స్టేడియంలో కూరగాయల మార్కెట్!
posted on Mar 31, 2020 1:58PM
ఎల్బీనగర్ కూరగాయల మార్కెట్ ను తాత్కాలికంగా సరూర్ స్టేడియంలోకి తరలించడానికి జరుగుతున్న ఏర్పాట్లను తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ప్రజలకు ఏ ఇబ్బంది రానివ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ల, పలు ఖాళీ ప్రదేశాలకు తరలిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
కరోనా వైరస్ ప్రబలకుండా ప్రజలు గుమిగూడే అవకాశం లేకుండా, కొనుగోళ్లకు వచ్చిన ప్రజలు ఖచ్చితంగా సామాజిక దూరం పాటించేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మొబైల్ రైతుబజార్ల ద్వారా వీలయినన్ని ఎక్కువ ప్రాంతాలకు తక్కువ ధరకు తాజా కూరగాయల్ని పంపిస్తున్నారు.
ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటించి కరోనా వైరస్ ప్రబలకుండా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఈ పరిస్థితుల నుండి బయటపడేందుక ప్రజల సహకారం సంపూర్ణంగా ఉండాలని ఆయన అన్నారు.