ఏపీలో మరో 17 కరోనా కేసులు.. ఢిల్లీ వెళ్లిన వారు మొత్తం 711

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటీవ్ కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులలో కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. గత రాత్రి వరకు 164 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా 147 మందికి నెగిటివ్ రాగా 17 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40 కి చేరింది.

ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో అత్యధిక మందికి కరోనా సోకిందని తేలడంతో.. వారితో సన్నిహితంగా మెలిగినవారు, వారితో కలిసి ప్రయాణించిన వారిలో ఆందోళన నెలకొంది. దీంతో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది. రాష్ట్రం నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారి లెక్క తేల్చింది. ప్రార్థనలకు వెళ్లినవారు మొత్తం 711 మందిగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారందరూ తమ దగ్గరలోని ప్రభుత్వాసుపత్రులకు వెళ్లి చెక్ చేయించుకోవాలని.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.