీ రాలేదు. అలాగే..  ఎన్డీఎ కూటమికి సారధ్యం వహిస్తున్న బీజేపీకి కూడా ఆశించిన ఫలితాలు రాలేదు.  కమల దళం కలలు కన్న 400 ప్లస్  (చార్ సౌ పార్) నెంబర్ కు ఆమడల దూరంలోనే బీజేపీ స్కోర్ ఆగిపోయింది. ఆశించిన నెంబర్ రాక పోవడమే కాదు.. సిట్టింగ్ స్థానాలకే పెద్ద ఎత్తున గండి పడింది.  బీజేపీ బలం 303 నుంచి 240కి పడిపోయింది.  అంతే కాదు వరసగా రెండు ఎన్నికల్లో (2014,2019), సోంతంగానే మెజారిటీ సొంతం చేసుకున్న బీజేపీ మూడవ సారి మాత్రం ఆ మెజారిటీ సాధించలేకపోయింది.  బీజేపీ ఎంపీల సంఖ్య సింపుల్ మెజారిటీకి 32 సీట్ల దూరంలో ఆగిపోయింది. అయినా..  ఎన్డీఎ కూటమి 293 సీట్లు గెలవడంతో అధికారం నిలబడింది. ముఖ్యంగా తెలుగుదేశం (16), జనతదళ్(యు)(11) మద్దతుతో మోదీ ముచ్చటగా మూడవ సారి ప్రధాని అయ్యారు.  మోదీ ప్రధాని అయ్యారు కానీ..  మోదీ 3.0 ప్రభుత్వం ముందులా కీలక నిర్ణయాలు తీసుకోగల్గుతుందా?  మోదీ  సుస్థిర పాలన కొనసాగించ గలరా? అనే అనుమానాలు  రాజకీయ వర్గాల్లో సర్వత్రా వ్యక్తమయ్యాయి. మరో వంక.. సంకీర్ణ కట్టుబాట్లు  జాతీయవాద ఎజెండాకు బ్రేకులు వేస్తాయా?  అనే సందేహాలు సంఘ్ పరివార్ వర్గాల్లో వ్యక్తమయ్యాయి.  అయితే.. ఇటు చంద్రబాబు, అటు నితీష్ కుమార్ మోదీకి అండగా నిలవడంతో ఆనాటి అనుమానాలు అన్నీ తొలగి పోయాయి. మోదీ సర్కార్   ప్రయాణం సజావుగా సాగుతోంది.  ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలు  ముఖ్యంగా.. టీడీపీ అధినేత,ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు) అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజనీతిజ్ఞతతో   పార్టీలు వేరైనా  అంతరంగం ఒకటే అన్నట్లుగా సుస్థిర అభివృద్దే లక్ష్యంగా ఒకటిగా సాగుతున్నారు. అందుకే.. మోదీ ప్రభుత్వం పేరుకు సంకీర్ణ ప్రభుత్వమే అయినా  సుస్థిరంగా సాగుతోందని విశ్లేషకులు అంటున్నారు. చివరకు,  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కూడా  మోదీ 3.0 ప్రభుత్వం  ముందు కంటే మరింత స్థిరంగా ముందుకు సాగుతోందనీ, శషబిషలు లేకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. మరోవంక.. 2024 ఎన్నికల ఫలితాలు  ప్రతిపక్ష ఇండియా కూటమి, ముఖ్యమంగా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆశలకు అవకాశం కల్పించాయి.  వరసగా రెండు ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని  కాంగ్రస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్ష హోదాను ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రతిపక్ష  నాయకుడయ్యారు.  అదొకటి అయితే..  2024 ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును, విశ్లేషించుకుంటే, అటు బీజేపీకి అయినా ఇటు కాంగ్రెస్ కు అయినా  మిత్ర పక్షాల చేదోడు అవసరమని స్పష్టం చేశాయి. మిత్రపక్షాల సహకారం లేకుండా  అధికారమే కాదు.. ప్రతిపక్ష హోదా కూడా అసాధ్యమనే వాస్తవాన్ని 2024 ఎన్నికల ఫలితాలు విశదీకరించాయి.   నిజానికి.. 2024 ఎన్నికల ఫలితాలే కాదు, ఈసంవత్సర కాలంలో జరిగిన వివిధ రాష్ట్రాల శాసన సభల ఎన్నికల ఫలితాలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. అందుకే, బీజేపీ  ఎక్ హై తో సేఫ్ హై.. భటింగే తో కటింగే’ (కలిసి ఉంటే కలదు సుఖం,విడిపోతే పడిపోతాం) అనే  నినాదాన్ని ఉభయ తారకంగా ఉపయోగించుకుని  లోక్ సభ ఎన్నికల నష్టాన్ని  మహరాష్ట్ర, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో పూడ్చుకుంది. ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి రావడంమే కాకుండా.. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన జమ్మూ కశ్మీర్, ఝారఖండ్  తదితర రాష్ట్రల్లోనూ  ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందగలిగింది. మరో వంక కాంగ్రెస్ పార్టీ  పరిస్థతి ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. దేశ రాజధానిలో వరసగా అరవ సారి జీరో’ గా మిగిలింది.  సో...   ఎక్ హై తో సేఫ్ హై.. భటింగే తో కటింగే’ నినాదం కాదు నిజం అంటున్నారు.
భటింగే తో కటింగే.. నినాదం కాదు, నిజం! Publish Date: Jun 6, 2025 9:08AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కోనసాగుతున్నది. వారాంతం సమీపిస్తుండటం, వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వెలుపలి వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా  సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని మొత్తం 67 వేల 284 మంది దర్శించుకున్నారు. వారిలో 31 వేల 253 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 34 లక్షల రూపాయలు వచ్చింది.   
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ Publish Date: Jun 6, 2025 8:50AM

