తెలంగాణ నిజం...సమైక్యాంధ్ర ఒక కల
posted on Sep 10, 2013 3:58PM
తెలంగాన అనేది ఒక నిజం … సమైక్యాంధ్ర అనేది ఓ కల. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం జరిగిపోయింది. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం. దాని గురించి ఎలాంటి అనుమానమూ లేదు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వి ఉత్తర కుమార ప్రగల్భాలు. ఆయన కలలు నిజం కావు అని కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కీ అన్నారు. తెలంగాణ నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే వస్తుందని, హైదరాబాద్ విషయంలో కేంద్రం ఓ స్పష్టమయిన అవగాహనతో ఉందని అన్నారు. అసలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏ ప్రాంతానికి ముఖ్యమంత్రి అన్నది స్పష్టం చేయాలని, త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తుందని, ఈ నెల 15న జరిగే తెలంగాణ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలోని బహిరంగ సభ విషయం ఖరారు చేస్తామని అన్నారు.