48 గంటల అబ్జర్వేషన్‌లో మాగంటి.. దేవుడి దయతో కోలుకోవాలి : హరీశ్ రావు

  జూబ్లీహిల్స్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ దేవుడి దయతో  కోలుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు వెళ్లిన ఆయన గోపీనాథ్‌ ఆరోగ్యంపై ఆరా తీశారు. నిపుణులైన వైద్యలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మరో 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంటారని హారీశ్‌రావు తెలిపారు. మాగంటి త్వరగా కోలుకుని త్వరలోనే ప్రజా జీవితంలోకి వస్తారని ఆశిస్తున్నాని ఆయన పేర్కొన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతు గోపీనాథ్‌ కోలుకుంటున్నారని గోపీనాథ్‌ వైద్యానికి స్పందిస్తున్నారని తెలిపారు. ఇటీవల బోరబండకు చెందిన బీఆర్‌ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు మహ్మద్‌ సర్దార్‌ ఆత్మహత్య ఘటనతో మాగంటి ఒత్తిడికి గురయ్యారన్నారు.  48గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారని వివరించారు. మాగంటి గోపీనాథ్‌కు సీనియర్‌ వైద్యులు చికిత్స అందిస్తున్నారని, క్షేమంగా బయటికొస్తారనే విశ్వాసం ఉందన్నారు. 48 గంటల తర్వాత వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తారని తెలిపారు. అయితే ఆయన వెంటీలేటర్ పై చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని ఆయన బంధువులు పేర్కొన్నారు. ఆయన అనారోగ్యంపై వస్తున్న వందతులను కొట్టిపారేశారు. గోపీనాథ్ కు ఐసీయూలో 48 గంటల అబ్జర్వేషన్ కొనసాగుతోందని, ఆయన చనిపోయారంటూ వస్తున్న వార్తలు అసత్యం అన్నారు.దయచేసి అలాంటి వదంతులను ప్రచారం చేయవద్దని మీడియా మిత్రులను కోరారు. మరోవైపు గోపీనాథ్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు భారీ ఎత్తున ఆసుపత్రికి తరలివచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తదితరులు ఆసుపత్రికి చేరుకొని గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.     
48 గంటల అబ్జర్వేషన్‌లో మాగంటి.. దేవుడి దయతో  కోలుకోవాలి : హరీశ్ రావు Publish Date: Jun 5, 2025 9:39PM

టీడీపీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న మాగంటి గోపీనాథ్

  జూబ్లీహిల్స్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గుండె సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురైనట్టు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకంగా ఉన్నట్టు సమాచారం. మాజీ మంత్రి హరీశ్‌రావు, పలువురు భారాస నేతలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకుని గోపీనాథ్‌ ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని హరీశ్‌రావు తెలిపారు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రాజకీయ ఓనమాలు నేర్చుకుంది టీడీపీలోనే. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తన 26 ఏళ్ల వయస్సులో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 1985 నుంచి 1992 వరకు  పనిచేశారు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ హుడా డైరెక్టర్‌గా పనిచేశారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, హైదరాబాద్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఇలా వివిధ హోదాల్లో పార్టీకి సేవలందించారు.గోపినాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ  నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత రాష్ట్రంలో మారిన పరిణామాలతో టీఆర్ఎస్‌లో చేరిన ఆయన 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గులాబీ టికెట్‌పై పోటీ చేసి రెండు సారి విజయం సాధించారు. ఆయన 2018లో శాసనసభలో పీఈసీ సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023 ఎన్నికల్లో మూడో బీఆర్ఎస్ టికెట్‌తో పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యూయేట్ అయిన గోపీనాథ్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.
టీడీపీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న మాగంటి గోపీనాథ్ Publish Date: Jun 5, 2025 8:15PM

విశాఖ రైల్వే జోన్‌కు ముందడుగు..తొలి జీఎంగా సందీప్ మాథుర్

  విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో మరో ముందడుగు పడింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తొలి జీఎంగా సందీప్ మాథుర్ నియమితులయ్యారు. ఈ మేరకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ మేనేజర్ నియామకం ఆనందంగా ఉంది. ఇది కేవలం పరిపాలనాపరమైన చర్య కాదు. ఈ జోన్ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంలో ఒక మైలురాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సహకారంతో మన ప్రాంత వాగ్దానాలు నెరవేరుతున్నాయి' అని కేంద్రమంత్రి రామ్మోహన్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల ఎట్టకేలకు సాకారమవుతోంది. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా ముందుకు సాగుతోంది.విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తామని ఏపీ విభజన చట్టంలో హామీ ఇచ్చింది నాటి కేంద్ర ప్రభుత్వం. అయితే గత పదేళ్లుగా ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా జోన్‌ వ్యవహారం ముందుకు సాగలేదు. ఇటీవల కూటమి సర్కార్ ప్రయత్నాలు ఫలించడంతో కేంద్రం నుంచి విశాఖ రైల్వేజోన్‌పై కదలిక వచ్చింది.    
విశాఖ రైల్వే జోన్‌కు ముందడుగు..తొలి జీఎంగా సందీప్ మాథుర్ Publish Date: Jun 5, 2025 7:18PM

సొంత పార్టీ ఎంపీపై కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

  నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కి ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షీ నటరాజన్‌కి ఫిర్యాదు చేశారు..పెండింగ్ బిల్లులను ఇప్పించి వారి నుంచి 10 శాతం కమిషన్ వసూలు చేసుకుని తన సొంత లాభానికి పాల్పడ్డాడని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల బిల్లులు క్లియర్ చేయకుండా బీఆర్ఎస్ నేతల బిల్లులు క్లియర్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలంపూర్ బీఆర్ఎస్  ఎమ్మెల్యే  విజయుడుని కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.ఇలాంటి చర్యలతో పార్టీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉందని.. వెంటనే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సొంత పార్టీ ఎంపీపై కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు Publish Date: Jun 5, 2025 6:27PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమం

    జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు.. మాగంటి గోపీనాథ్‌ను గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు గ‌చ్చిబౌలి ఏఐజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.గతంలో కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆయన అస్వస్థతకు గురియ్యారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు, ప‌లువురు నాయ‌కులు ఏఐజీ ఆస్ప‌త్రికి వెళ్లారు. మరోవైపు మాగంటి  ఆరోగ్య పరిస్థితిపై వారి కుటుంబ సభ్యులను  మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కాగా ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్టు హరీష్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం గోపీనాథ్ వెంటీలేటర్ మీద చికిత్స పొందుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నట్టు మాజీమంత్రి తెలిపారు
 బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమం Publish Date: Jun 5, 2025 5:59PM